ఖమ్మం, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ వస్తే విద్యుత్ రంగ సంస్థలు కుప్పకూలిపోతాయని నాటి పాలకులు జోస్యం చెప్పారు.. రాష్ట్రం అంధకారం అవుతుందని శాపనార్థాలు పెట్టారు.. ఛత్తీస్గఢ్ విద్యుత్ తీగలకు కొక్కేలు వేసుకోవాలని హేళన చేశారు.. నవ్విన నాప చేనే పండినట్లు తెలంగాణ వచ్చినంక కేవలం ఆరు నెలల్లోనే విద్యుత్ సంస్థలను పటిష్టం చేశారు సీఎం కేసీఆర్. నాడు ఎద్దేవా చేసిన నోళ్లకు కళ్లెం వేశారు. కరెంట్ కోతలతో పంటలకు నీరు అందక నోళ్లు తెరుచుకున్న భూముల దాహార్తి తీర్చారు.24 గంటల పాటు పంటలకు నాణ్యమైన కరెంట్ ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు. హామీ ఇచ్చినట్లుగానే రైతుల నుంచి ఒక్కపైసా తీసుకోకుండా పంటలకు కరెంట్ అందిస్తున్నారు. నాయీబ్రాహ్మణుల సెలూన్లు, రజకుల లాండ్రీ షాపులకు నెలకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తూ వారికి ఆర్థిక భరోసానిస్తున్నారు. అంతేకాదు నిరంతర విద్యుత్ సరఫరాతో వెల్డింగ్, ఫ్యాక్టరీల యజమానులు, జిరాక్స్ సెంటర్ల నిర్వాహకులు సజావుగా తమ పనిచేసు కుంటున్నారు. అన్నింటికీ మించి నాడు కరెంట్ ఉంటే వార్త.. నేడు కరెంట్ పోతే వార్త.
స్వరాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్రంలో చీకట్లు కమ్ముకున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కరెంట్ కోతలకు కేరాఫ్గా ఉండేది. నాడు గ్రామాల్లో రోజుకు 12 నుంచి 16 గంటలు, మండల కేంద్రాల్లో 8 నుంచి 12 గంటలు, జిల్లా కేంద్రాల్లో 6 నుంచి 10 గంటల పాటు విద్యుత్ కోతలు ఉండేవి. రాజధాని హైదరాబాద్లోనూ విద్యుత్తు కోతలు ఉండేవి. పరిశ్రమలకు వారంలో రెండు రోజులు పవర్ హాలిడే ఉండేది. ఇక వ్యవసాయం గురించి ఎంత చెప్పుకున్నా తకువే. పేరుకే పంటలకు రోజుకు 6 గంటల ఉచిత కరెంట్. అది కూడా రెండు, మూడు విడతల్లో. రైతుల జీవితాలు రాత్రంతా పొలాల్లోనే గడిచేది. నాటి పాలకులు తెలంగాణ వస్తే రాష్ట్రం అంధకారమవుతుందని హేళన చేసినప్పటికీ సీఎం కేసీఆర్ అవేమీ పట్టించుకోలేదు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేవలం ఆరునెలల్లోనే విద్యుత్ రంగ సంస్థలను గాడిలో పెట్టారు. గృహ, వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేస్తున్నారు. 2018 జనవరి 1 నుంచి పంటలకు 24 గంటల పాటు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నారు. విద్యుత్శాఖ అధికారులు నాడు ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా రూ.1,084.20 కోట్లు ఖర్చు పెట్టి విద్యుత్ రంగాన్ని గాడిలోపెట్టారు.
బడుగు వర్గాలకు భరోసా..
నెలకు వంద యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించుకునే ఎస్సీ, ఎస్టీలు, 250 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించుకునే నాయీబ్రాహ్మణుల సెలూన్లు, రజకుల లాండ్రీ షాపులకు విద్యుత్ సరాఫరా చేయిస్తున్నారు. దేశంలో మరే ఇతర రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ ఆర్టిజన్లు అనే పేరుతో వారి ఉద్యోగాలను క్రమబద్ధీకరించింది. ఇలా ట్రాన్స్కో, జెనో, డిసంల పరిధిలో 286 మంది ఉద్యోగాలు పర్మినెంట్ అయ్యాయి. 2014లో జిల్లాలో 258 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ నమోదైంది. అది కాస్తా ఇప్పుడు 420 మెగావాట్లకు చేరుకున్నది. విద్యుత్తు వినియోగంలోనూ జిల్లా దూసుకెళ్తున్నది. 2014-15లో 438 యూనిట్ల తలసరి విద్యుత్తు వినియోగం ఉండగా ప్రస్తుతం తలసరి విద్యుత్తు వినియోగం 1,214 యూనిట్లకు చేరింది.
సబ్సిడీలు ఇలా..
జిల్లావ్యాప్తంగా 1,10,459 వ్యవసాయ మోటర్లు ఉన్నాయి. వాటికి ప్రభుత్వం 100శాతం సబ్సిడీతో విద్యుత్ సరఫరా చేస్తున్నది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా 38,220 వ్యవసాయ సర్వీస్ కనెక్షన్లు వచ్చాయి. ఆయా కనెక్షన్లకు సర్కార్ 267 కోట్ల సబ్సిడీ ఇచ్చింది. 36,095 మంది ఎస్సీ వినియోగదారులకు రూ.5.95 కోట్ల సబ్సిడీ, 21,821 ఎస్టీ వినియోగదారులకు రూ.3.63 కోట్ల సబ్సిడీ, 1,364 మంది నాయీ బ్రాహ్మణులకు రూ.60 లక్షలు, 5,070 ధోబీఘాట్లు, లాండ్రీషాపులకు రూ.3.12 కోట్ల రాయితీ ఇచ్చింది. 292 పౌల్ట్రీ ఫారాలకు ఒక యూనిట్కి రూ.2 సబ్సిడీ చొప్పున రూ.35 లక్షల సబ్సిడీ ఇచ్చింది.
నిరంతర విద్యుత్ సరఫరా..
గృహాలు, పరిశ్రమలు, షాపులకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటివరకు రూ.1,100 కోట్ల నిధులతో విద్యుత్ రంగాన్ని ప్రక్షాళన చేసింది. విద్యుత్ వ్యవస్థలను బలోపేతం చేసింది. సీఎం కేసీఆర్ విద్యుత్ సంస్థలను బలోపేతం చేయకపోతే పరిస్థితులు వేరేలా ఉండేవి. విద్యుత్ వ్యవస్థలను పటిష్టపరచడంతోనే ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నాం.
– సురేందర్, ఎస్ఈ, టీఎస్ ఎన్పీడీసీఎల్, ఖమ్మం సర్కిల్
సకాలంలో పనులు పూర్తి చేస్తున్నాం..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సరైన విద్యుత్ సరఫరా లేక కరెంట్పై ఆధారపడి షాపులు నడిపే వారంతా ఇబ్బంది పడ్డారు. కొన్నిసార్లు కరెంట్ కోసం రోజంతా ఎదురుచూసిన సందర్భాలు ఉన్నాయి. ఇక వేసవి వచ్చిందంటే షాపు తెరిచి ఉండేది కానీ, పని మాత్రం ఇక్క ఇంచుకు కూడా జరిగేది కాదు. కరెంట్ కోసం పడిగాపులు కాసి విసుగు వచ్చేది. పని పూర్తి చేయక, సమయానికి చేతికి డబ్బు అందక కుటుంబ పోషణ సైతం భారమయ్యేది. తెలంగాణ వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత షాపులకు నిరంతరం విద్యుత్ అందుతున్నది. మేం సకాలంలో పనులు పూర్తి చేస్తున్నాం. నేను ఇద్దరు మనుషులను పనిలో పెట్టి షాపు నడుపుతున్నాను. నాతోపాటు మరో రెండు కుటుంబాలు షాపుపై ఆధార పడి బతుకుతున్నాయి. అన్నిఖర్చులూ పోను నెలకు నేను తక్కువలో తక్కువ రూ.20 వేలు సంపాదిస్తున్నాను.
– వెగ్గల కాంతారావు, వెల్డింగ్ షాప్ యజమాని, జానకీపురం, బోనకల్లు మండలం
కేసీఆర్ సారే గెలవాలి..
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 24 గంటల పాటు గృహాలు, పరిశ్రమలు, పంటలకు కరెంట్ అందుతున్నది. దీనివల్ల చిన్న, సన్న కారు వ్యాపారులు, చేతి వృత్తులు చేసుకునేవాళ్లు, రైతులు ఎంతో ప్రయోజనం పొందుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు పని చేసుకుంటున్నారు. నేను జిరాక్స్ సెంటర్ నడిపిస్తున్నాను. షాపు నిర్వహణ సక్రమంగా సాగడంతో షాపు అద్దె, కరెంట్ బిల్లు అన్నీ కట్టగలుగుతున్నా. కరెంట్కోతలు ఉంటే షాపు నిర్వహణ కష్టంగా ఉండేది. తొమ్మిది సంవత్సరాల నుంచి కరెంట్ ఇబ్బందులు లేవు. ఈ మధ్య కాంగ్రెసోళ్లు తాము అధికారంలోకి వస్తే ఇంత కరెంట్ ఇస్తం. అంత కరెంట్ ఇస్తం అంటున్నారు. వాళ్ల మాటలు జనం నమ్మడం లేదు. కాంగ్రెసోళ్లు అధికారంలోకి వస్తే మళ్లీ చీకట్లు కమ్ముకుంటాయి. సీఎం కేసీఆర్ అధికారంలోకి వస్తేనే ఇళ్లు, షాపుల్లో వెలుగులు కొనసాగుతాయి.
– గోదా వరలక్ష్మి, జిరాక్స్సెంటర్ యాజమాని, పెనుబల్లి
24 గంటల కరెంటుతో చేతినిండా పని
తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఇండ్లు, పరిశ్రమలు, షాపులకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నారు. కరెంట్ కోతలు లేకపోవడంతో మా ఎలక్ట్రీషియన్లంతా ఫికర్ లేకుండా పనులు చేసుకుంటున్నారు. మాకిప్పుడు చేతినిండా పని దొరుకుతున్నది. నేను నెలకు సుమారు రూ.15 వేల వరకు సంపాదిస్తున్నాను. మాలాంటి వాళ్లకు కేసీఆర్ దేవుడు. మాలాగే లాండ్రీ, సెలూన్, జ్యూస్, కూల్డ్రింక్స్ షాపు యజమానులు కరెంట్పై ఆధారపడి బతుకుతున్నారు. బతుకుబండిని సాఫీగా సాగిస్తున్నారు.
– ఎస్కే నజీర్, ఎలక్ట్రీషియన్, చండ్రుగొండ
తెలంగాణ వచ్చాకనే పరిస్థితులు మారాయి..
ఉమ్మడి పాలనలో కరెంటు కోతలతో అల్లాడిపోయాం. పొద్దుగాల కరెంట్ పోయిందంటే ఇక ఎప్పుడొస్తదో తెలిసేది కాదు. రాత్రిళ్లు కరెంట్ ఉంటే పని చేసేవాళ్లు దొరికేవారు కాదు. వినియోగదారులు ఇచ్చిన ఆర్డర్లను కొన్నిసార్లు క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చేది. ఇలా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాం. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అయి కరెంట్ కష్టాలను తొలగించారు. తొమ్మిదేండ్ల సంది కరెంట్ పోవుడనే ప్రశ్నే లేదు. నిరంతరం కరెంట్ ఉంటున్నది. మేం కూడా మంచిగ పనిచేసుకుంటున్నం. ఆర్డర్లు మంచిగ వస్తున్నాయి. వ్యాపారం బాగా సాగుతున్నది. బీఆర్ఎస్ పాలన మరోసారి కొనసాగాలని కోరుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్లా మనం చీకట్లోకి పోతాం.
– వీరబత్తిని సుధాకర్, వెల్డింగ్ షాప్ యజమాని,ఇండస్ట్రీయల్ ఏరియా, భద్రాచలం
కులవృత్తులకు ప్రోత్సాహం..
సీఎం కేసీఆర్ సార్ కులవృత్తులకు పూర్వవైభవం తీసుకొస్తున్నారు. కుల వృత్తిదారులకు చేయూతనిస్తున్నారు. రాయితీలు అందించి ఆర్థిక భరోసానిస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వమూ వెనుకబడిన వర్గాల సంక్షేమాన్ని పట్టించుకోలేదు. ఉమ్మడి పాలనలో నాయీబ్రాహ్మణులకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఉండేవి కాదు. సీఎం కేసీఆర్ సెలూన్లకు నెలకు 250 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తున్నారు. మాకు అండగా నిలిచి మా సంక్షేమం కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
– ఆళ్లగడప భిక్షం, సెలూన్ షాపు యాజమాని, కూసుమంచి
గతంలో విద్యుత్ కోతలతో నష్టపోయాం..
నాటి వలస పాలకుల హయాంలో విద్యుత్ కోతలు భరించలేని విధంగా ఉండేవి. రోజులో కనీసం మూడు నుంచి ఇంకా ఎక్కువ గంటల విద్యుత్ కోతలు ఉండేవి. కోతల వల్ల మేము ఎంతో నష్టపోయాం. కరెంట్పై ఆధారపడి బతికేవాళ్లను కోతలు ఎంతో ఇబ్బంది పెట్టేవి. తెలంగాణ వచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉడుంపట్టు పట్టి విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టారు. ప్రజల అవసరాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నారు. దీంతో షాపుల నిర్వహణ సజావుగా సాగుతున్నది.
– శీలంశెట్టి దుర్గాప్రసాద్, ఫర్నీచర్ తయారీదారుడు, అశ్వారావుపేట
నాడు కరెంట్ కోతలతో సాగును పక్కన పెట్టాం..
నాడు ఉమ్మడి పాలనలో కరెంట్ కోతలకు తాళలేక సాగు వదిలేశాను. నాటి కాంగ్రెస్, టీడీపీ పాలకులు రైతు సమస్యలను పట్టించుకునేవారు కాదు. మేం వాగులు, బావులపై ఆధారపడి పంటలు పండించేవాళ్లం. కరెంట్ పోతే ఇక అంతే సంగతులు. రోజు పంటలకు కనీసం 7 గంటలు కరెంట్ ఇస్తే అక్కడికే గగనం. కరెంట్ కోసం రాత్రంతా పొలాల వద్ద పడిగాపులు కాసేటోళ్లం. చేసేదేం లేక పంటలకు డీజిల్ ఇంజిన్లతో నీరు పెట్టేటోళ్లం. ఖర్చులు తడిసిమోపెడయ్యేవి. తెలంగాణ వచ్చిన తర్వాత 24 గంటల పాటు పంటలకు కరెంట్ అందుతున్నది. రైతుల కష్టాలు తీరి హాయిగా పంటలు సాగుచేసుకుంటున్నారు.
– తోటకూర అనంతరాములు, రైతు, జానకీపురం, బోనకల్లు మండలం