సమైక్య పాలనలో తరచూ విద్యుత్ కోతలు.. ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియని దుస్థితి.. పంటకు నీరు పెట్టేందుకు రాత్రిళ్లు పొలాల వద్ద పడిగాపులు.. పాము కాటుకు గురై మృతిచెందిన రైతులు ఎంతోమంది. తట్టుకోలేక రైతులు సబ్ స్టేషన్ల ముట్టడి చేసేవారు.. ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించేవారు. కొందరు పోలీస్ దెబ్బలకు గాయాల పాలయ్యే వారు.. తెలంగాణ వస్తే ఏమొస్తది..? అని, ‘ఒకవేళ రాష్ట్రం సిద్ధిస్తే కరెంట్ కోసం పొరుగు రాష్ర్టాలకు కొక్కేలు వేసుకోవాలి..’ అని నాటి పాలకులు ఎగతాళి చేసేవారు.. నవ్విన నాప చేనే పండినట్లు స్వరాష్ట్రం వచ్చింది.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ కరెంట్ కష్టాలకు చెక్ పెట్టారు. రాష్ట్రమంతటా విద్యుత్ వెలుగులు నింపారు.. అంతేకాదు ఎస్సీ, ఎస్టీల గృహాలకు నెలకు 100 యూనిట్లు, నాయీ బ్రాహ్మణుల సెలూన్లు, రజకుల ధోబీ ఘాట్లకు 250 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తున్నారు..
మామిళ్లగూడెం, జూన్ 4: 2014 జూన్ 2 నాడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే నాటికి రాష్ట్రంలో చిమ్మచీకట్లు ఉండేవి. పవర్ హాలీడేలు అమల్లో ఉండేవి. తెలంగాణను అగ్రస్థానంలోకి చేర్చాలంటే ముందుగా విద్యుత్ సమస్యను పరిషరించాలని సంకల్పించిన సీఎం కేసీఆర్.. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకున్నారు. మొట్టమొదటి సమీక్ష విద్యుత్ పైనే నిర్వహించి స్వల్ప, మధ్య, దీర్ఘ కాలిక లక్ష్యాలు నిర్దేశించారు. ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ నష్టాలను 16.89 శాతం నుంచి 15.89 శాతానికి తగ్గించారు. 24 గంటల విద్యుత్ను మొదటగా గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు అందించేలా చర్యలు తీసుకున్నారు. తెలంగాణ జెనో ఆధ్వర్యంలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఉత్పత్తిని పెంచారు. విద్యుత్ సంస్థల కార్మికులు, ఉద్యోగులు ఏకతాటిపై నిలిచి సొంత రాష్ట్రం కోసం రాత్రీ పగలూ శ్రమించారు. ముందుగా వ్యవసాయానికి 9 గంటల విద్యుత్తు అందించారు. రోజురోజుకూ విద్యుత్తు సరఫరా, పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేస్తూ ముందుకు సాగారు. ఇందుకోసం ఖమ్మం జిల్లాలో రూ.1084.20 కోట్లు వెచ్చించారు. యావత్ దేశం ఆశ్చర్యపోయేలా 2018 జనవరి 1 నుంచి వ్యవసాయానికి 24 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ను సరఫరా చేశారు. ఇప్పుడు దేశంలో అత్యంత నమ్మకమైన, నాణ్యమైన 24 గంటల విద్యుత్ ఎకడ ఉందంటే అది తెలంగాణలో మాత్రమే. 100 యూనిట్లు వినియోగించుకునే ఎస్సీ, ఎస్టీలకు, 250 యూనిట్లలోపు వినియోగించుకునే రజకులు, నాయీబ్రహ్మణలకు ఉచిత్ సెలూన్లకు ఉచిత విద్యుత్ను అందిస్తున్నారు.
రెగ్యులరైజేషన్
దేశంలో ఏ రాష్ట్రం కూడా చేయలేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ ఆర్టిజన్లుగా రెగ్యులరైజ్ చేసింది. ట్రాన్సోకో, జెన్కోలో కలిపి ఖమ్మం జిల్లాలో మొత్తం 286 మందిని రెగ్యులరైజ్ చేసింది. ఇది దేశంలోని విద్యుత్ రంగ చరిత్రలోనే రికార్డు.
తలసరి వినియోగం..
ఏ జిల్లా అయినా అభివృద్ధి చెందుతుందనడానికి తలసరి విద్యుత్ వినియోగాన్ని కొలమానంగా చూస్తారు. జిల్లా 2014-15లో 438 యూనిట్లు తలసరి విద్యుత్ వినియోగం ఉండగా ప్రస్తుతం అది 1,214 యూనిట్లకు చేరింది. వ్యవసాయంతోపాటు ప్రతి రంగానికి 24 గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్ను అందించేందుకు వీలుగా జిల్లాలో రూ.925.25 కోట్లతో ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలను బలోపేతం చేశారు. ఇందులో భాగంగా ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లు, విద్యుత్తు లైన్లను గణనీయంగా పెంచారు. సాంకేతిక సమస్యలు ఎక్కడున్నా పరిషరించారు. ఒకప్పుడు విద్యుత్ ఉంటే వార్తగా చెప్పుకునేవారు. ఇప్పుడు విద్యుత్తు పోతే వార్తగా చెప్పుకుంటున్నారు. జిల్లాలో 2014లో 258 మెగావాట్లు (6.6.2014) గరిష్ఠ డిమాండ్ నమోదైంది. అది కాస్తా ఇప్పుడు 420 మెగావాట్ల (30.3.2023)కు చేరుకుంది.
పలు వర్గాలకు ఉచిత విద్యుత్
జిల్లాలో 1,10,459 వ్యవసాయ మోటర్లకు 24 గంటల ఉచిత సరఫరాను ప్రభుత్వం వంద శాతం సబ్సిడీతో అందిస్తోంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాలో కొత్తగా 38,220 వ్యవసాయ కనెక్షన్లను రూ.267 కోట్ల సబ్సిడీతో ఇచ్చారు. సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా పేద వర్గాలకు ఉచిత్ విద్యుత్ను అందిస్తున్నారు. జిల్లాలో నెలకు వంద యూనిట్లలోపు విద్యుత్ను వినియోగించుకునే 36,095 మంది ఎస్సీలకు రూ.5.95 కోట్లు, 21,821 ఎస్టీలకు రూ.3.63 కోట్ల చొప్పున ప్రతి నెలా సబ్సిడీ అందిస్తోంది. నెలకు 250 యూనిట్లలోపు వినియోగించుకునే 1,364 మంది నాయీ బ్రాహ్మణులకు రూ.60 లక్షల మేర, 5,070 మంది రజకులకు (దోభీ ఘాట్లు, లాండ్రీ దుకాణాల కోసం) రూ.3.12 కోట్ల మేర ఉచిత విద్యుత్ను అందిస్తోంది. జిల్లాలోని 292 పౌల్ట్రీలకు యూనిట్కి రూ.2 చొప్పున రూ.35 లక్షల మేర సబ్సిడీ అందిస్తోంది. మెరుగైన విద్యుత్ పంపిణీ నెట్వర్క్ను పునరుద్ధరించడానికి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా కోట్ల రూపాయలను వెచ్చించింది.
జిల్లాలో విద్యుత్ రంగం సాధించిన ప్రగతి ఇలా..
ఖమ్మం జిల్లాలో విద్యుత్ రంగం గణనీయమైన ప్రగతి సాధించింది. దీంతో జిల్లాలో పారిశ్రామిక, వ్యవసాయ రంగాలు, ఇతర అవసరాలకు ఎలాంటి ఆటంకం లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరా జరుగుతోంది.
రూ.1100 కోట్లతో విద్యుత్ వ్యవస్థల బలోపేతం..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో జిల్లాలో విద్యుత్ వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన సేవలు అందిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో సుమారు రూ.1100 కోట్లు ఖర్చు చేసి విద్యుత్ వ్యవస్థలను బలోపేతం చేసింది. దీంతో నేడు అన్ని వర్గాల ప్రజలకు 24 గంటలపాటు నిరంతర విద్యుత్ను అందిస్తున్నందుకు సంతోషంగా ఉంది. సంస్థల మనుగడను కాపాడింది తెలంగాణ ప్రభుత్వం మాత్రమే.
-ఏ.సురేందర్, ఎస్ఈ, ఎన్పీడీసీఎల్, ఖమ్మం సర్కిల్
వ్యవసాయ రంగానికి జవసత్వాలు
వలస పాలనకు, స్వరాష్ట్ర పాలనకు ఎంతో వ్యత్యాసం కన్పిస్తోంది. తెలంగాణ వచ్చాక రైతులకు కరెంటు కోతల్లేవు. రాత్రిపూట పాముకాట్లు లేవు. కావాల్సినంత ఉచిత కరెంటు. పండించుకున్నంత పంట. విద్యుత్తు వినియోగంలో రికార్డులు. ఆదా చేసినందుకు అవార్డులు. తెలంగాణ ఆవిర్భవించిన నాడు రాష్ట్రంలో స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 7,778 మెగావాట్లు మాత్రమే. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అద్భుతమైన కృషి వల్ల నేడు విద్యుదుత్పత్తి సామర్థ్యం 18,567 మెగావాట్లకు పెరిగింది. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి జవసత్వాలు నింపారు. తెలంగాణ ఏర్పడిన తరువాత విద్యుత్ రంగ బలోపేతం కోసం ఏకంగా రూ.39,321 కోట్లను వెచ్చించారు.