లక్ష్మీదేవిపల్లి, ఆగస్టు 26: రాష్ట్రంలో కరెంట్ కోతలు లేవు.. పొలాలకు నీళ్లు పెట్టేందుకు పడిగాపులు లేవు.. వానలొస్తే రోజుల పాటు అంధకారంలో ఉండాల్సిన అవసరం లేదు. తెలంగాణలో 365 రోజులు, 24/7 నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా.. సీఎం కేసీఆర్ ఓ సందర్భంలో అన్నట్లు ‘ఒకప్పుడు కరెంట్ ఉంటే వార్త.. ఇప్పుడు కరెంట్ పోతే వార్త..’ విద్యుత్ ఉత్పత్తి రంగాలకు ఊతమిచ్చి వాటిని బలోపేతం చేయడంతోనే ఈ విజయం సాధ్యమైంది. 24 గంటల పాటు పంట పొలాలకు విద్యుత్ సరఫరా కావాలనే ఆకాంక్ష నెరవేరింది. దీనిలో భాగంగా భద్రాద్రి జిల్లాలో విద్యుత్శాఖ అధికారులు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటున్నారు. పరిశ్రమలు, ఇళ్లు, పంట పొలాలకు నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం వానకాలం నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉన్నారు.
సమస్యలకు పరిష్కారం..
వానలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్శాఖ అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. విద్యుత్ సరఫరాలో ఎక్కడ లోపాలను గుర్తించినా వెంటనే వాటిని యుద్ధప్రాతిపదికన పరిష్కరిస్తున్నారు. విద్యుత్ అధిక లోడింగ్తో చాలా చోట్ల ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న సిబ్బంది వెంటనే ట్రాన్స్ఫార్మర్లను బాగు చేస్తున్నారు. నెల క్రితం జిల్లాలోని బూర్గంపహాడ్, భద్రాచలం, పినపాక, చర్ల, దుమ్ముగూడెం మండలాలను గోదావరి వరదలు ముంచివేసిన సంగతి తెలిసిందే. వరద వెనక్కి వెళ్లిపోయిన తర్వాత విద్యుత్ సిబ్బంది రంగంలోకి దిగారు. వాలిన, విరిగిన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్తవి పెట్టారు. కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లకు మరమ్మతులు చేపట్టారు. కేవలం కొన్నిగంటల్లోనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
విద్యుత్ కనెక్షన్లు ఇలా..
జిల్లాలో మొత్తం 72 సబ్ స్టేషన్లు ఉండగా వాటి పరిధిలో 4,11,667 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో గృహాలు 3,21,368, నాన్ డొమెస్టిక్ 35,208, పరిశ్రమలు 1,570, చిన్న తరహా పరిశ్రమలు 391, వ్యవసాయం 44,856, వీధి దీపాలు 3,608, ఆర్డబ్ల్యూఎస్ 1,788, పాఠశాలలు, ప్రార్థనా మందిరాలు 2,579, తాత్కాలిక సరఫరా కనెక్షన్లు 1,119, హైటెన్షన్ 180 కనెక్షన్లు ఉన్నాయి. మొత్తం కనెక్షన్లకు రోజుకు 37 లక్షల యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతున్నది. మున్ముందు వినియోగం మరింత పెరగనున్నది.
నిరంతరం విద్యుత్తు..
విద్యుత్ సరఫరాల్లో ఎలాంటి అంతరాయం లేదు. పంటలకు నిరంతరం విద్యుత్ సరఫరా అవుతున్నది. గతంలో ఎండాకాలం వచ్చిందంటే చాలు కరెంట్ కోతలు. వానకాలంలో వరదలు వస్తే కోతలు. ప్రజలంతా విసిగిపోయేవారు. ఏజెన్సీ గ్రామాల్లో కొన్నిరోజుల పాటు సరఫరా నిలిచిపోయేది. ఇప్పుడా సమస్య లేదు. గంటల్లోనే సమస్యలకు పరిష్కారం లభిస్తున్నది.
– గిలక విజయ్కుమార్, లక్ష్మీదేవిపల్లి
నాణ్యమైన విద్యుత్ సరఫరా..
ఇళ్లు, పొలాలు, పరిశ్రమలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నాం. విద్యుత్ సరఫరాలో అప్పుడప్పుడు లోపాలు తలెత్తుతాయి. వాటిని సిబ్బంది ఎప్పటికప్పుడు పరిష్కరించి వినియోగదారుల ఇబ్బందులను తొలగిస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక్కో సమస్యను పరిష్కరిస్తున్నాం. వానల నేపథ్యంలో విద్యుత్శాఖ మరింత అప్రమత్తంగా ఉంది.
– రమేశ్, విద్యుత్శాఖ ఎస్ఈ, కొత్తగూడెం