ఇప్పుడంతా ‘డిజిటల్ పే’ హవా
అమాంతంగా పెరిగిన ‘ఫోన్ పే, గూగుల్ పే’ వినియోగం
జిల్లాలో మూడు లక్షల మంది వినియోగం
కొత్తగూడెం అర్బన్, అక్టోబర్ 23: ఇప్పుడు మన బ్యాంక్ ఖాతాలో నగదు ఉండి చేతిలో స్మార్ట్ఫోన్ ఉంటే చాలు ఉన్నచోట నుంచే డబ్బు పంపించుకోవచ్చు. జేబులో పైసా పెట్టుకోకుండానే ఇంటర్నెట్ ద్వారా డబ్బు చెల్లించవచ్చు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ అంతా డిజిటల్ పేమెంట్సే. టీ దుకాణం నుంచి పాన్షాపులు, కూరగాయల దుకాణాలు, పెట్రోల్ బంకులు, చికెన్, మటన్ షాపులు, బట్టలు, బంగారు ఆభరణాల దుకాణాలు, కిరాణషాపులు, జనరల్ స్టోర్స్.. ఇలా ఒక్కటేమిటీ అన్నిచోట్ల డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నాయి.
పక్కా పారదర్శకత..
డిజిటల్ యాప్ల ద్వారా ప్రతి రోజు ఒక్కో వినియోగదారుడు రూ.లక్ష లోపు వరకు డబ్బు పంపించే అవకాశం ఉన్నది. కూర్చున్న చోటు నుంచి కదలకుండానే దేశవ్యాప్తంగా ఎప్పుడైనా, ఎక్కడైనా లావాదేవీలు చేసే అవకాశం ఇప్పుడున్నది. బ్యాంకులకు వెళ్లి అవతలి వ్యక్తి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేయడమనే పనికి ఇక కాలం చెల్లింది. డిజిటల్ పేమెంట్స్తో మనం ఎవరికి డబ్బులు పంపించామో, డబ్బు ఏ షాపు దుకాణ ఖాతాకు వెళ్తున్నాయో సులభంగా తెలసుకోవచ్చు. మనం మరచిపోయినా డిజిటల్ పేమెంట్స్ యాప్ల్లో వివరాలు భద్రంగా ఉంటాయి. మనం చెల్లించిన డబ్బు అవతలి వ్యక్తి బ్యాంకు ఖాతాకు బదిలీ అయిందా? లేదా? అనే విషయం కూడా స్పష్టంగా తెలిసిపోతుండంతో వినియోగదారులు డిజిటల్ పేమెంట్స్కే మొగ్గు చూపుతున్నారు. అంతేకాదు మన ఖాతాలో ఎంత డబ్బు ఉందని తెలుసుకోవడానికి ఇప్పుడు బ్యాంక్, ఏటీఎంలకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. డిజిట్ యాప్స్లోనే మనం వివరాలు తెలుసుకునే అవకాశం ఉన్నది.
జిల్లాలో మూడు లక్షల మందికి పైగానే..
జిల్లాలో డిజిటల్ పేమెంట్స్ చేసేవారు మూడు లక్షల మందికి పైగానే ఉన్నారు. వీరంతా భారత్ మనీ, ఫోన్ పే, గుగూల్ పే, పేటీఎంలు వినియోగిస్తున్నారు. జిల్లాలోని మొత్తం దుకాణాల్లో ఇప్పటికే సగానికి కంటే ఎక్కువ దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయి. షాపుల్లో ఫోన్పే, గుగూల్ పే, భారత్ మనీ, పేటీఎంలు ఇన్స్టాల్ చేసేందుకు ఆయా కంపెనీల ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాయి. వీరు గ్రామగ్రామానికి వెళ్లి డిజిటల్ పేమెంట్స్ను ప్రోత్సహిస్తున్నారు.