జిల్లా ఆస్పత్రిలో పెరగనున్న 180 పడకలు
రామవరం కేంద్రంగా తల్లీబిడ్డల ఆసుపత్రి
ఈ ఏడాదిలోనే తరగతులు ప్రారంభం
గిరిజనులకు అందనున్న మెరుగైన వైద్యసేవలు
భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 23 (నమస్తే తెలంగాణ): కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల మధ్య నిర్మిస్తున్న మెడికల్ కాలేజీ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి.. 30 ఎకరాల్లో మెడికల్, నర్సింగ్ కాలేజీల పనులు చేపట్టిన ఆర్అండ్బీ అధికారులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. మరోవైపు వీటికి అనుసంధా నంగా జిల్లా ఆస్పత్రుల్లో అధునాతన భవనం నిర్మించి దానిలో 180 పడకల భవనం ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే వైద్యారోగ్యశాఖ కొందరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, వైద్యులను సైతం నియమించింది. ఈ ఏడాది నుంచి తరగతులు ప్రారంభించేందుకు అధికారులు కార్యాచరణ రూపొందించారు. వైద్యకళాశాల అందుబాటులోకి వస్తే జిల్లా వాసులకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి..
కొత్తగూడెం జిల్లాకేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కళాశాలలు రూపుదిద్దుకుంటున్నాయి. నిర్మాణాలు పూర్తయితే జిల్లావాసులకు మెరుగైన వైద్యసేవలు అందనున్నాయి. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు కాలేజీ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో మెడికల్ కాలేజీల నిర్మాణాలపైనా చర్చించారు. శరవేగంగా పనులు పూర్తి చేస్తామని కలెక్టర్ అనుదీప్ ప్రకటించారు. ఇప్పటికే వైద్యారోగ్యశాఖ, ఆర్అండ్బీ అధికారులతో అనేకసార్లు సమీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం నర్సింగ్ కాలేజీ నిర్మాణం చివరి దశకు చేరుకుంది.
నిరంతరం సమీక్షలు..
కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల మధ్య ఉన్న మైనింగ్ కాలేజీ ప్రాంతంలోని 30 ఎకరాల స్థలంలో శరవేగంగా మెడికల్, నర్సింగ్ కళాశాలల నిర్మాణాలు జరుగుతున్నాయి. రూ.38 కోట్లతో నర్సింగ్ కాలేజీ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే కలెక్టర్ అనుదీప్ అనేకసార్లు నిర్మాణాలను పరిశీలించారు. యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
జిల్లా ఆసుపత్రిలో పెరగనున్న పడకలు..
మెడికల్ కాలేజీ పనులను ఆర్అండ్బీశాఖ చేపడుతున్నది. త్వరలో నిర్మాణాలను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురానున్నది. మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రిలో 180 పడకల ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. పడకల ఏర్పాటుకు అధునాతన భవనం అందుబాటులోకి రానున్నది. డీసీహెచ్ఎస్ డాక్టర్ ముక్కంటేశ్వరరావు, డాక్టర్ సరళ ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఆసుపత్రి పై భాగంలో పిల్లర్ల సముదాయం పూర్తయింది. మరో పది రోజుల్లో ఈ పనులు పూర్తవుతాయి. ఆసుపత్రి పరిధిలోని తల్లీబిడ్డల వైద్య విభాగాన్ని రామవరంలో నిర్మించిన అధునాతన భవనంలోకి మార్చనున్నారు. నేడో రేపో ఈ విభాగం అందుబాటులోకి రానున్నది.
బోధనకు సిబ్బంది నియామకం..
మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. ఇప్పటికే ఆరుగురు అసిస్టెంట్ ఫ్రొఫెసర్ల నియామకం పూర్తయింది. ఎంబీబీఎస్, పీజీ పూర్తి చేసిన 25 మంది బోధన కోసం నియమితులయ్యారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి మెడికల్, నర్సింగ్ విద్యార్థులకు తరగతులు ప్రారంభంకానున్నాయి.
గిరిజనులకు మెరుగైన వైద్యం..
మెడికల్ కాలేజీ ఏర్పాటుతో గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందనున్నాయి. గతంలో నిరుపేదలకు పెద్ద జబ్బులు వస్తే వైద్యులు వరంగల్, హైదరాబాద్కు రిఫర్ చేసేవారు. మెడికల్ కాలేజీ అందుబాటులోకి వస్తే స్థానికంగానే మెరుగైన వైద్యం అందనున్నది. ప్రజాప్రతినిధుల వినతులను ఆలకించి జిల్లాకు మెడికల్ కాలేజీ వరాన్ని ఇచ్చిన సీఎం కేసీఆర్కు జిల్లావాసులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇప్పటికే జిల్లా ఆసుపత్రిలో 200 పడకలు ఉన్నాయి. మెడికల్ కాలేజీ ఏర్పాటుతో మరో 180 పడకలు అందుబాటులోకి రానున్నాయి. మెడికల్ కాలేజీ విద్యార్థులు ప్రాక్టీస్ చేసేందుకు కాలేజీ ఎంతగానో ఉపయోగపడనున్నది. ఆస్పత్రిలో 380 పడకలు ఏర్పాటు కావడంతో ఈ ఆస్పత్రి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలోకి వెళ్తుంది. ఆస్పత్రి నిర్వహణ బాధ్యతనూ డీఎంఈనే తీసుకుంటుంది.
వచ్చే విద్యాసంవత్సరంలో తరగతులు ప్రారంభం..
మెడికల్ కాలేజీ పరిధిలోని నర్సింగ్ కాలేజీ నిర్మాణం పూర్తి కావొస్తున్నది. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయ్యాయి. జిల్లా ఆసుపత్రిలో 180 పడకలు సిద్ధం అవుతున్నాయి. నిర్మాణాలను సత్వరం పూర్త్తి చేయాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు సమీక్షలు సైతం నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే నెలలో నిర్మాణాలను పూర్తి చేస్తాం. మెడికల్ కౌన్సిల్ అనుమతుల మేరకు వచ్చే విద్యాసంవత్సరం నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.