ఏడేళ్లలో తెలంగాణ నెం.1గా నిలిచింది
కేంద్రం ఇబ్బందులకు గురిచేస్తున్నది
ఎంపీ నామా నాగేశ్వరరావు
ఖమ్మం నగరంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ‘కొత్తూరు’ అభినందన సభ
హాజరైన ఎమ్మెల్యేలు సండ్ర, రాములునాయక్, ఎమ్మెల్సీ తాతా మధు, జడ్పీ చైర్మన్ కమల్రాజు
ఖమ్మం ఎడ్యుకేషన్, జనవరి 23 : తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టుకుని కాపాడుకునే మహా నాయకుడు సీఎం కేసీఆర్ అని, తెలంగాణ వచ్చాకనే రాష్ట్రం అంతటా అభివృద్ధి జరిగిందని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం నగరంలోని వీవీసీ ఫంక్షన్హాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు బాధ్యతలు చేపట్టిన సందర్భంగా నిర్వహించిన అభినందన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. స్వరాష్ట్రంలో తాగునీరు, సాగునీరు సమృద్ధిగా లభిస్తున్నాయన్నారు. 24 గంటల పాటు విద్యుత్ అందిస్తుండడంతో రైతులు, వ్యాపారులు సంతోషంగా ఉన్నారన్నారు. తెలంగాణలోని పథకాలు, సంక్షేమాన్ని చూసి ఓర్వలేకే కావాలనే కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తున్నదన్నారు. తెలంగాణలో పంటలు బాగా పండుతున్నాయని, వాటి కొనుగోలు విషయం, రైతన్నలపై కేంద్రం వ్యవహరిస్తున్న వైఖరిని ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నదన్నారు. స్వరాష్ట్రం వచ్చిన ఏడేళ్లలో అన్ని రంగాల్లో అద్భుతంగా అభివృద్ధి జరిగిందని, తెలంగాణ నెంబర్వన్ రాష్ట్రంగా నిలిచిందన్నారు. అన్నివర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని, పార్టీలకతీతంగా అందరి సహకారాలు నాయకుడు కేసీఆర్కు అండగా ఉండాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వంలో వైశ్యులకు ప్రాధాన్యం కల్పించారని, ఆర్య వైశ్య కార్పొరేషన్కు కృషి చేస్తామన్నారు.
అందరి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..ఎమ్మెల్యే సండ్ర
తెలంగాణలో అందరి సంక్షేమానికే సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నది. ప్రజలకు అవసరమైన అంశాలన్నింటిపై దృష్టిపెట్టి సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. రైతుబంధుతో రైతుల సమస్యలు తీర్చిన ఏకైక నాయకుడు కేసీఆర్. ఇప్పుడు మన ఊరు మన బడి పేరుతో రూ. 7500 కోట్లు ఖర్చుపెట్టి బడుల్లో విద్యార్థుల బంగారు భవిష్యత్ను తీర్చిదిద్దేందుకు ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలనే సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రోత్సాహంతో ముందుకువెళ్తున్నామన్నారు. గ్రంథాలయాలను మన ఊరు -మన బడి కార్యక్రమంలో పెట్టేలా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా.
విజ్ఞాన నిధులు.. గ్రంథాలయాలు…
గ్రంథాలయాలు విజ్ఞానాన్ని అందించే కేంద్రబిందువులని వైరా ఎమ్మెల్యే రాములునాయక్, ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా గ్రంథాలయాలకు ప్రత్యేక స్థానం ఉన్నదని, ఎన్ఆర్ఐలు సైతం ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నారన్నారు. డిజిటలైజేషన్కు, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి అనుగుణంగా కృషి చేయాలని, ప్రజాప్రతినిధులందరూ పూర్తి సహకారాలు అందిస్తారన్నారు. అనంతరం గ్రంథాలయ సంస్థ చైర్మన్ను సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజ్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, రైతుబంధు సమితి కన్వీనర్ ఎన్వీ, సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ మహేశ్, బెల్లం వేణు, శేఖర్, పులిపాటి ప్రసాద్, చిన్ని కృష్ణారావు, కొప్పు నరేశ్ తదితరులు పాల్గొన్నారు.