వరదలొస్తే ఆ గ్రామాలకు రోజుల తరబడి పవర్ కట్
విద్యుత్శాఖ ప్రత్యేక చొరవతో సమస్యకు పరిష్కారం
ప్రస్తుతం 12 గ్రామాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా
లక్ష్మీదేవిపల్లి, జనవరి 23: వానకాలం వస్తే చాలు లక్ష్మీదేవిపల్లి మండలంలోని 12 గిరిజన గ్రామాలకు రోజుల తరబడి విద్యుత్ సరఫరా ఉండేది కాదు. విద్యుత్శాఖ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని ఆయా గ్రామాల విద్యుత్ సమస్యలను పరిష్కరించారు. ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో సరఫరా అవుతున్నట్లుగానే ఈ గ్రామాలకూ రోజుకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
ఏయే గ్రామాలంటే..
బంగారుచెలక, బొజ్జాయిగూడెం, తిప్పగుట్ట, ముడిగమిద్దె, గొల్లగూడెం, చింతపెంటిగూడెం, పడగాయి గూడెం, లక్ష్మీపురం, ఆర్లగండి, చింతకుంట, తోకబంధాల, మర్రిగూడెం గ్రామస్తులు దశాబ్దాల పాటు విద్యుత్ సమస్యలను ఎదుర్కొన్నారు. వానకాలంలో ఒకసారి విద్యుత్ సరఫరా ఆగిపోతే మళ్లీ ఎప్పుడు సరఫరా అవుతుందో తెలియని పరిస్థితి. ఈ గ్రామాలకు లక్ష్మీదేవిపల్లి 33/11 కేవీ సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా జరిగేది. భారీ వర్షాల కారణంగా కిన్నెరసాని ప్రాజెక్టులోకి వరద చేరినప్పుడు పరీవాహక ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలవాలేవి. విద్యుత్ లైన్లు ఎక్కడికక్కడ తెగిపడేవి. దీంతో ఈ ప్రాంతంలో రోజుల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోయేది. వరదలు తగ్గిన తర్వాత విద్యుత్శాఖ అధికారులు తిరిగి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాల్సి వచ్చేది.
విద్యుత్ అధికారుల చొరవతో..
విద్యుత్శాఖ అధికారుల ప్రత్యేక చొరవతో గిరిజన గ్రామాల ప్రజల విద్యుత్ సమస్యలకు పరిష్కారం లభించింది. ముందుగా ప్రత్యామ్నాయ మార్గంలో విద్యుత్ సరఫరా చేసేందుకు 33/11 కేవీ నుంచి యానంబైలు- పగడాల నగర్ వరకు 11 కేవీ ఇంటర్ లింక్ ఇచ్చారు. అలాగే బంగారు చెలక 11 కేవీ ఇంటర్లింక్, లక్ష్మీదేవిపల్లి పగడాయిగూడెం నుంచి పాల్వంచ మండలం చంద్రాలగూడెం వరకు లింక్ ఇచ్చారు. ఇలా మొత్తం 2.95 కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేశారు. ప్రస్తుతం ఈ పనులన్నీ పూర్తయ్యాయి. విద్యుత్శాఖ ఈ పనులకు రూ.11,73,7431 ఖర్చు చేసింది. ఇప్పుడు 11కేవీ లైన్తో 12 గ్రామాల పరిధిలోని 583 సర్వీసులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతున్నది. విద్యుత్ సమస్యలకు పరి ష్కారం చూపడంతో ఆయా గ్రామాలకు చెందిన వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
విద్యుత్ సరఫరా ఇస్తున్నాం..
గతంలో గిరిజన గ్రామాల్లో వరదల కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయేది. వరదలు తగ్గే వరకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించే వీలు ఉండేది కాదు. మేము ప్రత్యేక చొరవ తీసుకుని 33/11 కేవీ ఇంటర్ లింక్ సాయంతో గిరిజన గ్రామాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నాం.-సురేందర్, ఎస్ఈ.