దూరదర్శన్, టీశాట్ ద్వారా అమలు
8, 9, 10 తరగతుల విద్యార్థులకు బోధన
50 శాతం టీచర్లు పాఠశాలలకు హాజరు
అందుబాటులోకి వాట్సాప్ గ్రూపులు
పర్యవేక్షించనున్న తరగతి ఉపాధ్యాయులు
భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 23 (నమస్తే తెలంగాణ);కొవిడ్ థర్డ్ వేవ్ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది.. ఒకవైపు ఫ్రంట్ లైన్ వారియర్స్కు బూస్టర్ డోస్, టీనేజర్లకు కొవిడ్ వ్యాక్సిన్ ఇస్తూనే మరోవైపు కరోనా కేసుల కట్టడిపై దృష్టి సారించింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మూడు రోజులుగా నిర్వహిస్తున్న జ్వర సర్వే మూడోరోజూ కొనసాగింది. ఉభయ జిల్లాల్లో 2,523 బృందాలు సెలవు రోజు ఆదివారమూ సర్వే చేపట్టాయి.. అవసరమైన వారికి అక్కడికక్కడే మెడికల్ కిట్లు అందించాయి. తీవ్రతను బట్టి ముఖ్యమైన కేసులను స్థానిక ప్రభుత్వాసుపత్రులకు రిఫర్ చేస్తున్నాయి.
కొత్తగూడెం ఎడ్యుకేషన్, జనవరి 23: జిల్లాలోని 8,9,10 తరగతి విద్యార్థులకు సోమవారం నుంచి ఆన్లైన్ తరగతులు నిర్వహించనున్నట్లు డీఈవో సోమశేఖర శర్మ తెలిపారు. జిల్లాలోని మండల విద్యాధికారులు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ఆదివారం జూమ్ సమావేశం నిర్వహించారు. బోధన, బోధనేతర సిబ్బంది ఈ నెల 24 నుంచి 50 శాతం మంది చొప్పున వంతులవారీగా విధులకు హాజరుకావాలన్నారు. విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాలకు రానీయకూడదని స్పష్టం చేశారు. 15 సంవత్సరాల పైబడిన విద్యార్థులంతా వ్యాక్సిన్ తీసుకునేలా చూడాలన్నారు. డిజిటల్ డివైస్ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఇది లేని విద్యార్థులను మ్యాపింగ్ చేయాలని చెప్పా రు. పదోతరగతి విద్యార్థులంతా సకాలంలో పరీక్ష ఫీజు చెల్లించేలా చూడాలన్నారు. మిషన్ భగీరథ వాటర్ కనెక్షన్, టాయిలెట్స్ లేని పాఠశాలల వివరాలను ఎంఈవోలు ఇవ్వాలని చెప్పారు. ట్రాన్స్పోర్ట్ అలవెన్స్కు అర్హులైన విద్యార్థుల వివరాలను రెండు రోజుల్లో ఎంఈవోలకు ఇవ్వాలన్నారు. సమావేశంలో డీసీఈబీ కార్యదర్శి మాధవరావు, ఏసీజీఈ రామేశ్వరరావు, జిల్లా విద్యాశాఖ కో ఆర్డినేటర్లు నాగరాజశేఖర్, సైదులు, అన్నామణి, సతీష్ కుమార్, ఏపీవో కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.