రఘునాథపాలెం, ఫిబ్రవరి 25 : ఏళ్లతరబడి కష్టార్జితంతో పైసాపైసా పోగేసి కట్టుకున్న గూడు కళ్లముందు నేలమట్టమైంది. జేసీబీలు, బుల్డోజర్లతో ఇష్టారీతిన కూల్చివేయడం పేదోళ్ల గుండెలను కకావికలం చేసింది. ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో నిరుపేదలు కట్టుకున్న ఇండ్లు, గుడిసెల ఆనవాళ్లు లేకుండా చేసే విధంగా అధికారుల పనితీరు కనిపిస్తోంది. తొలిరోజు భారీ పోలీస్ బందోబస్తు నడుమ గుడిసెల కూల్చివేతకు దిగిన రెవెన్యూ అధికారులు..
బుధవారం రెండో రోజు ఇళ్లు, గుడిసెలను పూర్తిగా నేలమట్టం చేసి భూమి చదును పేరుతో హడావుడి చేయడం కనిపించింది. నిన్న తరలించగా మిగిలిపోయిన సామగ్రి, వస్తువులను ఈరోజు సైతం వాహనాల్లో తరలించే ప్రయత్నం ముమ్మరం చేశారు. ఇందుకోసం అధికారులే ప్రత్యేకంగా వాహనాలను సమకూర్చి తరలిస్తున్నారు. పోలీసులు, అధికారుల హంగామా చూసిన నిరుపేదలు భయాందోళన నుంచి ఇంకా తేరుకోలేదు. నిరాశ్రయులుగా మిలిగిన తాము ఇప్పటికప్పుడు ఎక్కడికి వెళ్లిపోవాలంటూ అధికారుల తీరుపై ఆగ్రహం, అసహనం వ్యక్తం చేశారు.

జిల్లాకు చెందిన మంత్రుల ఆదేశాలు లేకుండా అధికారులు పేదల గుడిసెలను తొలగించే ప్రయత్నం చేస్తారా? గుడిసెలు, ఇళ్ల కూల్చివేతలు ముమ్మాటికీ మంత్రుల ప్రమేయంతోనే జరిగాయని నిరాశ్రయులు కరాకండిగా చెబుతున్నారు. పోలీసులు, అధికారులు బుల్డోజర్లతో చేస్తున్న హడావుడితో పకడ్బందీగా ఇళ్లు నిర్మించుకున్న పేదలు పనికొచ్చే ఇంటి నిర్మాణ సామగ్రిని తీసి పక్కన పెట్టుకుంటున్నారు. తలుపులు, కిటికీలు, రేకులు, గ్రిల్స్, పైపులు వంటి వాటిని జాగ్రత్తగా తొలగించి తీసుకెళ్తున్నారు. కొందరు మాత్రం అక్కడికి వచ్చిన పాత ఇనుప సామాన్ల వ్యాపారులకు రేకులు, పైపుల వంటి పనికిరాని వస్తువులను ఎంతో కొంతకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయితే ఇళ్లు కోల్పోయిన కోపంతో ఉన్న బాధితుల నుంచి అధికారులు పేర్లు నమోదు చేయించుకుంటూ కంటితుడుపు చర్యలు చేపడుతున్నారు. ఇళ్ల స్థలాలు ఇచ్చే ఆలోచనే ప్రభుత్వానికి ఉంటే రెక్కల కష్టంతో రూ.లక్షలు పెట్టి కట్టుకున్న ఇళ్లను ఎందుకు కూల్చివేస్తారని వాపోతున్నారు. జిల్లా మంత్రులు తమ అనుచరులు, అనుయాయుల భూములకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే పేదలపై బల్డోజర్ల ప్రయోగం చేసి కట్టుకున్న ఇళ్లను కూల్చివేస్తున్నారని మండిపడ్డారు. దీంతో నిరాశ్రయులైన పేదలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడుతూ తమ ఆవేదనను ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్నారు.

ప్రజా పాలన అందిస్తామంటూ ఎన్నికల సమయంలో ప్రచారం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా గుడిసెల సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని మురిసిపోయినం. కానీ, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్లను కూల్చడమే లక్ష్యంగా పెట్టుకొని రాష్ట్రంలో రాక్షస పాలన అందిస్తున్నది. జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు వారి అనుచరులకు మేలు చేయాలనే కుట్రలతో మేము కట్టుకున్న ఇళ్లను కూల్చి వీధిన పడేశారు. వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసం వస్తే ఉరికిస్తం.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించి శాశ్వతంగా భూస్థాపితం చేస్తాం.
-షేక్ హకీమ్, ఇల్లు కోల్పోయిన నిరాశ్రయుడు
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న పదేళ్ల కాలంలో గుడిసెలు కట్టుకుని ఉంటున్న పేదలకు ఎలాంటి హాని జరగనీయలేదు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సైతం మాకు పట్టాలు ఇప్పించేందుకు ప్రయత్నం చేశారు. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే లక్షలు పెట్టి కట్టుకున్న మా ఇళ్లపై బుల్డోజర్లను ప్రయోగించి జిల్లాకు చెందిన మంత్రులు నేలమట్టం చేయించారు. మా కుటుంబాలను కట్టుబట్టలతో వీధిన పడేయించారు. మా ఉసురు మంత్రులకు తప్పక తగులుతుంది.
-వేల్పుల సత్యనారాయణ, సుగుణ వృద్ధ దంపతులు
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ను కచ్చితంగా బొంద పెడతాం. అనేక సంవత్సరాలుగా భూదాన్ భూముల్లో ఇళ్లు కట్టుకొని ఉంటున్నం. పెద్ద కాలనీగా ఏర్పాటైన తర్వాత మంత్రులు తమ అధికార బలాన్ని పేదలపై చూపించి 600 పైచిలుకు ఇళ్లను కూల్చివేయించారు. ముందుగానే అధికారులు వచ్చి ఇళ్లు కట్టుకోవద్దని చెబితే అప్పుడే కట్టుకోకుండా ఉండేవాళ్లం. ఇప్పుడు లక్షలు ఖర్చు చేసి కట్టుకున్న తర్వాత కూల్చివేసి గూడు లేకుండా చేశారు. ఇప్పుడేమో ఇక్కడి నుంచి శాశ్వతంగా పంపించేలా అధికారులు ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు.
-కన్నెకంటి విజయ, నిరాశ్రయురాలు, ఖమ్మం