పాడి రైతుల కోసం పథకాల వెల్లువ
ప్రభుత్వ ప్రోత్సాహకాలతో ఆర్థికాభివృద్ధి
భద్రాద్రి జిల్లాలో 77 పాల కేంద్రాలు
ప్రతి రోజూ 2,700 లీటర్ల పాల సేకరణ
కొత్తగూడెం, నవంబర్ 22: జిల్లా ప్రజలకు స్వచ్ఛమైన పాలు అందిస్తూ ప్రత్యేకత చాటుకుంటోంది ప్రభుత్వ రంగ విజయ డెయిరీ. పాడి రైతుల వద్ద పాలు సేకరించి వాటి ద్వారా వివిధ ఉత్పత్తులు తయారు చేసి మార్కెట్లోకి తీసుకొస్తోంది. నాణ్యమైన పాలు తీసుకుంటూ, పాడి రైతులకు పలు ప్రోత్సాహకాలు అందిస్తూ అండగా ఉంటోంది. దీంతో వ్యవసాయ అనుబంధ రంగంగా విరాజిల్లుతున్న పాడి పరిశ్రమ రైతులకు, పాడి పశువుల యజమానులకు ఆర్థికాభివృద్ధిని అందిస్తోంది. గ్రామాల్లో పాడి రైతులను ప్రోత్సహించడంతోపాటు పాల ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం కొత్త పథకాలను ప్రవేశపెడుతోంది. ఇప్పటికే లీటర్కు రూ.4 చొప్పున ప్రోత్సాహకం అందజేస్తుండగా, పాడి రైతుల కోసం కొత్తగా సంక్షేమ పథకాలను తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య తీసుకొచ్చింది. విజయ డెయిరీ ద్వారా ఈ ల్యాబ్లో పేరు నమోదు చేసుకున్న వారికి అనేక సంక్షేమ పథకాలు వర్తిస్తుండగా.. జిల్లాలోని వేలాదిమంది పాడి రైతులకు ప్రయోజనం చేకూరుతోంది. రోజురోజుకూ ప్రైవేట్ డెయిరీల నుంచి పెరుగుతున్న పోటీని తట్టుకునేందుకు విజయ డెయిరీ కొన్నేండ్లుగా పలు ప్రోత్సాహకాలను అమలు చేస్తోంది. గతం కంటే ఇప్పుడు అదనంగా మరిన్ని రాయితీలు, ప్రోత్సాహకాలను ఇస్తున్నట్లు డెయిరీ నిర్వాహకులు చెబుతున్నారు. ఇప్పటికే భద్రాద్రి జిల్లాలో 2019 వరకు నమోదు చేసుకున్న రైతుల్లో 193 మందికి సబ్సిడీపై గేదెలు, ఆవులను పంపిణీ చేసింది. పేరు నమోదు చేసుకున్న వారికి విజయ డెయిరీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించనున్నాయి.
రోజూ 2,700 వేల లీటర్లు..
విజయ డెయిరీకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో పాల శీతలీకరణ కేంద్రం ఉంది. ఇల్లెందు, కొత్తగూడెం డివిజన్ల పరిధిలో 77 కేంద్రాల ద్వారా పాలు సేకరిస్తున్నారు. జిల్లాలో పది వేల మంది రైతుల నుంచి పాలను సేకరిస్తున్నారు. వెన్నతీసి టెస్టింగ్ చేసిన తర్వాత మాత్రమే పాలను విక్రయ కేంద్రాల్లో కొనుగోలు చేస్తారు. లీటరు ధరను రూ.63 నిర్ణయించారు. అదనంగా మరో రూ.రెండు కూడా ఇస్తారు. నాలుగు శాతం ఇన్సెంటివ్ కూడా రైతు ఖాతాల్లో జమచేస్తారు.
‘విజయ’ విద్యాకానుక..
పాడి రైతు కుటుంబంలో విద్యార్థి పదో తరగతిలో 9 జీపీఏ సాధిస్తే రూ.వెయ్యి, ఎంసెట్లో 10 వేల లోపు ర్యాంకు సాధిస్తే రూ.2 వేలు, ఐఐటీ, జేఈఈ మెయిన్స్లో సీటు సాధిస్తే రూ.2 వేలు, అఖిల భారత సర్వీసులో ఉద్యోగం సాధించిన వారికి రూ.10 వేల చొప్పున నగదు ప్రోత్సాహం, ప్రశంసా పత్రం అందిస్తోంది.
ఎంపీ బంజర నుంచి 500 లీటర్లు..
జిల్లాలో అత్యధికంగా ఎంపీ బంజర, రెడ్డిపాలెం, లక్ష్మీపురం, బయ్యారం, సుజాతనగర్, కొత్తగూడెం ప్రాంతాల్లో అధికంగా పాడి రైతులు ఉన్నారు. అత్యధికంగా మోరంపల్లి బంజర నుంచి రోజుకు 500 లీటర్ల పాలు విజయ డెయిరీకి వస్తాయి.
పాడి రైతులకు ప్రోత్సాహకాలు..
రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతులకు ప్రోత్సాహకాలు, వివిధ పథకాలు అందిస్తోంది. పాల ఉత్పత్తులు పెంచడం కోసం గ్రామ, మండల స్థాయిలో సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. కొత్తగూడెం, ఇల్లెందు పరిధిలో సేకరణ కేంద్రాలు ఉన్నాయి. త్వరలో అన్ని మండల కేంద్రాల్లోనూ ఏర్పాటు చేస్తాం. ఈ-ల్యాబ్లో పేరు నమోదు చేసుకున్న రైతులు సంక్షేమ పథకాలకు అర్హులు.
-ఆర్.భరతలక్ష్మి, విజయ డెయిరీ డీడీ