రామాయంపేట, మే 13 : రెండోరోజూ లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగింది. గురువారం రామాయంపేట మండల కేంద్రంతో పాటు డి.ధర్మారం, కాట్రియాల, అక్కన్నపేట, పర్వతాపూర్, కోనాపూర్ తదితర గ్రామాల్లోని ప్రజలు లాక్డౌన్ నిబంధనలు పాటించారు. తెల్లవారుజామునే పట్టనానికి వ్యాపారులు రావడంతో మహంకాళి మార్కెట్లో ప్రజలు భౌతికదూరం పాటిస్తూ తమకు కావాల్సిన వాటిని కొనుగోలు చేసి తిరిగి తమ ఇండ్లకు చేరుకున్నారు. పది గంటల తర్వాత సీఐ నాగార్జునగౌడ్, ఎస్సై రాజేశ్ రామాయంపేట పట్టణంలోని దుకాణా సముదాయాలను మూసివేయించారు.
తూప్రాన్ రూరల్లో..
తూప్రాన్ పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో రెండోరోజూ గురువారం లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగింది. వర్తక, వ్యాపార, వాణిజ్య సంస్థలు ఉదయం 10 గంటల వరకు తెరుచుకున్నాయి. పది గంటల తర్వాత జన సంచారంలేక పట్టణ ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. పట్టణంలోని నర్సాపూర్ క్రాస్రోడ్డు వద్ద వాహనాలు రాకపోకలు సాగించడానికి వీలు లేకుండా పోలీసులు బారికేడ్లలను ఏర్పాటు చేశారు.