Kotak Mahindra Bank | ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ‘కోటక్ మహీంద్రా బ్యాంక్’ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ కేవీఎస్ మానియన్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామా తక్షణం అమల్లోకి వస్తుందని కోటక్ మహీంద్రా బ్యాంక్ మంగళవారం ప్రకటించింది. మూడు దశాబ్దాలుగా కోటక్ మహీంద్రా బ్యాంకులో పని చేసిన కేవీఎస్ మానియన్.. గత జనవరిలో బ్యాంకు యాజమాన్య పునర్వ్యవస్థీకరణలో భాగంగా జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులయ్యారు.
బ్యాంకు సాంకేతిక విభాగంలో లోపాల కారణంగా కొత్తగా క్రెడిట్ కార్డులు జారీ చేయొద్దని, ఆన్లైన్లో ఖాతాలు తెరవొద్దని కోటక్ మహీంద్రా బ్యాంకును ఆర్బీఐ ఆదేశించిన కొన్ని రోజుల్లోనే బ్యాంక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా మానియన్ రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నది. బ్యాంకు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా పదోన్నతి పొందక ముందు కన్జూమర్, కమర్షియల్, హోల్ సేల్, ప్రైవేట్ బ్యాంకింగ్ సహా పలు విభాగాలకు మానియన్ సారధ్యం వహించారు. కానీ ఆయన తన పదవికి చేసిన రాజీనామా తక్షణం అమల్లోకి వస్తుందని కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రకటించడం గమనార్హం. ఆయన రాజీనామాకు గల కారణాలు గానీ, మానియన్ భవిష్యత్ ప్రణాళికల గురించి గానీ బ్యాంకు ఎటువంటి ప్రకటన చేయలేదు.
బ్యాంకు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా మానియన్ నియమితులు కాక ముందు బ్యాంక్ ఎండీ కం సీఈఓగా ఉదయ్ కోటక్ స్థానంలో నియమితులవుతారని వార్తా కథనాలు వచ్చాయి. 29 ఏండ్ల పాటు కోటక్ మహీంద్రా బ్యాంకులో సేవలందించిన మానియన్ సమర్థవంతమైన నాయకత్వ ప్రతిభ కల వారని బ్యాంకు సీఈఓ అశోక్ వాస్వానీ పేర్కొన్నారు. బ్యాంకు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా మానియన్ తనతో ఎంతో అనుబంధం కలిగి ఉన్నారని పేర్కొన్నారు.