కార్యాలయాల్లో 17 అంశాలతో కూడిన ఇన్ఫర్మేషన్ ఉంచాలి
రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ గుగులోత్ శంకర్నాయక్
కొత్తగూడెం ఎడ్యుకేషన్, నవంబర్ 17: ప్రభుత్వం నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా రాయితీలు పొందుతున్న సంస్థలు సమాచార హక్కు చట్ట పరిధిలోకి వస్తాయని, అన్ని కార్యాలయాల్లో 17 అంశాలతో కూడిన సమాచారాన్ని సమాచార చట్టం ప్రకారం స్వచ్ఛందంగా వెల్లడించాల్సి ఉంటుందని రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ డాక్టర్ గుగులోత్ శంకర్నాయక్ అన్నారు. సమాచార హక్కు చట్టం అమలుపై ఎంఈవోలకు, ప్రధానోపాధ్యాయులకు, కేజీబీవీ ప్రత్యేక అధికారులకు విద్యాశాఖ ఆధ్వర్యంలో సింగరేణి మహిళా కళాశాల ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సమాచర హక్కు చట్టం ద్వారా సమాచారం కోరిన వ్యక్తులకు 30 రోజుల్లో సమాచారం అందజేయాలని, 30 రోజుల్లోగా అందచేయకపోతే అప్పిలేట్ అధికారికి దరఖాస్తు చేయాలని, అప్పిలేట్ అధికారి 15 రోజుల్లో సమాచారం ఇవ్వకపోతే కమిషన్ నోటీసులు జారీ చేస్తుందని వివరించారు. సమాజాభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమైందని, విద్యార్థులకు, ప్రజలకు ఈ చట్టంపై అవగాహన కల్పించాలని సూచించారు. డీఈవో సోమశేఖరశర్మ, వ్యవసాయ శాఖ ప్రొఫెసర్ డాక్టర్ రమేశ్, ప్రిన్సిపాల్ శారద, తహసీల్దార్ రామకృష్ణ, హెచ్ఎంల సంఘం అధ్యక్షుడు మాధవరావు, ఎంఈవోలు, హెచ్ఎంలు, కేజీబీవీ ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.