ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర సాయం శూన్యం
యాత్రల పేరిట ‘బండి’ది చిల్లర రాజకీయం
ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు
ముదిగొండ, నవంబర్ 17: ధాన్యం కొనుగోలుపై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. యాత్రల పేరుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కార్తీకమాసం సందర్భంగా మండలంలోని ఖానాపురం కోదండ రామాలయంలో వ్యాపారి పొదిల రవి ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం లో జడ్పీ చైర్మన్ మాట్లాడారు. తొలుత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తరువాత గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వానకాలం పంటను కొనుగోలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు ్ల చేసిందని అన్నారు. కేంద్రం సహకరిస్తేనే యాసంగి పంటనూ కొనే పరిస్థితి ఉందన్నారు. కానీ వానకాలం పంటను కొనట్లేదని బీజేపీ నాయకులు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. పంజాబ్లో పూర్తి ధాన్యం సేకరిస్తున్న కేంద్రం.. మిగిలిన రాష్ర్టాల ధాన్యం ఎందుకు వద్దంటుందని ప్రశ్నించారు. బండి సంజయ్ తెలంగాణలో యాత్రలు చేయడం మాని.. ఢిల్లీ వెళ్లి ధాన్యం కొనేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు వాచేపల్లి లక్ష్మారెడ్డి, గడ్డం వెంకటి, సామినేని హరిప్రసాద్, పసుపులేటి దుర్గ, పోట్ల ప్రసాద్, వేముల శ్రీనివాస్, తోట ధర్మారావు, ఎర్ర వెంకన్న, పసుపులేటి వెంకట్, మీగడ శ్రీనివాస్యాదవ్, నానబాల కిరణ్, వలరాజు, రఫీ, పచ్చ సీతరామయ్య, కోటి అనంతరాములు, ఓబినబోయిన అమరయ్య, బంక మల్లయ్య, పోకల కృష్ణ, రాయల శ్రీను, నాగార్జునరెడ్డి, బాలాజీ ఎస్టేట్స్ అధినేత వత్సవాయి రవి పాల్గొన్నారు.