నిరుపేద ఇంటి పెద్దకు దెబ్బతిన్న కిడ్నీలు
కిడ్నీ మార్పిడి ఒక్కటే మార్గమని చెప్పిన వైద్యుడు
డయాలసిస్కు రూ.వేలల్లో ఖర్చు
ఇంటి బరువు, బాధ్యతలు నెత్తినేసుకున్న ఇల్లాలు
ముదిగొండ, నవంబర్ 17: ఆ దంపతులది నిరుపేద కుటుంబం. ఇద్దరూ దినసరి కూలీలే. రెక్కాడితే కానీ డొక్కాడదు. వారికి ఇద్దరు పిల్లలు. తాము ఉపవాసం ఉండైనా సరే.. ఇద్దరు బిడ్డలను బాగా చదివించాలని కలలుగన్నారు. ఆ పిల్లలు రోజూ చక్కగా బడికెళ్తుంటే.. చూసి మరిసిపోయేవారు. అంతా సాఫీగా సాగుతున్న ఆ కుటుంబంపై ఒక్కసారిగా పిడుగు పడింది. కలలు కల్లయ్యాయి. పిల్లల చదువుకు బ్రేక్ పడింది. ఇంతకీ ఈ విషాద గాథంతా ఎవరిదో చెప్పనేలేదు కదూ.. ఆ నిరుపేద కుటుంబ పెద్ద పేరు దారా రమేశ్. ముదిగొండ మండలం చిరుమర్రి గ్రామస్తుడు. గ్రానైట్ ఫ్యాక్టరీలో కార్మికుడు. కరోనా కష్టకాలంలో ఫ్యాక్టరీ మూతపడడంతో ఉపాధి కరువైంది. భార్యతో కలిసి వ్యవసాయ పనులకు వెళ్తున్నాడు. ఒక రోజున అస్వస్థతకు గురయ్యాడు. చాలా రోజులు అనారోగ్యంతోనే ఉన్నాడు. లేవలేని స్థితికి వచ్చాడు. రెండేళ్ల క్రితం.. ఒక రోజున ఆస్పత్రికి వెళ్లాడు. ‘నీ రెండు కిడ్నీలు సరిగ్గా పనిచేయడం లేదు. అవి ఏ స్థితిలో ఉన్నాయో కచ్చితంగా చెప్పాలంటే మరికొన్ని పరీక్షలు చేయాలి’ అని డాక్టర్ చెప్పాడు. ఇది విన్నాక రమేశ్ నెత్తిపై పడుగు పడినట్లయింది.
కొన్ని రోజుల తరువాత మళ్లీ డాక్టర్ వద్దకు వెళ్లి మరిన్ని పరీక్షలు చేయించుకున్నాడు. ‘గ్రానైట్ పనికి వెళ్లినప్పుడు వేళకు తినక, కనీసంగా నీళ్లు కూడా తాగక కిడ్నీలు పూర్తిగా పాడయ్యాయి. కిడ్నీ మార్చడం (ట్రాన్స్ప్లాంటేషన్) మినహా మరోదారి లేదు. కిడ్నీ మార్చేంత వరకు వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయించుకోవాలని సూచించారు. ఇప్పుడు రమేశ్ పరిస్థితి దయనీయంగా మారింది. పనికి వెళితే ప్రాణానికే ప్రమాదమని డాక్టర్ హెచ్చరించడంతో కూలి పనులకూ వెళ్లడం లేదు. ఆయన భార్య ఒక్కతే రెక్కలు ముక్కలు చేసుకుని భర్తను, ఇద్దరు పిల్లలను సాకుతోంది. ఇన్నాళ్లూ కూలినాలి చేసి కూడబెట్టిన రూ.2 లక్షలు ఆస్పత్రి ఖర్చులకు కరిగిపోయాయి. ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం అందుతోంది. అయినప్పటికీ.. మందులకు నెలకు రూ.ఆరు వేలు ఖర్చవుతున్నది. తండ్రి అనారోగ్యం, తల్లి కష్టం చూసి.. ఆ ఇద్దరు మగ పిల్లలు తల్లడిల్లారు. చదువు మానేసి తల్లితోపాటు కూలి పనుల్లోకి దిగారు.
(రమేశ్కు సాయం చేయాలనుకున్న వారు 88975 22301లో సంప్రదించవచ్చు. ఇదే నంబర్కు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా సాయం అందించవచ్చు)