రెండు గదుల ఇంటిని నిర్మించి ఇచ్చిన ‘పాఠశాల ఫౌండేషన్’
కొత్తగూడెం అర్బన్, అక్టోబర్ 17: మానసిక, శారీరక ఎదుగుదల లేని ఓ నిరుపేద యువతికి పాఠశాల ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ రెండు గదుల ఇంటిని నిర్మించి ఇచ్చింది. పాత కొత్తగూడేనికి చెందిన జంగిలి అనూష అనే 18 ఏళ్ల యువతి చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి నాయనమ్మ సంరక్షణలో పెరుగుతోంది. కానీ అనూషకు మానసికంగా, శారీరకంగా ఎదుగుదల లేదు. సొంత ఇల్లు కూడా లేకపోవడంతో అద్దె ఇంట్లోనే నివసిస్తున్నారు. వీరికి చేదోడు వాదోడుగా ఉండే మేనమామ కూడా ప్రమాదశాత్తూ మరణించడంతో వీరిద్దరూ దిక్కుతోచని స్థితిలో మిగిలిపోయారు. ఆసరా పింఛన్తోనే బతుకుబండిని వెళ్లదీస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పాఠశాల ఫౌండేషన్ ప్రతినిధులు అమెరికాలో ఉంటున్న ఫౌండేషన్ నిర్వాహకుడు కల్యాణపు శ్రీనివాస్కు సమాచారం ఇచ్చారు. అమెరికాలో ఉన్న మిత్రులు, సన్నిహితుల చొరవతో ఇంటి నిర్మాణానికి కావాల్సిన రూ.3 లక్షల నిధులను ఏర్పాటు చేశారు. ఆ యువతికి కొంత ఇంటి స్థలం ఉండడంతో ఇక్కడి ప్రతినిధుల ద్వారా అందులో ఇంటి నిర్మాణం పూర్తి చేయించారు. ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శి సాదు నర్సింహారెడ్డి, ఖమ్మం జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, జిల్లా గ్రేహౌండ్స్ ఏఎస్పీ రోహిత్రాజు, కొత్తగూడెం వన్టౌన్ సీఐ బత్తుల సత్యనారాయణ చేతుల మీదుగా ఈ నూతన గృహాన్ని ఆ యువతికి అప్పగించారు. పాఠశాల ఫౌండేషన్ ప్రతినిధులు కల్యాణపు సాంబశివ, స్వరూప్, తాటికొండ రామారావు, సహారా మినిస్ట్రీస్ నిర్వాహకులు లాల్ బహదూర్ శాస్త్రి, కౌన్సిలర్ కౌడగాని పరమేశ్ యాదవ్, మేదరమెట్ల పుల్లయ్య చౌదరి, నవీన్, రాజు తదితరులు సహకరించారు.