రూ.52 కోట్లతోపనులు
వచ్చే మార్చి నాటికి పూర్తి చేసేలా అధికారుల కసరత్తు
ఖమ్మం, సెప్టెంబర్ 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి) :ఖమ్మం నూతన కలెక్టరేట్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కొవిడ్ కారణంగా పనులు నెమ్మదించాయి. వైరస్ తగ్గుముఖం పట్టడంతో పనుల్లో వేగం పెంచారు. జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకచోట ఏర్పాటు చేసి ప్రజలకు సుపరి పాలన అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం సమీకృత కలెక్టరేట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఖమ్మం సమీపంలోని వి.వెంకటాయపాలెం వద్ద రూ.52 కోట్లతో కలెక్టరేట్ నిర్మాణ పనులు చేపట్టింది. ఈ పనులు వచ్చే మార్చి నాటికి పూర్తి చేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఖమ్మం నూతన కలెక్టరేట్ నిర్మాణ పనుల్లో వేగం పుంజకున్నది. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన సమీకృత కలెక్టరేట్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాన్నీ ఒకచోట ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు సుపరి పాలనా అందించవచ్చని ప్రభుత్వం సమీకృత కలెక్టరేట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
రూ.52 కోట్లతో నిర్మాణం
ఖమ్మం సమీపంలోని వి.వెంకటాయపాలెం వద్ద నిర్మిస్తున్న కలెక్టరేట్ నిర్మాణ పనులను రహదారులు, భవనాలశాఖ పర్యవేక్షిస్తోంది. నూతన కలెక్టరేట్ కార్యాలయ నిర్మాణానికి 20.24 ఎకరాలను రైతుల నుంచి సేకరించింది. ఎకరానికి రూ.కోటి చొప్పున రైతులకు పరిహారం చెల్లించింది. భూముల కొనుగోలు చేసే విషయంలో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించినా.. కలెక్టరేట్ నిర్మాణాన్ని అక్కడే నిర్మించాలని కోర్టు తీర్పునిచ్చింది. ఈ క్రమంలో సమీకృత కలెక్టరేట్ కార్యాలయ భవన నిర్మాణ పనులను రూ.52 కోట్లతో చేపట్టారు. ఈ పనులు కొంత ఆలస్యం కావడంతో కలెక్టరేట్ నిర్మాణ అంచనా వ్యయాన్ని సైతం ప్రభుత్వం పెంచింది. ప్రస్తుతం సమీకృత కలెక్టరేట్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
మొత్తం 4 బ్లాకులతో జీప్లస్-2గా నిర్మించే ఈ భవనాలు లక్షా 57వేల స్కేర్ ఫీట్లో నిర్మితం కానున్నాయి. భవన నిర్మాణ పనులకు సంబంధించి బ్లాకుల వారీగా నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. పనులు పూర్తికావడానికి మరో 6 నెలల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. తొలుత వచ్చే సంక్రాంతి నాటికి సమీకృత కలెక్టరేట్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావించినా కొవిడ్ కారణంగా పనులు ఆగిపోయాయి. దీంతో వచ్చే ఉగాది నాటికి కలెక్టరేట్ నిర్మాణ పనులు పూర్తవుతాయని అధికారులు భావిస్తున్నారు. నిర్మాణ పనులకు సంబంధించి ఆర్అండ్బీ అధికారులు రోజువారీగా పర్యవేక్షిస్తున్నారు. ఇది పూర్తయితే జిల్లాలోని అన్ని నియోజకవర్గాల అన్నిప్రాంతాల ప్రజలకు రవాణా సౌలభ్యం కానుంది.
రెండంతస్తులు.. నాలుగు బ్లాకులు..
ఖమ్మం జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయం ఆకర్షణీయంగా ఉండేలా సుందరంగా తయారవుతోంది. జీప్లస్-2 విధానంలో నిర్మిస్తుండగా ఏ,బీ,సీ,డీ అనే నాలుగు బ్లాకులుగా విభజించారు. గదులను విశాలంగా నిర్మిస్తున్నారు. ఒక్కో బ్లాకులో 20 వరకు కార్యాలయాల చొప్పున మొత్తం 56 ప్రభుత్వ శాఖలకు గదులను కేటాయించి నిర్మించేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. మొదటి అంతస్తులో కలెక్టర్, అదనపు కలెక్టర్ కార్యాలయాల ఏర్పాటు కానున్నాయి. కలెక్టర్ కార్యాలయంలో దాదాపు 50 మంది అధికారులు కూర్చునేలా నిరిస్తున్నారు. పనులు చివరి దశకు చేరుకుంటున్నాయి. 2022 మార్చి నాటికి నూతన కలెక్టరేట్ను ప్రారంభించేలా అధికారులు పనులను వేగవంతం చేస్తున్నారు.