కొత్తగూడెం, అక్టోబర్ 16: భద్రాద్రి జిల్లాలో మరికొద్ది రోజుల్లో పత్తి పంట రైతుల చేతికి రానున్నది.. ఈ సారి 20 లక్షల క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. మార్కెటింగ్శాఖ అధికారులు పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో కొనుగోళ్లకు నాలుగు జిన్నింగ్ మిల్లులు కేటాయించారు.. సకాలంలో వర్షాలు కురవడం, చెరువులు నిండడం, సాగుకు ముందే రైతుబంధు సాయం అందడం రైతులకు కలిసి వచ్చింది.. ఆశించిన మేర దిగుబడులు వస్తాయని రైతులు ఆశిస్తున్నారు..
భద్రాద్రి జిల్లాలో మరికొద్ది రోజుల్లో పత్తి పంట రైతుల చేతికి రానున్నది. పత్తి కొనుగోళ్లకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పత్తి తీత పనులు మొదలయ్యాయి. అధికారులు అతి త్వరలో కొనుగోళ్లు ప్రారంభించనున్నారు. జిల్లాకు నాలుగు జిన్నింగ్ మిల్లులను కేటాయించారు. రైతులు ఈ ఏడాది 1,62,504 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. ఐదేళ్ల నుంచి ఏటికేడు సాగు విస్తీర్ణాన్ని పెంచుతూ వస్తున్నారు. దీనికి తోడు సకాలంలో వర్షాలు కురవడం, చెరువులు నిండడం కూడా సాగుకు కలిసి వస్తున్నది. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉండడంతో రైతులు పత్తి సాగుపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. వానకాలంలో 20 లక్షల క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేస్తున్నది.
సాగుపై కోటి ఆశలు
రైతులు పట్టిందల్లా బంగారం అవుతన్నందుకు పత్తి సాగే నిదర్శనమని చెప్పాలి. గడిచిన నాలుగు సంవత్సరాల మాదిరిగానే ఈ ఏడాది కూడా రైతులు పత్తి సాగుపై ఆశలు పెట్టుకున్నారు. అందుకే ఈసారి లక్ష్యానికి మించి సాగు చేశారు. ప్రభుత్వం ఏటా గిట్టుబాటు ధరలూ పెంచుతుండడంతో పత్తి సాగు వారికి కలిసి వస్తున్నది. సాకలంలో రైతుబంధు సాయం, పంట రుణాలు అందుతండడంతో రైతులకు ఇబ్బందులు తప్పాయి. ఎరువులు, విత్తనాలు కూడా సకాలంలో అందడంతో పంట ఆలస్యం కాలేదు. సన్నకారు రైతులు కూడా ముందుకు వచ్చి ఈసారి పత్తి సాగు చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు సలహాలు, సూచనలిస్తున్నారు.
ఐదేళ్లలో జిల్లా పత్తి సాగు వివరాలు నాలుగు చోట్ల కొనుగోలు కేంద్రాలు..
సుజాతనగర్ మండలంలోని మంజిత్ కాటన్ మిల్, ఇల్లెందు సమీపంలోని కారేపల్లిలో శ్రీలక్ష్మి కాటన్ మిల్, బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో అనుశ్రీ కాటన్ మిల్, అశ్వాపురం శ్రీలక్ష్మి కాటన్ మిల్ ద్వారా పత్తి కొనుగోళ్లు జరుగనున్నాయి. పత్తి కొనగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మిల్లుల్లో పత్తిని ఆరబెట్టేందుకు షెడ్లను సిద్ధ చేయించారు. రైతులకు వసతులు కల్పించారు. సుజాతనగర్ మండలంలోని కాటన్ మిల్లులో ఇప్పటికే పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి.
ఈ నెల చివరి కల్లా కొనుగోళ్లు..
ఈ ఏడాది పత్తి దిగుబడి బాగా రావచ్చని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఎప్పటి లాగానే జిల్లాలో నాలుగు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. కొత్తగూడెం, ఇల్లెందు, బూర్గంపాడు, అశ్వాపురం మండలాల పరిధిలో జిన్నింగ్ మిల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా కొనుగోళ్లు ప్రారంభిస్తాం. ఇప్పుడు పంట కాత దశకు వచ్చింది. ఇప్పటికే కొంత మంది రైతులు పత్తి తీస్తున్నారు. ముందస్తుగా కేంద్రాలను కొనుగోళ్లకు సిద్ధం చేశాం.