ఖమ్మం ఏఎంసీకి పోటెత్తనున్న ఎర్రబంగారం
కొద్ది రోజుల్లో యార్డుకు చేరే అవకాశం
ముందస్తు చర్యలతోనే సాఫీగా క్రయవిక్రయాలు
ఖమ్మం వ్యవసాయం, నవంబర్ 15 : గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సారి రైతులు రికార్డు స్థాయిలో మిర్చిసాగు చేశారు. ఏటా జిల్లాలో 50 నుంచి 55 వేల ఎకరాల్లో మిర్చి సాగు చేసేవారు. ఈ ఏడాది లక్ష ఎకరాలకు పైగా సాగు చేశారు. గతేడాది సీజన్ చివరి నాటికి మార్కెట్లో మిర్చికి రికార్డు స్థాయిలో ధర పలకడంతో ఈ సారి పత్తికి బదులు మిర్చి సాగు చేపట్టారు. దీంతో ఖమ్మం ఏఎంసీకి భారీగా ఎర్రబంగారం రానున్నది. ఈ నేపథ్యంలో మార్కెట్లో కార్మికులు, యార్డుల విస్తీర్ణం, ఫైర్సేఫ్టీ, వసతులు, మిర్చి క్రయవిక్రయాలకు సంబంధించి ముందస్తు తీసుకోవాల్సిన చర్యలపై ‘నమస్తే తెలంగాణ’ కథనం.
జిల్లాతోపాటు పొరుగు జిల్లాల రైతులు గతంలో ఎన్నడూ లేనివిధంగా మిర్చి సాగు చేశారు. గతేడాది సీజన్ చివరి నాటికి మార్కెట్లో రికార్డు స్థాయి ధర పలికింది. పత్తి రైతులు ఈ ఏడాది పత్తికి బదులుగా ఈ సారి మిర్చి సాగు చేపట్టారు. దీంతో ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు కొద్ది రోజుల్లోనే భారీగా పంట వచ్చే అవకాశం కనిపిస్తున్నది. నాలుగేళ్లక్రితం ఒక్కరోజు లక్ష బస్తాలు వచ్చినప్పుడు అనేక సమస్యలు ఎదురయ్యాయి. ఈ ఏడాది సీజన్లో ఒక్కరోజు సుమారు 2 లక్షల బస్తాలు వచ్చే అవకాశం కనిపిస్తున్నది. ఏటా జిల్లాలో 50- 55 వేల ఎకరాలు మిర్చి సాగయ్యేది. ఈ ఏడాది లక్ష ఎకరాలకు పైబగా సాగు జరిగింది. ఖమ్మం ఏఎంసీకి పంట వచ్చే భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలతోపాటు ఆంధ్రా సరిహద్దు గ్రామాల్లో భారీగా మిర్చి సాగవుతున్నది. తెలంగాణలో తేజా రకం పంట ఖమ్మం, వరంగల్ మార్కెట్లకు మాత్రమే రైతులు తీసుకొస్తుంటారు. పొరుగు జిల్లాలతోపాటు ఖమ్మం జిల్లాలో కోల్డ్స్టోరేజీల సంఖ్య తక్కువగా ఉంది. జిల్లాలో కేవలం 40 లక్షల బస్తాలు దాదాపుగా 15 లక్షల క్వింటాళ్ల సామర్థ్యం ఉంది. ఈ పరిస్థితుల్లో మిర్చి క్రయవిక్రయాలకు సంబంధించి ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కార్మికులు, యార్డుల విస్తీర్ణం, ఫైర్సేఫ్టీ, మౌలిక వసతులు, ట్రాఫిక్, బినామీ వ్యాపారులపై ఉక్కుపాదం మోపితే మిర్చి క్రయ విక్రయాలు సాఫీగా జరిగే అవకాశం ఉంది.
బినామీలను అరికడితేనే కృత్రిమ అల్లర్లకు చెక్
పంటలు మార్కెట్కు వచ్చిందంటే చాలు బినామీ అడ్తీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తుంటాయి. దళారులు రైతుల దగ్గర పంటను కొనుగోలు చేసి తిరిగి ఆ పంటను మార్కెట్లో అమ్ముకునేందుకు వస్తుంటారు. లైసెన్స్ కలిగిన వ్యాపారులు వీరిని గుమాస్తాలుగా పరిచయం చేసి యార్డులకు ప్రవేశించేలా సహకరిస్తుంటారు. అక్కడ కొనుగోలు చేసిన పంటకు మరింత ధర రాని పక్షంలో సదరు బినామీ వ్యాపారులు రైతు ముసుగులో కృత్రిమ అల్లర్లు సృష్టించడం.. క్రయవిక్రయాలకు ఆటంకం కలిగించడం చేస్తుంటారు. అయితే, సీజన్కు ముందుగానే లైసెన్స్లను కిరాయిరూపంలో తాకట్టు పెట్టి బినామీలకు సహకరించే అసలైన వ్యాపారులను గుర్తించాల్సిన అవసరం ఉంది.
దడవాయిల కొరత
కొన్నేళ్ల నుంచి దడవాయిల కొరత స్పష్టంగా కనిపిస్తున్నది. గతంలో పనిచేసినవారిలో కొందరు వారసులు, బంధువులు మాత్రమే వారి స్థానంలో వచ్చారే తప్ప కొత్తవారు అడుగుపెట్టలేదు. గతంలో 10-20 మంది ఖరీదుదారులు ఉంటే ప్రస్తుతం 200 మంది వరకు ఉన్నారు. అడ్తీవ్యాపారులు (కమీషన్ వ్యాపారులు) గతంలో 84 మంది ఉంటే ప్రస్తుతం లైసెన్స్ కలిగిన వ్యాపారులు 450 మంది ఉన్నారు. ఎడ్లబండి కార్మికులు (ట్రాలీ కార్మికులు) గతంలో 20-30 మంది ఉండగా.. ప్రస్తుతం 130 మంది ఉన్నారు. వారితోపాటు గతంలో 400 మంది హమాలీలు, రెల్లుడు కార్మికులు ఉండగా.. ప్రస్తుతం 2,600 మందికిపైగా ఉన్నారు. మార్కెట్లో పంట సీజన్ వచ్చిందంటే చాలు రైతులు దడవాయిలు సరిపడా లేకపోవడంతో పరేషాన్ అవుతుంటారు. ఉదయం పత్తి, మిర్చి క్రయవిక్రయాలు దాదాపు పది నిమిషాల వ్యవధిలోనే ప్రారంభమవుతుంటాయి. వందలాది మంది రైతుల దగ్గరకు వెళ్లడం 84 మంది దడవాయిలతో కావడం లేదు. దీంతో రైతులు మార్కెట్లోనే పడిగాపులు కాయాల్సి వస్తున్నది. ఈ దడవాయిల్లో కొందరు నగరం లోపల, నగరం బయట ఉన్న కోల్డ్స్టోరేజీల దగ్గర క్రయవిక్రయాలకు వెళ్లడం జరుగుతున్నది. దశాబ్దాల నుంచి ఈ సమస్య మార్కెట్ను వెంటాడుతోంది.
మిర్చియార్డుల్లో ఫైర్ సేఫ్టీ తప్పనిసరి
అగ్గి పడితే బుగ్గి అయ్యే పంటలు పత్తి, మిర్చి. వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు రైతులు ఎక్కువ మొత్తంలో మిర్చిపంట మార్కెట్కు తీసుకొస్తుంటారు. పత్తియార్డులో ఇప్పటికే అవసరమైన ఫైర్సేఫ్టీ పరికరాలు అందుబాటులో ఉంచారు. నీటి పంపులు ఏర్పాటు చేశారు. మిర్చి సీజన్లో అపరాల యార్డుతోపాటు మిర్చియార్డులో సైతం క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. ఈ రెండు యార్డుల్లో ఫైర్సేఫ్టీకి సంబంధించిన రక్షణ పరికరాలు అమర్చలేదు. దీంతో ఏటా సిబ్బంది ఎలాంటి ఆపద ముంచుకొస్తుందోనని దిగులు పడేవారు. గతంలో మార్కెట్ పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేసిన అగ్నిమాపక వాహనం సైతం అందుబాటులో లేకుండా పోయింది. పైగా అదే కేంద్రంలో పరిపాలనకు సంబంధించిన సెక్షన్లను తరలించారు. కనీసం మిర్చి యార్డులో అక్కడక్కడ ఫైర్ సేఫ్టీ పరికరాలు అందుబాటులో ఉంచితే ఎలాంటి ఆపదొచ్చినా నివారణ చేసే అవకాశం ఉంటుంది.
‘