చకచకా అర్బన్ పార్క్ నిర్మాణం
త్వరలో ప్రారంభోత్సవం
పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దుకుంటున్న ‘సత్తుపల్లి’
కనువిందు చేయనున్న జింకలు
సత్తుపల్లి రూరల్, నవంబర్ 15 : అక్కడికెళ్తే ఆహ్లాదకర వాతావరణం స్వాగతం పలుకుతున్నది. ఏపుగా పెరిగిన పచ్చని చెట్లు మదిని దోచేస్తున్నాయి. పక్షుల కిలకిలా రావాలు.. చెంగుచెంగున ఎగిరే లేడి పిల్లలు పర్యాటకులకు కనువిందు చేయనున్నాయి. వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్లు ఆరోగ్యానికి రక్షణగా నిలవనున్నాయి. సత్తుపల్లి పట్టణంలోని వేంసూరురోడ్లో అటవీశాఖ ఆధ్వర్యంలో 375 ఎకరాల విస్తీర్ణంలో పర్యావరణ పరిరక్షణతోపాటు ప్రజలకు ఆహ్లాదం కలిగించేలా రూ.1.50 కోట్లతో అర్బన్ పార్క్ను నిర్మిస్తున్నారు. దీన్ని త్వరలో ప్రారంభించి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాదు, భవిష్యత్లో పిల్లల కోసం మరిన్ని అధునాతన సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళిక రూపొందించారు. చిల్డ్రన్స్ పార్క్, సైక్లింగ్ ట్రాక్, యోగాశాల, ఆర్బోరేటం (వివిధ ఔషధ మొక్కలతో పరిశోధనా కేంద్రం), సమావేశ మందిరం, పర్యాటకుల కోసం సెల్ఫీపాయింట్కు ఏర్పాట్లు చేయనున్నారు.
సత్తుపల్లి అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. రాజకీయ, సామాజిక, పారిశ్రామికంగా పురోగమిస్తోంది. పంచాయతీ నుంచి నగర పంచాయతీ.. నగరపంచాయతీ నుంచి మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. చిన్న చిన్న ఇళ్ల నుంచి అపార్ట్మెంట్ల వరకు నిర్మించారు. వ్యాపార రంగంలోకి కార్పొరేట్ సంస్థలు ప్రవేశించాయి. గతంలో రాజకీయంగా చరిత్ర కలిగిన సత్తుపల్లి నేడు పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దుకుంటోంది. సింగరేణి రాకతో అడవులు అంతరించిపోతున్న సమయంలో పట్టణానికి ఆనుకుని వేంసూరు రోడ్లో అటవీశాఖ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణతోపాటు ప్రజలకు ఆహ్లాదం కలిగించేలా అర్బన్పార్క్ ఏర్పాటు చేశారు.
పార్క్లో ఏం ఉన్నాయంటే..
ప్రజల ఆహ్లాదం కోసం పార్క్లో రూ.7.50 లక్షలతో సుమారు ఆరు కిలోమీటర్ల మేర వాకింగ్ట్రాక్ నిర్మించారు. రూ.60 లక్షలతో చుట్టూ పెన్సింగ్ ఏర్పాటు చేశారు. రూ.8 లక్షలతో పగోడా(హట్), రూ.9 లక్షలతో అర్బన్ ప్రవేశద్వారం, రూ.19 లక్షలతో వాచ్ టవర్ నిర్మించారు. 3.50లక్షలతో పార్క్లో మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాల్లో వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు రూ.8 లక్షలతో 8 చెరువులు అందుబాటులోకి తీసుకొచ్చారు. అటవీ జంతువుల పశుగ్రాసం కోసం 100 హెక్టార్ల విస్తీర్ణంలో రూ.4 లక్షలతో గడ్డి పెంచుతున్నారు. పర్యాటకులు సేదతీరేందుకు రూ.2 లక్షలతో 14 బెంచీలు, రూ.1.60లక్షలతో నాలుగు రచ్చబండలు ఏర్పాటు చేశారు. రూ.1.60 లక్షలతో సాయంత్రం సమయంలో వాకింగ్ కోసం సోలార్ లైట్లు, రూ.6 లక్షలతో రెండు సోలార్ పంపుసెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.
పిల్లల కోసం మరిన్ని సౌకర్యాలు
భవిష్యత్లో పిల్లల కోసం మరిన్ని అధునాతన సౌకర్యాలు కల్పించనున్నారు. చిల్డ్రన్స్ పార్క్, సైక్లింగ్ ట్రాక్, యోగాశాల, ఆర్బోరేటం (వివిధ దేశాల్లో లభించే ఔషధ మొక్కల పరిశోధనా కేంద్రం), సమావేశ మందిరం, పర్యాటకులు, ప్రజల కోసం సెల్ఫీపాయింట్ తదితర ఏర్పాట్లు చేయనున్నారు.
జింకలు, పక్షుల సందడి
375 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన అర్బన్ పార్క్లో ఇప్పటికే అటవీశాఖ ఆధ్వర్యంలో 1.35 లక్షల అటవీజాతి మొక్కలు నాటారు. ప్రస్తుతం అవి ఏపుగా పెరిగాయి. మరోపక్క గతంలోనే అటవీ ప్రాంతంగా ఉండడం, చుట్టూ పెన్సింగ్ వేయడంతో ఇప్పటికే 300లకు పైగా దుప్పులు, జింకలు, రకరకాల జాతుల పక్షులు, కుందేళ్లు, పర్యాటకులు, ప్రజలను కనువిందు చేయనున్నాయి. పక్షుల కోసం 3 వేల రకాల పండ్ల మొక్కలను నాటారు. వాటిని సంరక్షించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అటవీజంతువుల దాహర్తిని తీర్చేందుకు రెండు సోలార్ విద్యుత్ మోటార్ల ద్వారా 8 కుంటల్లోకి నీరు మళ్లించేలా ఏర్పాటు చేశారు. వాటికి ఆహారం నిమిత్తం 100 హెక్టార్లలో సహజసిద్ధమైన గడ్డి పెరిగేలా ఏర్పాట్లు చేశారు.
ఖమ్మం జిల్లాలోనే అతిపెద్ద పార్క్
సింగరేణి కాలుష్య నివారణతోపాటు ప్రజలకు ఆహ్లాదం కలిగించేలా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చొరవతో అటవీశాఖ ఆధ్వర్యంలో సత్తుపల్లి అర్బన్ పార్క్ను ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని జిల్లాలోనే అతిపెద్ద పార్క్గా తీర్చిదిద్దుతున్నారు. త్వరలో అర్బన్ పార్క్ ప్రారంభించేలా ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇప్పటికే 90శాతం పైగా పనులు పూర్తయ్యాయి. అటవీశాఖ ఉన్నతాధికారులు పార్కును సందర్శించి పనులు పర్యవేక్షిస్తున్నారు.
అన్ని హంగులతో అర్బన్ పార్క్
అర్బన్ పార్క్ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తా. పర్యాటకులకు ఆహ్లాదం కలిగించేలా ఆధునిక హంగులతో తీర్చిదిదుతున్నాం. ప్రజల కోసం వాకింగ్ట్రాక్, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశాం. సింగరేణి ద్వారా ఎక్కువ నిధులు తీసుకొచ్చి పార్క్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం. సింగరేణి కాలుష్యం నుంచి ప్రజలను కాపాడేందుకు మొక్కలు పెంచి స్వచ్ఛమైన గాలితోపాటు మంచి వాతావరణాన్ని అందిస్తాం. వాకింగ్ కోసం మెటల్ రోడ్, సేదతీరేందుకు బల్లలు, రచ్చబండలు ఏర్పాటు చేశాం.