ఏజెన్సీలో మెడికల్ కాలేజీలో బోధనకు అడుగులు
వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం కానున్న తరగతులు
30 ఎకరాల్లో మెడికల్, నర్సింగ్ కాలేజీల నిర్మాణాలు
కొత్తగూడెం జిల్లా ఆసుపత్రిలో పెరుగనున్న బెడ్లు
కొత్తగూడెం, నవంబర్ 15: కొండకోనల్లో నివసించే ఆదివాసీ బిడ్డలకు వైద్యం అందుబాటులో ఉండాలని, గిరిజన బిడ్డలు మెడికల్ చదువులు చదువు కోవాలని, వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తేవాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ మారుమూల ఏజెన్సీ జిల్లాకు మెడికల్, నర్సింగ్ కాలేజీలు మంజూరు చేశారు. నిధులు కేటాయింపు, నిర్మాణాల పనులు, ఉద్యోగులు భర్తీ వంటివి చకచకా జరిగిపోతున్నాయి. హైదరాబాద్లో శనివారం కలెక్టర్ల సమావేశంలో మెడికల్ కాలేజీల నిర్మాణాలపై వైద్య శాఖ మంత్రి హరీశ్రావు ప్రత్యేకంగా సమీక్షించారు. నిర్మాణ పనుల పర్యవేక్షణపై కలెక్టర్ అనుదీప్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వైద్యారోగ్య శాఖ, ఆర్అండ్బీ అధికారులతో రివ్యూ చేసి డిసెంబర్ 7 నాటికి పనులు పూర్తి కావాలని ఆదేశించారు.
వచ్చే విద్యాసంవత్సరం నుంచి తరగతులు ప్రారంభమయ్యే విధంగా ప్రణాళికను సిద్ధం చేశారు. ఇప్పటికే ఆర్అండ్బీకి అప్పగించిన పనులు డిసెంబర్ కల్లా పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. నూతన టెక్నాలజీతో నిర్మాణం పనులు చేపడుతున్నారు. దీంతోపాటు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 180 బెడ్ల నిర్మాణానికీ ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ డీసీహెచ్ఎస్ డాక్టర్ ముక్కంటేశ్వరరావు, డాక్టర్ సరళ ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఆసుపత్రి పైభాగంలో ఇనుప గడ్డర్లతో పిల్లర్ల సముదాయాన్ని ఏర్పాటు చేశారు. మరో పది రోజుల కల్లా పూర్తి స్థాయి రూపం కనబడనుంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్న తల్లీబిడ్డల ఆసుపత్రిని కొత్తగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఎంసీహెచ్కు మార్చనున్నారు.
30 ఎకరాల్లో నిర్మాణాలు..
కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల మధ్యలో ఉన్న మైనింగ్ కాలేజీ ప్రాంతంలో ఖాళీగా ఉన్న 30 ఎకరాల భూమిని ఇప్పటికే మెడికల్ కాలేజీకి అప్పగించారు. వచ్చే విద్యా సంవత్సరం మెడికల్ క్లాసులు ప్రారంభం కానున్నందున రూ.38 కోట్లతో నర్సింగ్ కాలేజీ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వచ్చే సంవత్సరంలో నీట్ రాసిన వారికి ఇక్కడే సీట్లు కేటాయింపు జరుగనున్నది.
జిల్లా ఆసుపత్రిలో పెరగనున్న బెడ్లు..
ఇప్పటికే 200 బెడ్లు ఉన్న జిల్లా ఆసుపత్రిలో క్లినికల్స్ కోసం మరో 180 బెడ్లు రానున్నాయి. ప్రస్తుతం జిల్లా వైద్యారోగ్యశాఖ పరిధిలో ఉన్న భద్రాద్రి ఆసుపత్రి.. 380 పడకల తరువాత డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి వెళ్లనున్నది. అధునాతన పరికరాలు, ప్రయోగశాలలు, అన్ని వైద్య విభాగాలు అందుబాటులోకి రానున్నాయి.
గిరిజన బిడ్డలకు సీఎం కానుక..
ఆదివాసీ విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షలా ఉండేది. మన గిరిజన బిడ్డలు నీట్లో సీటు సాధించేలా స్థానికంగా మెడికల్ కాలేజీ పెడితే వారు ఇక్కడే చదువుకొని ఉద్యోగాలు చేసుకునే అవకాశాలు ఉంటాయని సీఎం చేసిన ప్రయత్నం ఫలించబోతోంది.
31 మంది మెడికోలు, ప్రొఫెసర్లు..
కొత్తగూడెంలో నిర్మాణం కానున్న మెడికల్ కళాశాలకు ఇప్పటికే ఆరుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించారు. పీజీ పూర్తి చేసిన 25 మంది డాక్టర్లను మెడికల్ కాలేజీలో బోధన కోసం నియమించారు.
కేటాయింపులు ఇలా..
మెడికల్ కాలేజీకి 30 ఎకరాల స్థలం, నర్సింగ్ కాలేజీకు 5 ఎకరాల స్థలంతోపాటు రూ.38 కోట్ల నిధులు, జిల్లా ఆసుపత్రిలో 180 కొత్త బెడ్ల ఏర్పాటుకు రూ.8 కోట్లు నిధులు కేటాయించారు.