తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు స్పందించిన మంత్రి అజయ్
రోటరీనగర్ పాఠశాల విద్యార్థులకు బస్సు సౌకర్యం
రఘునాథపాలెం, నవంబర్ 15: పాఠశాలలకు విద్యార్థులను బస్సుల్లో రవాణా చేయడం కేవలం ప్రైవేటు విద్యాసంస్థల్లోనే చూస్తుంటాం. ప్రస్తుతం ప్రభుత్వ బడులకు వెళ్లే విద్యార్థులకూ బస్సు సౌకర్యం చేరువైంది. పైసా ఖర్చు లేకుండా విద్యార్థులను ఇంటి నుంచి బడికి, బడి నుంచి ఇంటికి చేర్చేందుకు ఆర్టీసీ ముందుకొచ్చింది. ఈ సదావకాశం రఘునాథపాలెం మడలం వీ వెంకటాయపాలెం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు దక్కింది. ఖమ్మం 8వ డివిజన్ పువ్వాడ అజయ్నగర్లో ఉంటున్న నిరుపేదల పిల్లలు వీ వెంకటాయపాలెం ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాల సుదూరంగా ఉండడం, విద్యార్థులు నిత్యం వెళ్లిరావడం భారమవుతోంది. అయితే విషయాన్ని స్థానిక టీఆర్ఎస్ నాయకుల సహాయంతో విద్యార్థుల తల్లిదండ్రులు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. పాఠశాలకు బస్సు సౌకర్యాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వారి అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన మంత్రి అజయ్కుమార్ వెంటనే ఖమ్మం ఆర్టీసీ అధికారులతో చర్చించి బస్సు సౌకర్యాన్ని కల్పించారు. సోమవారం విద్యార్థులను ఎక్కించుకునేందుకు ఆర్టీసీ బస్సు రావడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. బస్సు సౌకర్యం కల్పించిన మంత్రి పువ్వాడ అజయ్కుమార్కు తల్లిదండ్రులు, స్థానిక టీఆర్ఎస్ నేత వాంకుడోతు సురేశ్ కృతజ్ఞతలు తెలియజేశారు.