Anjanapuram | విద్యే మనిషిని పరిపూర్ణుడిగా తీర్చిదిద్దుతుంది. ఊరి పెద్ద విజ్ఞానమూర్తి అయితే.. అక్కడ విద్యా వికాసం విరజిమ్ముతుంది. ఆ ఊరి పెద్ద ఆరాటానికి ఫలితం అప్పటికప్పుడు దక్కకపోయినా.. తరువాత విద్యా సంపదను సముపార్జించి పెట్టిందనడంలో ఎలాంటి సందేహం లేదు. గ్రామ పెద్ద సంకల్పాన్ని సార్థకం చేశాక అందివచ్చిన ప్రయోజనాలు, చేకూరిన ఫలాలు ఎంతటి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయో ఆ పల్లెకు వెళ్తే తెలుస్తుంది. ఒకరి మేధస్సు తన ఇంటినే కాకుండా ఊరు మొత్తాన్నే ప్రకాశింపజేస్తోందనేందుకు ఈ గ్రామం ఓ మచ్చుతునక. 534 కుటుంబాల్లో సుమారు 155 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. అందులో సుమారు 80 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులే.. ఒకప్పటిలా ఇప్పుడు ఈ ఊరిలో ఉన్నది ఒక జ్ఞానమూర్తి కాదు.. ప్రతి ఇంట్లోనూ జ్ఞానదీప్తులు ఉన్నారు. విద్యాకాంతులను వికసింపజేస్తున్న ఆ పల్లె గురించి తెలుసుకోవాలంటే.. బూర్గంపహాడ్ మండలంలోని అంజనాపురం గ్రామానికి వెళ్లాల్సిందే..
-భద్రాద్రి కొత్తగూడెం, మే 3 (నమస్తే తెలంగాణ)
‘మా పిల్లలకు చదువు అబ్బడం లేదు’ అంటూ తల్లిదండ్రులు తమ పిల్లలను బడి మాన్పించి చేను పనికి తీసుకెళ్లే రోజుల్లో వారికి అడ్డుపడి పిల్లలను బడికి పంపించాడు ఓ పెద్దాయన. ఊరంటే అందులో బడి, గుడి ఉండాలన్నది ఆయన తలంపు. అందుకు తగ్గట్టుగానే బడిని, గుడిని ఏర్పాటు చేశాడు. అప్పట్లో తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపేందుకు అయిష్టత చూపినప్పటికీ ఊరి పెద్ద మాటను కాదనలేక ప్రాథమిక పాఠశాలకు పంపారు. అక్కడి నుంచి ఆ పిల్లలు ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసుకొని ఆ ఊరి పెద్దాయన ఆశయాన్ని నెరవేర్చారు. అంతేగాక తమ ఊరికీ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఆ ఊరి పేరు అంజనాపురం, ఆ ఊరి పెద్ద పేరు తేజావత్ సూర్యం.
ఆశయం నెరవేరి..
భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్ మండలంలో 1962లో ఆ ఊరిని ఏర్పాటు చేశారు. గ్రామపెద్ద తేజావత్ సూర్యం. తమ ఊరికి అంజన్న పేరు పెట్టాలన్న ఆలోచనతో అంజనాపురం అనే నామకరణం చేశారు. సుమారు 80 ఏళ్లున్న ఈ పాత తరం మనిషి గ్రామానికి మూడుసార్లు సర్పంచ్గా పనిచేశారు. ఆ క్రమంలో ఊరి పిల్లలతోపాటు తన పిల్లలనూ బాగా చదివించారు. తరువాత వారు విదేశాల్లో స్థిరపడేలా చేశాడు.
అధిక భాగం ప్రభుత్వ ఉపాధ్యాయులే..
1996 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో 534 కుటుంబాలున్నాయి. ఇందులో లంబాడీ కుటుంబాలే ఎక్కువ. ఈ కుటుంబాల్లో 155 మంది ప్రభుత్వ ఉద్యోగులు. వీరిలో ప్రభుత్వ టీచర్లే 80 మంది. ఇక ఫారెస్టు ఉద్యోగులు 25 మంది, డాక్టర్లు ఐదుగురు, వైద్యశాఖలో ఒకరు, ఇంజినీర్లు ఇద్దరు, ఎన్ఆర్ఐలు నలుగురు ఉన్నారు. మరో 38 మంది ప్రైవేటు ఉద్యోగాల్లో, ఉన్నత స్థానాల్లో ఉన్నారు.
సరస్వతీ పుత్రుల నిలయం..
అంజనాపురమంటేనే సరస్వతీ పుత్రుల నిలయంగా చెబుతుంటారు ఇక్కడి ప్రజలు. వీరిలో ఎక్కువ మంది ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివి ఉద్యోగాలు సాధించారు. ఐదో తరగతి వరకూ ఈ గ్రామంలోని పాఠశాలలోనే చదువుతారు. హైస్కూల్ విద్యను పొరుగున ఉన్న మోరంపల్లి బంజరలోగానీ, కిన్నెరసాని పాఠశాలలోగానీ పూర్తిచేస్తారు. ఇక ఇంటర్, డిగ్రీ వంటి ఉన్నత చదువులు మాత్రం వేర్వేరు ప్రాంతాల్లో ఉండి చదువుతారు. ప్రభుత్వ కొలువులు కొట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతారు. ఇక్కడ ఒక్కో ఇంట్లో ఇద్దరు ముగ్గురు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వారు ఉన్నారు. అలాగే కొడుకు, కోడలు లేదా కూతురు, అల్లుడు కూడా సర్కారు కొలువులు సాధించిన వారు, చేస్తున్న వారు ఉన్నారు. ప్రస్తుతం చాలామంది ప్రభుత్వోద్యోగాలు సాధించేందుకు ప్రిపరేషన్లో ఉన్నారు. వచ్చే ఏడాది కల్లా మరో 50 మంది వరకూ ఉద్యోగాలు దక్కించుకుంటారని ధీమాగా చెబుతున్నారు వారు.
బడి ఏర్పాటు చేశా.. పిల్లలు సార్థకం చేశారు..
1962లో ఇక్కడ ఊరిని ఏర్పాటు చేశాను. గ్రామానికి బడి ఉండాలన్న ఉద్దేశంతో దానిని ప్రభుత్వ బడిని ఏర్పాటు చేయించాం. అందరూ చదువుకోవాలన్నదే నా ఆశయం. కాలక్రమంలో అది పూర్తిగా నెరవేరింది. నేడు చాలా మంది ఉద్యోగాలు చేస్తుండడమే ఇందుకు ఉదాహరణ. ఊరికి ఏదైనా సాయం కావాలంటే అందరూ వచ్చి వాలిపోతారు. నా సంతానంలో ఒక కుమారుడు అమెరికాలో, మరో కుమారుడు వైద్య రంగంలో హైదరాబాద్లో స్థిరపడ్డారు. ఇంకో కొడుకు వ్యాపార రంగంలో రాణిస్తున్నాడు. మా బంధువుల్లోనూ చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు. నేనేమో ఊరిలోనే పొలం సాగు చేసుకుంటాను.
–తేజావత్ సూర్యం, గ్రామ పెద్ద, అంజనాపురం
ప్రభుత్వ వైద్యులే ఐదుగురున్నారు..
మా గ్రామంలో అందరూ రైతు కుటుంబాల వారే. ఒకప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపేవారు కాదట. కానీ ఇప్పుడు తల్లిదండ్రులందరూ ముందుచూపుతో తమ పిల్లలను బాగా చదివిస్తున్నారు. దీంతో వారు కూడా కష్టపడి ఉద్యోగాలు సాధిస్తున్నారు. మా ఊరిలో ప్రభుత్వ వైద్యులే ఐదుగురున్నారు. వైద్యశాఖలోని వివిధ ఉద్యోగాల్లో మరో పది మంది వరకూ ఉన్నారు. ప్రైవేటుగా అయితే ఇంకా చాలా మంది చేస్తున్నారు. చదువు విలువ తెలిసిన గ్రామం.. మా అంజనాపురం.
–తేజావత్ రమేశ్, సింగరేణి వైద్యుడు, అంజనాపురం
తొలి టీచర్గా గర్వపడుతున్నా..
మా ఊరిలో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. జీవితంలో స్థిరపడ్డారు. వారికి విద్యాబుద్దులు నేర్పిన తొలి టీచర్గా నాకు ఎంతో గర్వంగా అనిపిస్తోంది. మా ఊరి పాఠశాలలో ఒకప్పుడు నా దగ్గర చదువుకున్న వాళ్లు ఇప్పుడు ఉద్యోగాలు సాధించి మళ్లీ ఇదే పాఠశాలకు వచ్చి నాతో మాట్లాడుతుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఒక టీచర్గా నేను సాధించిన గొప్ప విజయంగా భావిస్తున్నాను. విద్యే మనిషిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందనేందుకు మా ఊరి పిల్లలే నిదర్శనం.
–యూకూబ్ ఆలీ, తొలి గురువు, అంజనాపురం
మా ఊరి పాఠశాలలోనే ప్రాథమిక విద్యాభ్యాసం..
నా ప్రాథమిక విద్యాభ్యాసమంతా మా గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలోనే కొనసాగింది. కిన్నెరసాని హైస్కూల్లో టెన్త్, ఖమ్మంలో హయ్యర్ ఎడ్యుకేషన్ పూర్తి చేశాను.ఉన్నతంగా చదువుకోవాలని, ఉద్యోగాల్లో స్థిరపడాలన్న ఆలోచనలకు బీజం మా గ్రామమే. ఇప్పుడు నేను ఆస్ట్రేలియాలో స్థిరపడడమూ మా ఊరి గొప్పతనమే. ఊరిలో అందరమూ కలిసి కట్టుగా ఉంటాం. ఊరికి ఏదైనా సమస్య వస్తే ఉద్యోగులమంతా వచ్చి పరిష్కార మార్గం చూపుతాం.
–తేజావత్ కిషన్రావు, ఎన్ఆర్ఐ, ఆస్ట్రేలియా
ఇక్కడే చదివి.. ఈ స్కూలుకే టీచర్గా వచ్చా..
నా ప్రైమరీ స్టడీ అంతా మా గ్రామంలోని చిన్న స్కూల్లోనే జరిగింది. వేర్వేరు చోట్ల ఉన్నత చదువులు పూర్తి చేశాను. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యాను. చివరికి మా గ్రామానికే వచ్చాను. నేను చదువుకున్న పాఠశాలలోనే ఇప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ఇందుకు ఎంతో సంతోషంగా ఉంది. నాతోపాటు ఈ పాఠశాలలో చదివిన చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఉన్నత స్థానాల్లో ఉన్నారు.
–కిషన్రావు, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం, అంజనాపురం