బీజేపీ నాయకులవి సోది కబుర్లు
ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ
కమలం పార్టీని నమ్మే స్థితిలో రైతులు లేరు
జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు
తెలంగాణ భవన్లో విలేకర్ల సమావేశం
ఖమ్మం, నవంబర్ 14 : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైతే ఢిల్లీలో సైతం ధర్నాకు సిద్ధమని శాసనమండలి సభ్యుడు బాలసాని లక్ష్మీనారాయణ అన్నారు. ఆదివారం ఖమ్మం నగరంలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యాసంగి ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీ నాయకులు సోది కబుర్లు చెపుతూ రైతులను మోసం చేయాలని చూస్తున్నారని, ఇక వారి ఆటలు సాగవని హెచ్చరించారు. 12న జరిగిన ధర్నాను చూసి బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి టీఆర్ఎస్ ప్రతిపక్షమేనని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలాంటివి బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు లేవని ప్రశ్నించారు. జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు మాట్లాడుతూ జిల్లాకు విజిటింగ్ ప్రొఫెసర్లా వచ్చే బీజేపీ నాయకుల మాటలు నమ్మే పరిస్థితిలో రైతులు లేరని అన్నారు. రైతులు పండించిన పంటను కొనుగోలు చేయకుండా సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రెచ్చగొట్టే మాటలు మానుకొని యాసంగి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసేలా జీవో ఇప్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, టీఆర్ఎస్ కార్యాలయ ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ, పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖమర్, పార్టీ మైనార్టీ అధ్యక్షుడు తాజుద్దీన్, యువజన విభాగం అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణచైతన్య పాల్గొన్నారు.