నేడు విజయదశమి పర్వం..
దసరా వేడుకకు ఏర్పాట్లు సిద్ధం
భక్తి శ్రద్ధలతో మహర్నవమి పర్వం
కొత్తగూడెం కల్చరల్, అక్టోబర్ 14 : దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన దసరా వేడుకలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆశ్వయుజ శుద్ధ దశమి శుక్రవారం దసరా పండుగను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలు అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకోనున్నారు. విజయదశమి సందర్భంగా స్వామి వారు లక్ష్మీ సమేతుడై గ్రామాంతరం వెళ్లే ఉత్సవమే జమ్మిబండ పారువేట. శమీవృక్షం ప్రస్తావన రామాయణ, మహాభారతాల్లో ప్రస్ఫుటిస్తుంది. విజయాలను అందించే ఈ వృక్షాన్ని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయనేది నమ్మకం.
రావణ సంహారమే దసరా..
విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుడిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై ఉంచిన వారి ఆయుధాలను తిరిగి తీసుకెళ్లిన రోజు.. ఈ సందర్భంగా రావణ వధ. జమ్మి ఆకులు పూజ చేయడం రివాజు. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసుడితో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి అతణ్ని వధించి విజయాన్ని పొందిన సందర్భంగా ప్రజలంతా సంతోషంగా పండుగ జరుపుకున్నారు. అదే విజయదశమి.
జిల్లావ్యాప్తంగా పూజలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో దసరా సంబురాలు ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కేంద్రంలోని మొర్రేడు వాగు, రైటర్ బస్తీ, రామవరం, రుద్రంపూర్లోని ఆలయాలు పెద్దమ్మతల్లి ఆలయంతోపాటు పాల్వంచ, మణుగూరు, ఇల్లెందు, భద్రాచలం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో ఆలయాల్లో శుక్రవారం ప్రత్యేక పూజలు జరుగనున్నాయి. వేడుకల్లో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియానాయక్, మెచ్చా నాగేశ్వరరావు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కొవిడ్ కారణంగా కొత్తగూడెంలోని మొర్రేడువాగు ఒడ్డున రావణ సంహారం నిర్వహించడం లేదని కమిటీ సభ్యులు తెలిపారు.
భక్తి ప్రపత్తులతో మహర్నవమి..
శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం జగన్మాత ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆశ్వయుజ శుద్ధ నవమి గురువారం మహార్నవమి పర్వదినాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఆలయాలు, పలు ఉత్సవ మండపాల్లో కొలువైన అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. శ్రీలలితా సహస్ర నామ పారాయణం, కుంకుమ పూజలు చేసి తరించారు. నగరంలోని శ్రీకన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవి మాత శ్రీప్రత్యంగిరా దేవి అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయంలో చండీహోమం, పూజలు చేశారు.