వందశాతం వ్యాక్సినేటెడ్ జిల్లాగా భద్రాద్రి ఉండాలి
2022 నాటికి కొవిడ్ రహిత జిల్లాగా ప్రకటించాలి
వ్యాక్సిన్ వేసుకుంటే 99.9 శాతం మరణాలు ఉండవు
ఏజెన్సీ జిల్లాకు ఇలాంటి కలెక్టర్ ఉండడం అదృష్టం
ఎమ్మెల్యే వనమా కృషితో కొత్తగూడెంలో మెడికల్ కాలేజీ
సమీక్ష సమావేశంలో హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు
కొత్తగూడెం, అక్టోబర్ 13:కరోనా వ్యాక్సినేషన్లో భద్రాద్రి జిల్లా మొదటిస్థానంలో ఉండాలని వైద్య శాఖ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు అన్నారు. వ్యాక్సినేషన్ ఆవశ్యకతపై ప్రజాప్రతినిధులకు, వైద్య సిబ్బందికి కొత్తగూడెం క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ జిల్లాలో పుట్టినందుకు, గోదావరి నీళ్లు తాగినందుకు కరోనా కట్టడి కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. 2022 జనవరి నాటికి భద్రాద్రిని కరోనా రహిత జిల్లాగా చేయాలన్నారు. కోల్బెల్ట్ ప్రాంతాల్లో వైరస్లోడ్ ఎక్కువగా ఉందన్నారు. రెండు నుంచి 18 ఏళ్లలోపు ఉన్న పిల్లలకు కూడా త్వరలోనే టీకాలు వేస్తామన్నారు. జిల్లాలో 20 రోజుల్లో 3 లక్షల మందికి టీకాలు వేయడం గొప్ప విషయమన్నారు. టాపర్ అయిన అనుదీప్ ఏజెన్సీ జిల్లాకు కలెక్టర్గా ఉండడం అదృష్టమన్నారు. సుదీర్ఘ అనుభమున్న ఎమ్మెల్యే వనమా ఇక్కడ ఉండడం వల్ల కొత్తగూడేనికి మెడికల్ కాలేజీ వచ్చిందన్నారు. తదుపరి సమావేశం నాటికి పూర్తి వ్యాక్సినేటెడ్ జిల్లా కావాలన్నారు.
వైద్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ: వనమా
ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తనకు వైద్య శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉందని, అందుకే వైద్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నానని అన్నారు. కరోనా నియంత్రణ విషయంలో జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్కు అభినందనలు తెలుపుతున్నామన్నారు. సీఎం కేసీఆర్తో చర్చించి మెడికల్ కాలేజీ తెప్పించానన్నారు. త్వరలో నర్సింగ్ కాలేజీ నిర్మాణం జరగబోతుందన్నారు. కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ ఇప్పటి వరకు 62 గ్రామాల్లో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తయిందని అన్నారు. అనంతరం కొత్తగూడేనికి 20 కొవిడ్ టీకా మొబైల్ వాహనాలను వారు ప్రారంభించారు. మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, డీఎంహెచ్వో డాక్టర్ శిరీష, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు, డీసీహెచ్ఎస్ డాక్టర్ ముక్కంటేశ్వరరావు, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ నాగేంద్రప్రసాద్, డాక్టర్ సుజాత, డాక్టర్ వెంకటేశ్వరరావు, డాక్టర్ చేతన్ పాల్గొన్నారు.