సిటీబ్యూరో, ఏప్రిల్ 23(నమస్తే తెలంగాణ): జలమండలి తీసుకున్న ప్రత్యేక చర్యలతో గ్రేటర్లోని సగానికి పైగా ఫిల్లింగ్ స్టేషన్లలో 24 గంటల్లోపే ట్యాంకర్ డెలివరీ చేస్తున్నామని ఎండీ సుదర్శన్ రెడ్డి చెప్పారు. తొందరలోనే ట్యాంకర్ డెలివరీ సమయాన్ని 12గంటలకు తగ్గించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఖైరతాబాద్ సంస్థ ప్రధాన కార్యాలయంలో మంగళవారం డైరెక్టర్లు, సీజీఎం, జీఎం, డీజీఎంలతో కలిసి వేసవి కార్యాచరణ, ట్యాంకర్ మేనేజ్మెంట్పై ఎండీ సుదర్శన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో నీటి సరఫరా, ట్యాంకర్ బుకింగ్స్, డెలివరీ టైమ్ తదితర వివరాల్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ట్యాంకర్ బుకింగ్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సాధ్యమైనంత త్వరగా డెలివరీ చేయాలన్నారు. మార్చి నెలతో పోలిస్తే కొత్త ట్యాంకర్లు, ఫిల్లింగ్ స్టేషన్లు, ఫిల్లింగ్ పాయింట్స్ ఏర్పాటు చేశామన్నారు. రాత్రి వేళల్లో ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా చేయడంతో పెండెన్పీ బాగా తగ్గించుకున్నామని ఎండీ చెప్పారు. ఇలాగే, ప్రత్యేక దృష్టి పెడితే బుక్ చేసిన 12 గంటల్లోపే ట్యాంకర్ డెలివరీ చేసే వీలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మార్చి నెలలో మొత్తం 1,68,996 ట్యాంకర్ ట్రిప్పులను డెలివరీ చేశామని ఎండీ వివరించారు. ఈ నెలలో 22వ తేదీ నాటికి 1,67,134 ట్రిప్పులు సరఫరా చేసినట్లు వెల్లడించారు. కాగా, మార్చి 31 నాటికి 613 ట్యాంకర్లు ఉండగా.., ప్రస్తుతం 816 వరకు పెంచుకున్నట్లు చెప్పారు. మరిన్ని ట్యాంకర్లు సమకూర్చుకుంటామని ఎండీ తెలిపారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని ఎంసీసీకి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ప్రధానంగా మంచినీటి సరఫరాకు సంబంధించిన సమస్యలు, కలుషిత నీరు సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఎండీ ఆదేశించారు. మురుగునీటి నిర్వహణపై దృష్టి సారించాలని చెప్పారు. నీటి సరఫరాలో ఉద్దేశపూర్వకంగా ఆటంకాలు కలగజేస్తే, ఎలాంటి వారైనా సహించేది లేదని హెచ్చరించారు. ట్యాంకర్ల మళ్లింపు విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఈ సమీక్షలో డైరెక్టర్లు ఆజ్మీరా కృష్ణ, వీఎల్ ్రపవీణ్ కుమార్, స్వామి, రవి కుమార్ పాల్గొన్నారు.