సాగులో కీటకాల నివారణ కోసం సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం
స్టేట్ రెండో ర్యాంక్ సాధించిన‘ ప్రియదర్శిని’ విద్యార్థిని దివ్యశ్రీ ప్రాజెక్టు
పంటను ఆశ్రయించే చీడపీడలను నశింపజేయడం ప్రాజెక్టు ప్రత్యేకత
ఖమ్మం ఎడ్యుకేషన్, జూన్ 13: వ్యవసాయంలో పెట్టుబడిని తగ్గించేందుకు మార్కెట్లోకి వచ్చే ఏ పరికరమైనా రైతులకు చేరువ అవుతుంది. అలాంటి పరికరాన్ని తయారు చేసే ఓ ప్రాజెక్టు ఖమ్మం నగరంలోని ప్రియదర్శిని మహిళా ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థిని ఆవిష్కరించింది. జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జే – హబ్కు ప్రియదర్శిని కళాశాల విద్యార్థిని సమర్పించిన ప్రాజెక్టు రాష్ట్ర స్థాయిలో ద్వితీయ ర్యాంకును సాధించింది. పంటలో ఆశించిన చీడపీడలను నశింపజేయడంతోపాటు చనిపోయిన పురుగులను ఎరువుగా వాడుకొని ఎక్కువ దిగుబడి తెచ్చిపెట్టేలా ప్రాజెక్టును రూపాంతరం చేసింది ఆ విద్యార్థిని. కేవలం సోలార్ పవర్ను వినియోగించి రూ.4 వేల ఖర్చుతో ఐదేళ్లపాటు ఉపయోగించుకునే విధంగా తయారైన పరిశోధనను చూసి శాస్త్రవేత్తలు సైతం విద్యార్థినిని ప్రశంసించారు.
రెండో ర్యాంక్తో సత్తా..
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరిశోధనల కోసం యువతను ప్రోత్సహించేందుకు తెలంగాణ సర్కారు టీ-హబ్ను తీసుకొచ్చింది. దీనికి అనుబంధంగా హైదరాబాద్కు చెందిన జవహర్లాల్ నెహ్రూ టెక్నోలాజికల్ యూనివర్సిటీ.. జే-హబ్ ప్రారంభించింది. రాష్ట్రంలోని అన్ని ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థుల నుంచి పరిశోధనలను సేకరించింది. ఇందులో ఖమ్మం నగరంలోని ప్రియదర్శిని మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో ఈఈఈ బ్రాంచ్ తృతీయ సంవత్సరం విద్యార్థిని సీహెచ్ దివ్యశ్రీ ‘సోలార్ కంట్రోల్డ్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్’ పేరుతో ప్రాజెక్టును సమర్పించింది. జే-హబ్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 283 ప్రాజెక్టులు అందగా దివ్యశ్రీ పరిశోధనకు రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంక్ దక్కింది.
ప్రాజెక్టు ప్రత్యేకత..
సోలార్ పవర్ను ఉపయోగిస్తూ తయారు చేసిన ఈ ప్రాజెక్టు పంటలో ఆశించిన చీడ పురుగులను నశింపజేస్తుంది. దీంతోపాటు ఆ పురుగులను ఎరువులుగా వినియోగించుకొని అత్యధిక దిగుబడిని అందించేందుకు దోహదపడుతుంది. తద్వారా రైతు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఉపకరిస్తుంది. తక్కువ ఖర్చుతో తయారయ్యే ఈ ప్రాజెక్టును ఒకసారి పొలంలో లేదా తోటలో ఉంచితే ఐదేళ్ల వరకు ఉపయోగపడుతుంది. అర ఎకరం పొలంలో త్రీ వాట్స్ కెపాసిట్ గల సోలార్ ప్యానెల్, బ్యాటరీలు, కలెక్టింగ్ టచ్ స్టాండ్లను తయారు చేసేందుకు మొత్తం రూ.4 వేలు ఖర్చవుతుంది. ఈ ప్రాజెక్ట్ను కళాశాల చైర్మన్ నవీన్బాబు, అడ్మిన్ డైరెక్టర్ అట్లూరి వెంకటరమణ, అధ్యాపకులు గోపాల్, నాగరాజు, తులసీకృష్ణ, ప్రతాప్ మార్గనిర్దేశంతో విద్యార్థిని దివ్యశ్రీ రూపొందించింది.
యాజమాన్యం ప్రోత్సాహంతో..
భవిష్యత్తులో ఆయా రంగాల్లో వచ్చే మార్పులకు అనుగుణంగా కళాశాల అధినేత డాక్టర్ కాటేపల్లి నవీన్బాబు కళాశాలలో రీసెర్చి అండ్ డెవలప్మెంట్ విభాగాన్ని నెలకొల్పి వివిధ పరిశోధనలకు కృషి చేస్తున్నారు. తెలంగాణ పరిశోధనా యాత్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో ప్రియదర్శిని విద్యార్థులు అనేక బహుమతులు సాధించారు. యాజమాన్యం ఇచ్చిన ప్రోత్సాహంతో విద్యార్థిని రూపొందించిన ఈ ప్రాజెక్ట్ రైతులకు ఎంతో కీలకమైనది. రూ 4 వేల విలువైన పరికరాన్ని రూ.1500కే తయారుచేసి ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని కళాశాల చైర్మన్ నవీన్బాబు తెలిపారు.