మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటాలి
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
రఘునాథపాలెం, ఏప్రిల్ 13: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత కేవలం ఏడేళ్లలోనే ఖమ్మం అభివృద్ధికి గుమ్మంలా మారిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. కేఎంసీ 7వ డివిజన్ గోపాలపురం వద్ద రూ.3.75 కోట్లతో నిర్మించనున్న ఎన్ఎస్పీ కెనాల్ వాక్వేకు, టేకులపల్లి కేసీఆర్ నగర్లో వైకుంఠధామం నిర్మాణానికి, 4వ డివిజన్ ఖానాపురం ఇల్లెందు ప్రధాన రోడ్డులో 2 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్మాణం చేపట్టే వెజ్, నాన్ వెజ్ మార్కెట్ సముదాయాలకు మంగళవారం ఆయన శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగర నడిబొడ్డు మీదుగా వెళ్తున్న ఎన్నెస్పీ కెనాల్పై వాక్వేలను నిర్మిస్తున్నట్లు చెప్పారు. చేరువలో వైకుంఠధామాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
సమీకృత వెజ్, నాన్వెజ్ మార్కెట్కు దీటుగా ఇల్లెందు రోడ్డులో రెండెకరాల విస్తీర్ణంలో మరో మార్కెట్ను చేపడుతున్నామన్నారు. త్వరలోనే వీటన్నింటినీ పూర్తి చేసి నగర ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. త్వరలో జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటి అన్ని డివిజన్లనూ కైవసం చేఐసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా ఖమ్మం నగరాన్ని మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఖమ్మం కలెక్టర్ కర్ణన్, కేఎంసీ కమిషనర్ అనురాగ్ జయంతి, మాజీ కార్పొరేటర్లు కూరాకుల వలరాజు, నాగండ్ల కోటి, ఆత్కూరి హనుమాన్, నాయకులు దేవభక్తుని కిశోర్బాబు, వాంకుడోతు సురేశ్, బోడా శ్రావణ్కుమార్, ఏలూరి శ్రీనివాసరావు, పంతంగి వెంకటేశ్వర్లు, దండా జ్యోతిరెడ్డి, చిలకల వెంకటనర్సయ్య, పొదిల పాపారావు, దొంగల తిరుపతిరావు, అర్బన్ తహసీల్దార్ శైలజ పాల్గొన్నారు.