మెప్మా ఆర్పీల విన్నపానికి స్పందించిన మంత్రి కేటీఆర్
బ్యాంకు ఖాతాలో 12 నెలల వేతనాలు జమ
హర్షం వ్యక్తం చేస్తున్న సిబ్బంది..
కొత్తగూడెం అర్బన్, డిసెంబర్ 12: పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో పనిచేస్తున్న రిసోర్స్ పర్సన్లు (ఆర్పీలు) ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తున్నారు. 28,008 నుంచి స్వయం సహాయక సంఘాల సభ్యులను సమన్వయం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం తీసుకుంటూ ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తున్నారు. వారి సమస్యలను ఇటీవల మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. పెండింగ్లో ఉన్న 12 నెలల వేతనాలు విడుదల చేయాలని కోరారు. సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించారు. వెంటనే వేతనాలను వెంటనే విడుదల చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. నెలకు ఒక్కో ఆర్పీకి గౌరవ వేతనం రూ.4 వేలు కాగా జిల్లాలో 127 మందికి 12 నెలలకు రూ.60 లక్షలు విడుదల చేసింది. ఆర్పీల ఖాతాల్లో వేతనాలు జమ చేయించడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
127 మంది ఆర్పీల సేవలు ఇలా..
జిల్లాలో మొత్తం 127 మంది ఆర్పీలు ఉండగా కొత్తగూడెం మున్సిపాలిటీలో 41 మంది, పాల్వంచలో 44 మంది, ఇల్లెందు 24 మంది, మణుగూరులో 18 మంది ఆర్పీలు ఉన్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీ ఆర్పీలు 1,298 స్వయం సహాయక సంఘాల పరిధిలోని 12,825 మందిని సమన్వయం చేస్తున్నారు. పాల్వంచలో 44 మంది ఆర్పీలు ఉండగా 1,398 గ్రూపుల పరిధిలోని 13,982 మంది, ఇల్లెందులో 24 మంది ఆర్పీలు ఉండగా 753 గ్రూపుల పరిధిలోని 7,704 మంది, మణుగూరులో 18 మంది ఆర్పీలు 724గ్రూపుల పరిధిలోని 6,903 మంది సభ్యులను సమన్వయం చేస్తున్నారు. వారి ఆర్థికాభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. బ్యాంక్ లింకేజీ, రుణ చెల్లింపులు, రికార్డుల నమోదు, నివేదికల తయారీలో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. పట్టణాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తున్నారు.
వ్యాక్సినేషన్లోనూ కీలకపాత్ర..
తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆర్పీలు సమగ్ర కుటుంబ సర్వే, జనాభా లేక్కల సర్వే, స్వచ్ఛ భారత్, హరితహారం, బడి బయట పిల్లల గణన, వారిని బడిలో చేర్పించే సర్వే, బతుకమ్మ చీరెల పంపిణీ, పల్స్ పోలియో, సదరం క్యాంపు..ఇలా ఎన్నో రకాల సర్వేలు చేపట్టారు. ప్రభుత్వ ఫలాలను ప్రజలకు చేరువ చేశారు. కరోనా విజృంభించిన సమయంలో మెప్మా ఆర్పీలు ప్రజలకు అండగా నిలిచారు. వైరస్ వ్యాప్తిపై ఇతర ప్రభుత్వ సిబ్బందితో కలిసి పనిచేశారు. వైద్యసిబ్బందితో కలిసి కరోనా బాధితులకు మెడికల్ కిట్లు అందించారు. కొవిడ్ వ్యాక్సినేషన్లోనూ కీలకంగా వ్యవహరించారు. వ్యాక్సిన్ తీసుకోని వారిని గుర్తించి టీకా తీసుకునేలా పనిచేశారు. రెండు డోసులు తీసుకున్న వారి ఇంటికి వెళ్లి గోడలకు స్టిక్కర్లు అంటించారు.
ప్రభుత్వానికి కృతజ్ఞతలు..
నేను పదేళ్లుగా స్వయం సహాయక సంఘంలో ఆర్పీగా పని చేస్తున్నా. ఉమ్మడి పాలనలో అప్పటి ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు వేతనాలు పెంచాలని కోరాం. కానీ పట్టించుకోలేదు. తెలంగాణ ఏర్పడ్డాక మా సమస్యలను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లాం. మా వినతిని ప్రభుత్వం గుర్తించింది. సమస్యలను అర్థం చేసుకున్న ప్రభుత్వం పెండింగ్ వేతనాలు విడుదల చేసింది. 12 నెలల వేతనాలు ఒకేసారి అందించింది.
-ఎస్.తిరుపతి , ఆర్పీ అసోసియేషన్ అధ్యక్షురాలు, కొత్తగూడెం