కొత్తగూడెం క్రైం, జనవరి 1 : సినీ ఫక్కీలో గంజాయిని బీరువాలో అమర్చి తరలిస్తున్న వాహనాన్ని టేకులపల్లి పోలీసులు గుర్తించి పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ గంగన్న తెలిపారు. కొత్తగూడెంలోని తన కార్యాలయ ఆవరణలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్లుగా టేకులపల్లి పోలీసులకు గత నెల 28న విశ్వసనీయ సమాచారం వచ్చింది. దీంతో ఇల్లెందు డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో టేకులపల్లి సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్సై రమణారెడ్డి ఆ ప్రాంతంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అటువైపుగా ఇనుప బీరువాల లోడుతో వస్తున్న కర్ణాటక రాష్ట్రం బీదర్కు చెందిన ట్రక్కు డ్రైవర్ పోలీసుల తనిఖీలను గమనించి టేకులపల్లి పెట్రోల్ బంకు వెనుక వాహనాన్ని నిలిపివేసి పారిపోయాడు. అక్కడ ఓ వాహనం రెండు రోజులుగా ఆనుమానాస్పదంగా ఉన్నదని సోమవారం ఉదయం పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు.
దీంతో పోలీసులు వాహనాన్ని స్వాధీనపరుచుకొని పరిశీలించారు. అయితే బీరువాలు బరువు ఎక్కువగా ఉండడంతో వాటిని నిశితంగా పరిశీలించారు. ఈ నేపథ్యంలో పోలీసులను ఆశ్చర్యానికి గురి చేసే ఘటన ఎదురైంది. ఏకంగా గంజాయి ప్యాకెట్లను బీరువాల వెనుక భాగం లోపల అమర్చి వాటిని తయారు చేశారు. బీరువాలను కట్ చేసి అందులో ఉన్న రూ.30 లక్షల విలువ చేసే 120 కేజీల గంజాయితోపాటు వాహనాన్ని పోలీసులు స్టేషన్కి తరలించి సీజ్ చేశారు. కేసు విచారణలో భాగంగా ఆ వాహనం కర్ణాటక రాష్ట్రం బీదర్కు చెందిన మహ్మద్ షకీల్ పాషా వద్ద నుంచి అతనికి తెలిసిన మజార్ అనే డ్రైవర్ కిరాయికి తీసుకెళ్లినట్లు ఎస్పీ వివరించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడు మజార్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఇకపై ఎవరైనా గంజాయి రవాణా చేస్తున్నట్లుపోలీసులకు సమాచారం ఇస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. సమావేశంలో ఇల్లెందు డీఎస్పీ కేవీ రమణమూర్తి, టేకులపల్లి సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్సై గన్రెడ్డి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.