చండ్రుగొండ/ దమ్మపేట, జూలై 15: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద మొత్తం రూ.12.6 కోట్ల నిధులు ములకలపల్లి మండలానికి అందినట్లు అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తెలిపారు. పేద కుటుంబాల్లోని యువతుల వివాహాల కోసం ఇంత పెద్ద మొత్తంలో సాయం అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని స్పష్టం చేశారు. ములకలపల్లి మండలంలో శనివారం పర్యటించిన ఆయన.. మండలం కేంద్రంలోని రైతువేదిక ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. ఆడపిల్లల వివాహాలు చేసే పేద కుటుంబాలకు కల్యాణలక్ష్మి పథకం వరం లాంటదని అన్నారు. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే గిరిజనులకు పెద్ద మొత్తంలో పోడు భూములకు హక్కు పత్రాలు అందాయని గుర్తుచేశారు.
దమ్మపేటలో..
దమ్మపేట మండలంలో 44 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.44.51 లక్షల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పంపిణీ చేశారు. మండలం కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు స్వామి, నాగేశ్వరరావు, మల్లికార్జున, ప్రసాద్, రమేశ్, చిన్నవెంకటేశ్వర్లు, యుగంధర్, దుర్గ, రూప్సింగ్, బుజ్జి, రమేశ్, చిట్టిబాబు, వాసు, శ్రీనివాస్ పాల్గొన్నారు.