తెలంగాణ మీదుగా పొరుగు రాష్ర్టాల నుంచి సరఫరా
సత్తుపల్లిలో 566 కిలోల గంజాయి స్వాధీనం
సరుకు విలువ రూ.1.42 కోట్లు, లారీని సీజ్ చేశాం
ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నాం: సీపీ
సత్తుపల్లి, నవంబర్ 11: ఏపీలోని విశాఖపట్నం నుంచి మహారాష్ట్రకు రవాణా అవుతున్న రూ.1.43 కోట్ల విలువైన 566 కిలోల గంజాయిని సత్తుపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ విష్ణు ఎస్ వారియర్ తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్లో గురువారం విలేకరుల సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన యోగేశ్ లింబాజీ, ఇర్ఫాన్ సదార్ పటాన్, గణేశ్ భూపాల్ కలిసి ఏపీలోని విశాఖపట్నం నుంచి ట్రాలీ లారీలో మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్నారు. సత్తుపల్లిలో పోలీసులు వాహన తనిఖీల్లో భాగంగా ఈ లారీపై అనుమానంతో తనిఖీ చేశారు. లారీ అడుగున ప్రత్యేకంగా తయారు చేసిన క్యాబిన్లో గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో యోగేశ్ లింబాజీ, ఇర్ఫాన్ సదార్ పటాన్లను అదుపులోకి తీసుకున్నారు. గణేశ్ భూపాల్ పరారయ్యాడు. లారీని స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గంజాయి అమ్మకాలు పూర్తిగా నిషేధమని, కానీ పొరుగు రాష్ర్టాల నుంచి తెలంగాణ మీదుగా రవాణా అవుతోందని అన్నారు. అయినప్పటికీ పోలీసు నిఘాను పటిష్టంగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పెద్దమొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకునేందుకు సహకరించిన కల్లూరు ఏసీపీ వెంకటేశ్, సీఐ రమాకాంత్, ఎస్సై రామూనాయక్, కానిస్టేబుళ్లు లక్ష్మణ్, రామకృష్ణ, గోపాల్ తదితరులను సీపీ అభినందించి రివార్డులను ప్రకటించారు.