కొత్తగూడెం ఎడ్యుకేషన్, మార్చి 17: భద్రాద్రి జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 73 పరీక్షా కేంద్రాల్లో సోమవారం నుంచి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. మొత్తం 12,341 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. 73 చీఫ్ సూపరింటెండెంట్లు, 73 డిపార్ట్మెంటల్ అధికారులు, 720 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహించనున్నారు.
ప్రతిరోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. కేంద్రాల సమీపంలోని జిరాక్సు షాపులు, కంప్యూటర్ సెంటర్లు మూసే ఉంటాయి. ఇతర వివరాలకు ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ మాధవరావును 99890 27943లో సంప్రదించాలని డీఈవో వెంకటేశ్వరచారి సూచించారు.
ఖమ్మం ఎడ్యుకేషన్, మార్చి 17: ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 97 పరీక్షా కేంద్రాల్లో సోమవారం నుంచి 16,577 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. విద్యాశాఖ జిల్లాను 53 జోన్లుగా విభజించింది. 97 సిట్టింగ్ స్కాడ్స్ బృందాలు, ఆరు ఫ్లయింగ్ స్కాడ్స్ బృందాలు పరీక్షలను పర్యవేక్షించనున్నాయి. 1,983 మంది ఇన్విజిలేటర్లు పరీక్షల విధులు నిర్వర్తించనున్నారు.
కొత్తగూడెం క్రైం, మార్చి 17: పదోతరగతి పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఉంటుందని పేర్కొన్నారు.
పదోతరగతి విద్యార్థులకు భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆల ఆదివారం ఓ ప్రకటనలో ‘ఆల్ ది బెస్ట్’ చెప్పారు. ఒత్తిడికి గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు వీలుగా అదనపు బస్సులు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల అనుమతి ఉండదన్నారు.
విద్యార్థులు ఒత్తిడికి గురికావొద్దని డీఈవో వెంకటేశ్వరచారి సూచించారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఫీజుల పేరుతో విద్యార్థుల హాల్ టిక్కెట్లను ఆపాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సీసీ కెమెరాల నిఘా మధ్య పరీక్షలు జరుగుతాయన్నారు.