ఖమ్మం అర్బన్, మార్చి 14 : ఖమ్మం జిల్లాలోని 98 కేంద్రాల్లో పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. తొలిరోజు తమ ఇష్టదైవాలకు పూజలు చేయడంతోపాటు హాల్ టికెట్లతో ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేసి, గంట ముందుగానే కేంద్రాలకు చేరుకున్నారు. తెలుగు పరీక్షకు మొత్తం 16,962 మంది విద్యార్థులకు.. 16,941 మంది హాజరయ్యారని, 21 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని, మొత్తం హాజరు 99.88 శాతం నమోదైనట్లు డీఈవో చైతన్య జైని తెలిపారు.
పదో తరగతి పరీక్ష కేంద్రాలను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తనిఖీ చేశారు. నగరంలోని రాజేంద్రనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మాంట్ఫోర్ట్ స్కూల్లో పరీక్ష తీరును, నిర్వహణ, హాల్టికెట్ల పరిశీలన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రతీ విద్యార్ధిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే కేంద్రం లోపలికి అనుమతించాలని సూచించారు.
ఉమ్మడి జిల్లా అబ్జర్వర్ నాంపల్లి రాజేశ్.. మంచుకొండ, కారేపల్లి, కామేపల్లి, మోడల్ స్కూల్ కేంద్రాలను తనిఖీ చేశారు. డీఈవో చైతన్య జైని.. కొణిజర్ల జడ్పీహెచ్ఎస్, ఎన్నెస్సీ కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల కేంద్రాలను తనిఖీ చేశారు. తొలి పరీక్ష కావడంతో విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు కేంద్రాల వద్దకు చేరుకుని పరీక్ష కేంద్రంలోకి వెళ్లే వరకు అక్కడే వేచి ఉన్నారు. దీంతో పరీక్ష కేంద్రాల వద్ద సందడి నెలకొంది.

కొణిజర్ల జడ్పీహెచ్ఎస్ పరీక్ష కేంద్రాన్ని డీఈవో సందర్శించిన సమయంలో అక్కడి అధికారులు, సిబ్బంది నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు గుర్తించారు. దీనికి బాధ్యులైన చీఫ్ సూపరింటెండెంట్(సీఎస్), డిపార్ట్మెంటల్ ఆఫీసర్(డీవో), ఇన్విజిలేటర్లను వెంటనే విధుల నుంచి తొలగించారు. వీరిపై శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు డీఈవో తెలిపారు. ఆ కేంద్రంలోని సిట్టింగ్ స్కాడ్ను విధుల నుంచి తొలగించినట్లు డీఈవో పేర్కొన్నారు.
పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తును అడిషనల్ డీసీపీ(లా అండ్ ఆర్డర్) ప్రసాదరావు పరిశీలించారు. శాంతినగర్, మాంట్ఫోర్ట్, రాజేంద్రనగర్, నయాబజార్ కేంద్రాలను ఆయన సందర్శించారు. అలాగే పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్-2 కేంద్రాలు, ఫ్లయింగ్ స్కాడ్స్-35 కేంద్రాలను తనిఖీ చేశారు.
కొత్తగూడెం గణేష్టెంపుల్/ పాల్వంచ, మార్చి 14 : భద్రాద్రి జిల్లాలో పదో తరగతి పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. మొత్తం 73 కేంద్రాల్లో 12,740 మంది రెగ్యులర్ విద్యార్థులకు.. 12,701 మంది హాజరు కాగా.. 39 మంది గైర్హాజరయ్యారని విద్యాశాఖ అధికారులు తెలిపారు. 20 మంది ప్రైవేట్ విద్యార్థులకు 14 మంది హాజరుకాగా.. ఆరుగురు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.
అలాగే పాల్వంచ జడ్పీ ఉన్నత పాఠశాల, జడ్పీ ఉన్నత బాలికల అభ్యుదయ పరీక్ష కేంద్రాలను కలెక్టర్ అంకిత్ సందర్శించారు. విద్యార్థులు పరీక్ష రాస్తున్న తీరును గమనించారు. ఆయా కేంద్రాల్లో విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలు, సీసీ కెమెరాలు, తాగునీటి వసతి, ఫర్నిచర్ తదితర ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.