బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలి
బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా ఆందోళనలు
నేటి నుంచి మూడు రోజుల సమ్మె
విజయవంతం చేయాలని కార్మిక సంఘాల పిలుపు
కొత్తగూడెం సింగరేణి, డిసెంబర్ 8 : నాలుగు బొగ్గు గనుల వేలం, ప్రైవేటీకరణను ఐక్య పోరాటాలతోనే అడ్డుకుంటామని సింగరేణి కార్మిక సంఘాల నాయకులు స్పష్టం చేశారు. కేంద్రం మెడలు వంచైనా గనులను కాపాడుకుంటామని ముక్తకంఠంతో పేర్కొన్నారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బుధవారం ఆయా చోట్ల కార్మిక సంఘాల నాయకులు సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం తెచ్చిన బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణతో పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకమవుతుందన్నారు. కార్మిక సంఘాలన్నీ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. వివిధ పార్టీలు, కార్మిక సంఘాలు సంస్థ పరిరక్షణకు, కార్మికుల హక్కుల సాధనకు పోరాటాలకు దిగాయన్నారు. నేటి నుంచి మూడురోజుల పాటు నిర్వహించ తలపెట్టిన సమ్మెను కార్మికులు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
కేంద్ర ప్రభుత్వం సింగరేణికి సంబంధించిన నాలుగు బొగ్గు బ్లాకులను ప్రైవేటుపరం చేయడాన్ని నిరసిస్తూ టీబీజీకేఎస్, జాతీయ కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి సమ్మెకు పిలుపునిచ్చాయి. గురు, శుక్ర, శనివారాలు మూడ్రోజులపాటు సంస్థ వ్యాప్తంగా ఉన్న అన్ని బొగ్గు గనులు, ఓసీలు, డిపార్ట్మెంట్లలో ఉద్యోగులు, కార్మికులు, అధికారులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ వైండింగ్ పేరుతో దేశవ్యాప్తంగా 88 బొగ్గు బ్లాకులను ప్రైవేటుపరం చేసేందుకు బహిరంగ వేలం నిర్వహించాలని చర్యలు తీసుకుంటున్నది. అందులో సింగరేణి సంస్థకు చెందిన మంచిర్యాల జిల్లాలోని మందమర్రి ఏరియా కేకే 6 బ్లాక్, శ్రావణ్పల్లి మైన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు ఏరియా కోయగూడెం ఓసీపీ 3 బ్లాక్, ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం ఏరియా సత్తుపల్లి జేవీఆర్వోసీ 3 బ్లాక్లను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు టెండర్లకు ఆహ్వానించింది. సింగరేణి సంస్థకు చెందిన నాలుగు బొగ్గు బ్లాకులను బహిరంగ వేలం నుంచి మినహాయించి సంస్థకు అప్పగించాలని జాతీయ కార్మిక సంఘాలు, కార్మికులు కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి నిరసన రూపంలో తెలియజేసేందుకు అందరూ పూనుకున్నారు. సమ్మెలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణపై కేంద్రం కుట్ర
తెలంగాణ రాష్ర్టానికి గుండెకాయ అయిన సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసి కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేసేందుకు కేంద్రం పూనుకుందని టీబీజీకేఎస్తోపాటు జాతీయ కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. అందుకు ఉదాహరణే నాలుగు బొగ్గు బ్లాకులను బహిరంగ వేలం వేయాలని నిర్ణయించడం. కేంద్ర ప్రభుత్వం టెండర్లకు ఆహ్వానించిన నాలుగు బొగ్గు బ్లాకుల్లో సీఎం కేసీఆర్ ప్రారంభించిన మైన్ ఉండటం గమనార్హం. 2018 ఫిబ్రవరి 28వ తేదీన శ్రీరాంపూర్ ఏరియాలో సింగరేణి కార్మికులు, గుర్తింపు సంఘంతో జరిగిన ఆత్మీయ సమ్మేళనం కంటే ముందుగా సీఎం కేసీఆర్ ఆన్లైన్ పద్ధతిలో ఐదు బొగ్గు గనులను ప్రారంభించారు. వీటిలో కేకే బ్లాక్ 6తోపాటు భూపాలపల్లిలోని కేటీకే 3, శాంతిఖని, కేటీకే 5, రాంపురం మైన్లు ఉన్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు ప్రకటించే నాలుగు బొగ్గు బ్లాకుల్లో సీఎం కేసీఆర్ ప్రారంభించిన కేటీకే 6 బ్లాక్ కూడా ఉంది. దీన్ని బట్టి చూస్తే తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నది బహిరంగంగానే తెలుస్తోంది.
గనులు ప్రైవేటుపరమైతే..
కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ మైనింగ్ పేరుతో ప్రవేశపెట్టిన బొగ్గుబ్లాకుల ప్రైవేటీకరణ పద్ధతిని కొనసాగిస్తే సింగరేణి పరిస్థితి అగమ్యగోచరంగా మారనున్నది. ప్రస్తుతం సింగరేణిలో 43 వేల మంది కార్మికులు, 25వేల మంది కాంట్రాక్టు కార్మికులు ఆధారపడి జీవిస్తున్నారు. భవిష్యత్తులో సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఉండవు. కార్మికులు, అధికారుల పరిస్థితి ప్రస్తుతం ఓబీ కాంట్రాక్టు కార్మికుల వలె దిగజారిపోయే ప్రమాదం ఉంటుందని కార్మికసంఘాలు చర్చించుకుంటున్నాయి.