యాసంగిలో వరికి బదులు ఆరుతడి పంటగా సాగు
ఆసక్తి చూపుతున్న సత్తుపల్లి మండల రైతులు
జీరో టిల్లేజ్ పద్ధతిలో ఖర్చు ఆదా
సత్తుపల్లి రూరల్, డిసెంబర్ 8 ;సత్తుపల్లి మండలంలోని రైతులు మొక్కజొన్న సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. వరి కోతలు పూర్తికావస్తుండడంతో పెద్దఎత్తున ఆరుతడి పంటగా మొక్కజొన్నను సాగు చేసేందుకు దృష్టి సారించారు. ఇప్పటికే కొత్తూరు, సిద్ధారంతోపాటు మరికొన్ని గ్రామాల్లో సుమారు 50ఎకరాలకు పైగా జీరో టిల్లేజ్ (దున్నకుండానే విత్తనాలు నాటడం) పద్ధతిలో మొక్కజొన్న వేశారు. రేజర్ల గ్రామానికి చెందిన యువరైతు సత్యనారాయణరెడ్డి తనకున్న పదెకరాల్లో మొక్కజొన్న సాగును చేపట్టి ఆదర్శంగా నిలుస్తున్నారు.
వానకాలంలో రైతులు వరి సాగు చేసి అధిక దిగుబడులు సాధించారు. ఈ క్రమంలోనే మళ్లీ యాసంగిలో కూడా వరి సాగు చేద్దామనుకున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయబోమని చెప్పడంతో ఒక్కసారిగా కంగుతిన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు అన్నివిధాలా ప్రోత్సాహం అందిస్తుంటే.. కేంద్రం మాత్రం నడ్డి విరిసేందుకు చూస్తోందని గమనించిన రైతులు సీఎం కేసీఆర్ పిలుపుమేరకు ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపారు. ఈ యాసంగిలో మొక్కజొన్న వేసేందుకు సిద్ధమయ్యారు.
అనువైన కాలం..
నవంబర్ 15 నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు మొక్కజొన్న సాగుకు అనువైన కాలం. జీరో టిల్లేజ్ పద్ధతిలో ఎకరానికి 8 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. వరి కోసిన వెంటనే దుబ్బుల్లో తేమగా ఉన్నప్పుడు తాడు సహాయంతో సాళ్ల మాదిరిగా 60×20 సెంటీమీటర్ల మధ్యన విత్తుకోవాలి. మూడు నెలల కాలవ్యవధిలో పంట చేతికి వస్తుంది. ఎకరానికి 30 నుంచి 40 క్వింటాళ్ల వరకు దిగుబడి సాధించవచ్చు. ఈ సాగు ద్వారా రైతులకు దుక్కి, భూమి చదును చేసే ఖర్చు ఆదాతోపాటు 15రోజుల ముందుగానే పంట చేతికివస్తుంది. వ్యవసాయశాఖ సూచన మేరకు 20, 40, 60 రోజుల వ్యవధిలో భాస్వరం, పొటాష్ ఎరువులను వేయాల్సి ఉంటుంది.
జీరో టిల్లేజ్ పద్ధతిలో..
జీరో టిల్లేజ్ పద్ధతిలో విత్తనాలు నాటడం ద్వారా రైతులకు దుక్కి, భూమి చదును ఖర్చు ఆదా అవుతుంది. ప్రస్తుతం డీజిల్ ధర పెరగడంతో ఎకరా దుక్కికి 6 నుంచి రూ.7 వేల వరకు ఆదా కావడమే కాకుండా పంటకాలం కూడా పదిరోజులు తగ్గుతుంది. దీంతోపాటు దిగుబడి సైతం ఎకరానికి 30 నుంచి 40 క్వింటాళ్ల వరకు వస్తుంది. వరికోతలు కోసిన వెంటనే కొద్దిగా తేమశాతం అందించి విత్తనాలు సాగు చేసుకోవడం వల్ల రైతులు మామూలు పంట మాదిరిగానే దిగుబడులు సాధించవచ్చు.
సీఎం కేసీఆర్ పిలుపు మేరకు…
కేంద్ర ప్రభుత్వం యాసంగి పంటను కొనుగోలు చేయమని కరాకండీగా చెప్పి రైతుల నడ్డివిరిచింది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు ఆరుతడి పంట వేయాలని నిర్ణయించా. నాకున్న పదెకరాల్లో దుక్కి దున్నకుండానే జీరో టిల్లేజ్ పద్ధతిలో మొక్కజొన్నను సాగుచేశా.