18 – 59 ఏళ్లలోపు కార్మికులకు ‘ఈ – శ్రమ్’
మరణించినా, వైకల్యం పొందినా పరిహారం
విస్తృతంగా ప్రచారం చేస్తున్న కార్మిక శాఖ
భద్రాద్రి జిల్లాలో 23 వేల మంది నమోదు
కొత్తగూడెం అర్బన్, డిసెంబర్ 8: అసంఘటిత రంగ కార్మికుల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. కార్మికశాఖలో పేరు నమోదు చేసుకొని గుర్తింపుకార్డు పొందినవారు దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదానికి గురైతే వారికి ఎక్స్గ్రేషియాతోపాటు వారి కుటుంబాలకు ఊరట నిచ్చే పథకాలను సకాలంలో వర్తింపజేసి అందిస్తోంది. కరోనా మహమ్మారి ఇటీవల అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఇందులో అసంఘటితరంగ కార్మికులు కోలుకోలేని దెబ్బతిన్నారు. దీంతో ప్రభుత్వం వీరికి అదనంగా లబ్ధి చేకూర్చాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ‘ఈ – శ్రమ్’ను తీసుకొచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ పథకంపై విస్తృతంగా ప్రచారం నిర్వహించి అసంఘటిత రంగ కార్మికుల పేర్లను నమోదు చేయించాలని కార్మికశాఖకు సూచించింది.
ఎవరు అర్హులంటే..
‘ఈ -శ్రమ్’లో చేరేందుకు 18 59 ఏళ్ల మధ్య ఉన్న అసంఘటితరంగ కార్మికులు అర్హులు. వ్యవసాయ, అనుబంధ ఉపాధి పనివారు, చిన్నకారు, సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, నర్సరీల్లో పనిచేసేవారు, భవన, అనుబంధ రంగాల్లో పనిచేసేవారు, టైలరింగ్ పనిపై ఆధారపడేవారు, ఆటోమొబైల్, రవాణారంగం, చేతివృత్తుల వారు (చేనేత, కమ్మరి, స్వర్ణకారులు, కుమ్మరి, క్షౌరవృత్తి, బ్యూటీపార్లర్, చర్మకారులు, రజకులు), స్వయం ఉపాధి (వీధి వ్యాపారులు, తోపుడుబండి వ్యాపారులు, ఇంటి వద్ద వస్తువుల తయారీ, చిరు వ్యాపారులు, కల్లుగీత కార్మికులు, కళాకారులు, రిక్షా, బీడీ కార్మికులు, పారిశుధ్య కార్మికులు), సేవా రంగంలో పనిచేసేవారు, ప్రభుత్వ పథకాలను అమలు చేసే పనివారు (ఈజీఎస్ కార్మికులు, ఆశావర్కర్లు, ఎస్హెచ్జీ వర్కర్లు, అంగన్వాడీలు, మధ్యాహ్న భోజన వర్కర్లు, విద్యావలంటీర్లు, గ్రామ, వార్డు వలంటీర్లు), దుకాణాల్లో పనిచేసేవారు అర్హులు.
ప్రయోజనాలు ఇలా..
‘ఈ-శ్రమ్’ పోర్టల్లో పేర్లను నమోదు చేసుకుంటే 12 అంకెలున్న గుర్తింపుకార్డు మంజూరవుతుంది. ఈ కార్డు దేశవ్యాప్తంగా చెల్లుబాటవుతుంది. ఏడాదిపాటు ప్రమాద బీమా వరిస్తుంది. ప్రమాదం జరిగి మరణించినా, శాశ్వత వైకల్యం వచ్చినా రూ.2 లక్షలు పరిహారం అందుతుంది. పాక్షిక వైకల్యం సంభవిస్తే రూ.లక్ష బీమా మొత్తాన్ని బాధిత కుటుంబానికి అందిస్తారు. విపత్తులు, విపత్కర పరిస్థితులు సంభవిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం అందించేందుకు ఇది ఉపయోగపడుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసంఘటిత రంగ కార్మికులకు చేకూర్చే లబ్ధితోపాటు కేంద్రం ‘ఈ -శ్రమ్’తో అదనపు ప్రయోజనాలు యథాతథంగా వర్తిస్తాయి.
భద్రాద్రి జిల్లాలో 23 వేల మంది..
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా అసంఘటిత రంగంలో సుమారు 77,400 మంది పని చేస్తున్నట్లు కార్మికశాఖ లెక్కలు చెబుతున్నాయి. కార్మికశాఖ వద్ద గుర్తింపుకార్డు పొందని వారు, అసంఘటిత రంగ పరిధిలోకి వచ్చే వారు ఇంకా 3 లక్షల మంది దాకా ఉండే అవకాశముంది. ప్రస్తుతం ఈ పోర్టల్లో 23 వేల మంది మాత్రమే ఆన్లైన్ చేసుకొని గుర్తింపుకార్డు పొందినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ పథకంపై ఇప్పటికే నెలరోజులుగా కార్మికశాఖ, కామన్ సర్వీస్ సెంటర్లు (సీఎస్సీ) ఆధ్వర్యంలో అధికారులు విస్తృతంగా ప్రచారం చేసి అవగాహన కల్పిస్తున్నారు. www.eshram.gov.in అనే వెబ్సైట్లో లాగిన్ అయి వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.