రెండు పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్
భద్రాద్రి జిల్లాలో 305 మందికి ఓటుహక్కు
ఎన్నికల పరిశీలకుడు సుదర్శన్రెడ్డి,కలెక్టర్ అనుదీప్
సెక్టోరియల్ అధికారులుగా భద్రాచలం సబ్కలెక్టర్, కొత్తగూడెం ఆర్డీవో
భద్రాచలం,కొత్తగూడెంలో కేంద్రాల సందర్శన
భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, డిసెంబర్ 8: ఈ నెల 10న నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 305 మంది అభ్యర్థులు ఓటు హక్కు నియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లూ చేసినట్లు మండలి ఎన్నికల పరిశీలకుడు సుదర్శన్రెడ్డి, భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ తెలిపారు. కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని బుధవారం వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో 9 మంది జడ్పీటీసీలు, 75 మంది ఎంపీటీసీలు ఓటు హక్కును వినియోగించుకోనున్నారని, కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో 60 మంది కౌన్సిలర్లు, 14 మంది జెడ్పీటీసీలు, 145 మంది ఎంపీటీసీలు, ఇద్దరు ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారని వివరించారు. ఓటింగ్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు వెబ్ కాస్టింగ్ చేయనున్నట్లు చెప్పారు. సెక్టోరల్ అధికారులుగా భద్రాచలం సబ్ కలెక్టర్, కొత్తగూడెం ఆర్డీవో వ్యవహరిస్తారన్నారు. పోలింగ్ కేంద్రానికి వంద మీటర్లు దూరం వరకూ బార్కేడ్లు ఏర్పాటు చేయాలని, ఓటర్లను తప్ప ఎవరినీ అనుమతించవద్దని చెప్పారు. శుక్రవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ ప్రక్రియ ఉంటుందన్నారు. కౌన్సిలర్లు జడ్పీటీసీలు, ఎంపీటీసీలను గుర్తించడానికి వీలుగా మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలకు విధులు కేటాయించినట్లు చెప్పారు. అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డీవో స్వర్ణలత, డీఆర్వో అశోక్చక్రవర్తి, జడ్పీ సీఈవో విద్యాలత, ఎన్నికల విభాగపు పర్యవేక్షకుడు రాజు, తహసీల్దార్లు రామకృష్ణ, కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
పోలింగ్ కేంద్రం పరిశీలన
భద్రాచలం, డిసెంబర్ 8: శుక్రవారం జరుగనున్న ఖమ్మం ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి భద్రాచలం, పినపాక నియోజకవర్గాల ప్రజాప్రతినిధులకు భద్రాచలంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు సుదర్శన్రెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్, అదనపు కలెక్టర్లకు పలు సూచనలు సలహాలు అందజేశారు. ఎన్నికలు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అభ్యర్థులతో సమావేశం
మామిళ్లగూడెం, డిసెంబర్ 8: జాతీయ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఎమ్మెల్సీ ఎన్నిక ప్రక్రియ సజావుగా జరిగేలా సహకరించాలని ఖమ్మం కలెక్టర్, ఎన్నికల అధికారి వీపీ గౌతమ్, సీపీ విష్ణు వారియర్ కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులతో ఖమ్మం కలెక్టరేట్లో బుధవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో వారు మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని, ఈ నెల 9నే పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది చేరుకుంటారని అన్నారు. 10న జరిగే ఎన్నికల ప్రక్రియకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకున్నామన్నారు. ఖమ్మంలోని డీపీఆర్సీ భవనంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రి పంపిణీతోపాటు కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. అదనపు కలెక్టర్, అభ్యర్థులు పాల్గొన్నారు.