భద్రాద్రి జిల్లాలో ఆరు యార్డులు
రైతులకు పారదర్శకంగా సేవలు
సెస్ ద్వారా ప్రభుత్వానికి రూ.కోట్ల ఆదాయం
త్వరలో కొత్తగూడెం, పాల్వంచలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ఆరుగాలం కష్టించి సాగు చేసే అన్నదాతకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. పంట పెట్టుబడి కష్టాల నుంచి గట్టెక్కించేందుకు ‘రైతు బంధు’ పథకంతో భరోసా కల్పిస్తున్నది. ఎరువులు, విత్తనాల కొరత లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టింది. ధాన్యం, ఇతర పంట ఉత్పత్తుల కొనుగోళ్లలో దళారుల దందాకు చెక్ పెడుతూ మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. భద్రాద్రి జిల్లాలో ఆరు మార్కెట్ యార్డులు రైతులకు అందుబాటులో ఉన్నాయి. ఈ యార్డుల ద్వారా రైతులకు పారదర్శకంగా సేవలు అందుతున్నాయి. పంటకు మద్దత ధర లభిస్తున్నది. అంతేకాదు, ఉద్యాన పంటలు పండించిన రైతుల కోసం మార్కెటింగ్శాఖ సకల సౌకర్యాలతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు నిర్మిస్తున్నది. కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో నిర్మిస్తున్న ఈ మార్కెట్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.
మార్కెట్ యార్డుల ద్వారా రైతులకు పారదర్శకంగా సేవలు అందుతున్నాయి. దళారుల ప్రమేయం లేకుండా, ఎలాంటి మోసాలకు తావు లేకుండా పంటలు కొనుగోలు చేస్తున్నాయి. ఈ యార్డుల ద్వారా ఒకవైపు రైతులకు బహుళ ప్రయోజనాలు చేకూరుతుండగా మరోవైపు ప్రభుత్వానికి రూ.కోట్ల ఆదాయం లభిస్తున్నది. భద్రాద్రి జిల్లాలో ఆరు మార్కెట్ యార్డులు రైతులకు విస్తృత సేవలు అందిస్తున్నాయి. కొత్తగూడెం, భద్రాచలం, ఇల్లెందు, దమ్మపేట, బూర్గంపాడు, చర్ల పరిధిలో మార్కెట్యార్డులు ఉన్నాయి. మార్కెటింగ్శాఖ అధికారులు, కమిటీ సభ్యులు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్రయ విక్రయాలు జరుపుతున్నారు. యార్డుల పరిధిలో పంటల నిల్వకు గోదాములు అందుబాటులో ఉన్నాయి. రానున్న రోజుల్లో యార్డుల్లో మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. యాసంగిలో ధాన్యం కొనుగోళ్లపై ఢిల్లీలోని పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. కేంద్రం ధాన్యం కొనని పక్షంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మార్కెట్ యార్డుల ద్వారానే జరిగే అవకాశాలు ఉన్నాయి. ధాన్యం కొనుగోళ్లలో మళ్లీ పాతరోజులు వస్తాయని రైతులు భావిస్తున్నారు.
రెండో చోట్ల ఇంటిగ్రేటెడ్ రైతుబజార్లు..
అపరాలు, ధాన్యమే కాకుండా ఉద్యాన పంటలు పండించిన రైతుల కోసం మార్కెటింగ్శాఖ రైతుబజార్లను అందుబాటులోకి తెచ్చింది. సకల సౌకర్యాలతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు నిర్మిస్తున్నది. త్వరలో కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో ఈ మార్కెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఆయా మార్కెట్లలో కూరగాయలు, పండ్ల విక్రయాలే కాక చేపలు, రొయ్యలు, చికెన్, మటన్ దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు.
జిల్లాలో 20 చెక్పోస్టులు..
మార్కెట్ యార్డుల పరిధిలో జిల్లాలో 20 చెక్పోస్టులు అందుబాటులోకి వచ్చాయి. పండించిన పంటను రైతులు ఎక్కడ విక్రయించినా మార్కెటింగ్ ఫీజు చెల్లిస్తున్నారు. ఈ చెక్ పోస్టుల ద్వారా పంటలు విక్రయించే వారెవరైనా సెస్ చెల్లించాల్సిందే. ఇటీవల ఇతర రాష్ర్టాల నుంచి అక్రమంగా మన వద్దకు వచ్చే ధాన్యం రవాణాను అడ్డుకోవడానికి భద్రాచలంలో ప్రత్యేక చెక్పోస్ట్ ఏర్పాటైంది. కలెక్టర్ అనుదీప్, ఎస్పీ సునీల్ దత్ ఎప్పటికప్పుడు చెక్పోస్ట్లపై నిఘా వేస్తున్నారు. అధికారులను అప్రమత్తం చేస్తూ అక్రమ రవాణాను అడ్డుకుంటున్నారు.
యార్డుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు..
జిల్లాలోని సరిహద్దు చెక్పోస్ట్ పాటు ఇతర చెక్ పోస్టుల ద్వారా ఏటా మార్కెటింగ్శాఖకు రూ.12 కోట్లు ఆదాయం వస్తుంది. జిల్లాలోని ఆరు మార్కెట్ కమిటీల పరిధిలోని చెక్పోస్టుల వద్ద వసూలవుతున్న సెస్ మంచి ఆదాయ వనరుగా మారింది. ప్రస్తుతం యార్డుల పరిధిలో ఆరు ధాన్యం కొనుగోలు కేంద్రాలూ అందుబాటులోకి వచ్చాయి. మార్కెటింగ్శాఖ నిర్దేశించే లక్ష్యాలను ఏటా మార్కెట్ కమిటీలు ఛేదిస్తున్నాయి.
రైతులకు అనువుగా మార్కెట్ యార్డులు..
బయట ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఉన్నప్పటికీ మార్కెట్ యార్డుల్లో అన్ని సౌకర్యాలు కల్పించాం. మార్కెట్ యార్డులకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. సీసీఐ కూడా యార్డుల్లోనే విక్రయాలు చేపట్టేది. ప్రస్తుతం ఎలాంటి పంటలనైనా కొనుగోలు చేసే వెసులుబాటు మార్కెట్లో ఉంది. యార్డుల పరిధిలో గోదాములూ అందుబాటులో ఉన్నాయి. త్వరలో పాల్వంచ, కొత్తగూడెంలో ఇంటిగ్రేటెడ్ రైతుబజార్లు ఏర్పాటు చేయనున్నాం.