పరిశీలన అనంతరం అర్హులందరికీ హక్కు పత్రాలు
ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, జడ్పీ చైర్మన్ కోరం
ఆళ్లపల్లి, నవంబర్ 8: పోడు భూమి సాగు చేసుకుంటున్న రైతులందరూ పట్టాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, భద్రాద్రి జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య సూచించారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులందరికీ ప్రభుత్వం హక్కు పత్రాలు ఇస్తుందని వివరించారు. ఆళ్లపల్లి మండలంలో సోమవారం పర్యటించిన వారు.. స్థానిక రైతులతో మాట్లాడారు. పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపేందుకు సీఎం కేసీఆర్ పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. అటవీ భూమిపై ఆధారపడి ఉపాధి పొందుతున్న గిరిజనులకు పట్టాలు పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధం చేసిందన్నారు. అందులో భాగంగానే పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. అనంతరం మండలంలో పలు కుటుంబాలను వారు పరామర్శించారు. ఎంపీపీ కోండ్రు మంజుభార్గవి, జడ్పీటీసీ కొమరం హనుమంతరావు, సొసైటీ చైర్మన్ గొగ్గెల రామయ్య, సర్పంచులు కొమరం శంకర్బాబు, నరసింహారావు, పాయం వెంకట నారాయణ, గొగ్గెల ప్రేమకళ, పూనెం నిర్మల, శ్రీదేవి, బాయమ్మ, టీఆర్ఎస్ నాయకులు షేక్ బాబా, కొమరం వెంకటేశ్, వెంకన్న, ఊకే భద్రం, అతహర్ పాల్గొన్నారు.