ప్రమాదాల నివారణకు సింగరేణి చర్యలు
రూ.4.5 లక్షలతో 30 ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు
ప్రయాణికుల కోసం బస్షెల్టర్ నిర్మాణం
హర్షం వ్యక్తం చేస్తున్న, కార్మికులు, పరిసర ప్రభావిత ప్రాంతప్రజలు
రామవరం, అక్టోబర్ 8 : అనునిత్యం ఏదో ప్రమాదం.. ఒకరు విగతజీవిగా మారితే మరొకరు శాశ్వత వైకల్యం బారినపడినవారు క్షతగాత్రులై కోలుకుంటున్న వారికి గుర్తుకు వచ్చేది విజయవాడ-జగదల్పూర్ జాతీయ రహదారి-30. సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని కార్మిక ప్రాంతమైన రుద్రంపూర్, గౌతంపూర్, ధన్బాద్ ప్రాంత ప్రజలు నిత్యం విద్య, వైద్యం, ఇతర అవసరాల కోసం కొత్తగూడెంవైపు వెళ్లాల్సిందే. అవసరాలు తీర్చుకొని తమ గమ్యానికి చేరుకునే క్రమంలో రోజూ ఏదో ఒక ప్రమాదానికి గురయ్యేవారు అనేకమంది. దీనికి కారణం జాతీయ రహదారిపై లైట్లు లేకపోవడమే. ఈ ప్రాంతంలో కార్మికులు, సింగరేణి పరిసర ప్రభావిత ప్రాంతాల్లోని వ్యక్తులు తరచూ ప్రమాదాలకు గురికావడాన్ని కొత్తగూడెం ఏరియా జీఎం గమనించారు. త్రీ ఇైంక్లెన్ రెస్యూ స్టేషన్ నుంచి రుద్రంపూర్ జీఎం ఆఫీసు వరకు జాతీయ రహదారి వెంబడి ఎల్ఈడీ లైట్ల నిర్మాణానికి చర్యలు చేపట్టారు. అంధకారంగా ఉండే జాతీయ రహదారి నేడు వెన్నెల వెలుగులను తలపిస్తున్నది. దీంతో కార్మికులు, ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
బస్ షెల్టర్ నిర్మాణం
రుద్రంపూర్, గౌతంపూర్, ధన్బాద్ ప్రాంత ప్రజలు నిత్యం విజయవాడ, రాజమండ్రి, అమలాపురం తదితర ప్రాంతాలకు వెళ్లివస్తుంటారు. రుద్రంపూర్ ప్రగతి వనంవద్ద ఆంధ్రావైపునకు వెళ్లే బస్సులు రిక్వెస్ట్ స్టాప్ ఉంది. దీంతో బస్సులకోసం కార్మికులు నిరీక్షించేవారు. వర్షాకాలం, చలికాలం, ఎండాకాలం నిల్చునేందుకు నీడలేకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడేవారు. కార్మికులు, వారి కుటుంబసభ్యులు పడుతున్న ఇబ్బందులను కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిండెంట్ ఎండీ రజాక్ ప్రత్యేక చొరవ తీసుకొని విషయాన్ని జీఎం దృష్టికి తీసుకెళ్లారు. సుమారు రూ.5 లక్షలతో బస్షెల్టర్ నిర్మించారు.
లైటింగ్ చాలా బాగుంది..
గతంలో జాతీయ రహదారి చిమ్మ చీకటిగా ఉండేది. దీంతో అనేక ప్రమాదాలు జరిగేవి. కొందరు మృత్యువాత పడేవారు.. మరికొందరు అవయవాలు కోల్పోయారు. ఇప్పటికీ చాలా మంది చికిత్స పొందుతూనే ఉన్నారు. సింగరేణి సంస్థ ఏరియా జీఎంతో చీకటిగా ఉన్న రోడ్డు వెలుగుల మయంగా మారింది. దీనిని జీఎం కార్యాలయం వరకు పొడిగిస్తే బాగుంటుంది. లైటింగ్ వేయించిన అధికారులకు ఏరియా జీఎంకు ధన్యవాదాలు.
అధికారుల సహకారంతోనే..
సంస్థ డైర్టెకర్ ఈ అండ్ఎంగా బాధ్యతలు చేపట్టిన డీ సత్యనారాయణరావు కార్మిక ప్రాంతాల్లో వీధిలైట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. దీంతో కాలనీలో ఇప్పటికే ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేశాం. కొత్తగూడెం ఏరియా జీఎం సీహెచ్ నర్సింహారావు చొరవతో సెక్టార్ వారీగా ఎల్ఈడీ వీధి దీపాలను బిగిస్తున్నాం. జాతీయ రహదారిపై జరుగుతున్న ప్రమాదాలను చూసి 30 వాట్స్ ఎల్ఈడీ ల్యాంప్లను ఏర్పాటుచేశాం. త్వరలోనే జీఎం కార్యాలయం వరకు ఏర్పాటుచేస్తాం. ప్రగతివనం సర్కిల్ వద్ద ఎల్ఈడీ లైట్లతో టవర్ నిర్మాణ పనులు కూడా చేపట్టనున్నాం.
రాత్రి ..పగలును తలపిస్తున్నది..
రాత్రులు ఆ రోడ్డుపై వెళ్లాలంటేనే ఏమవుతుందోననే భయం ఉండేది. చిమ్మ చీకటిగా ఉండడంతో వెళ్లాలంటే దడపుట్టేది. రాత్రి పూట కొత్తగూడెం వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు చాలా ఇబ్బందులు పడేవారు. సింగరేణి ఆఫీసర్లు మంచి పనిచేశారు. ఇప్పుడు ఆ రోడ్డుపై రాత్రికూడా పగలుగానే ఉంది. లైట్లు వేసినంక టక్కర్లు అవుతలేవు. సింగరేణి ఆఫీసర్లు మంచిపనిచేసిన్రు. వాళ్లంతా సల్లంగ ఉండాలి.