నాలుగు జిల్లాలకు ఎఫ్సీఐ గోదాములు రెండే..
కొనుగోలు 3 లక్షల మెట్రిక్ టన్నులు.. నిల్వ సామర్థ్యం 88 వేల టన్నులు
వ్యాగన్ వస్తే తప్ప కదలని లారీలు రోడ్లపైనే లారీ డ్రైవర్లు
ఖమ్మం, డిసెంబర్ 7 : ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం మీనమేషాలు లెక్కిస్తున్నది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లోని బియ్యాన్ని నిల్వ చేసేందుకు ఎఫ్సీఐ ఖమ్మం నగరంలో రెండు గోదాములను ఏర్పాటు చేసింది. ఈ రెండింటి నిల్వ సామర్థ్యం 88 వేల టన్నులు కాగా ఏటా దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్సీఐకి ఇస్తున్నది. బియ్యాన్ని ఈ గోదాముల్లోనే నిల్వ చేయాల్సి ఉన్నది.. దాదాపు 2.12 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఏటా లారీల ద్వారా అన్లోడింగ్ చేయలేక రోడ్లపై నిల్వ ఉంచుతున్నది. ఒక్కసారి వ్యాగన్ వస్తే గోదాము ఖాళీ అవుతుంది. తిరిగి వ్యాగన్ వచ్చే లోపు లారీలోని బియ్యాన్ని దిగుమతి చేయాలి.. దీంతో తక్కువ సమయంలో లక్షలాది బస్తాలు దిగుమతి చేయలేక హమాలీలు ఇబ్బంది పడుతున్నారు.
నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎఫ్సీఐ ధాన్యాన్ని కొనుగోలు చేసే విధానానికి స్వస్తి పలికారు. నూతనంగా డీసీపీ (డీ సెంట్రలైజేషన్ ప్రొక్యూర్మెంట్) విధానానికి తెర తీశారు. ఏ రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వమే రైతుల నుంచి కొనుగోలు చేయాలి. రాష్ట్ర అవసరాలకు పోను మిగిలిన బియ్యాన్ని ఎఫ్సీఐకి పంపాలి. అయితే, వానకాలం పండే రారైస్ (పచ్చి బియ్యం) మాత్రమే తీసుకుంటామని, యాసంగిలో వచ్చే బాయిల్డ్ రైస్ను తీసుకోమని కేంద్రం మెలిక పెట్టింది. దీంతో రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది.
కేంద్రంలోని బీజేపీ తీరుతో భారత ఆహార భద్రత సంస్థ (ఎఫ్సీఐ) రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు బాధ్యత నుంచి చేతులెత్తేసింది. తెలంగాణ ఆవిర్భావానికి ముందు 2013 వరకు రైతు పండించిన ధాన్యం మొత్తాన్ని ఎఫ్సీఐ నేరుగా కొనుగోలు చేసేది. ఆయా జిల్లాలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుకు మద్దతు ధర ఇచ్చి ఎఫ్సీఐనే ధాన్యం కొనుగోలు చేసి మిల్లర్లకు సీఎంఆర్ (కస్టమ్స్ మిల్లింగ్ రైస్) ఇవ్వడంతో వచ్చిన బియ్యాన్ని ప్రజా అవసరాలకు వినియోగించేది. దేశంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎఫ్సీఐ నేరుగా ధాన్యాన్ని కొనుగోలు చేసే విధానానికి స్వస్తి పలికారు. మోదీ ప్రభుత్వం నూతనంగా డీసీపీ (డీ సెంట్రలైజేషన్ ప్రొక్యూర్మెంట్) విధానానికి శ్రీకారం చుట్టింది. డీసీపీ ద్వారా ఏ రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వమే రైతుల నుంచి కొనుగోలు చేసి రాష్ట్ర అవసరాలకు పోను మిగిలిన బియ్యాన్ని ఎఫ్సీఐకి పంపే విధానాన్ని ప్రారంభించారు. దీని ద్వారా వానకాలం పండే రారైస్ (పచ్చి బియ్యం) మాత్రమే తీసుకుంటామని, యాసంగి సీజన్లో వచ్చే బాయిల్డ్ రైస్ను తీసుకోమని కేంద్రం మెలిక పెట్టింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.
కొనుగోలు 3 లక్షల మెట్రిక్ టన్నులు..
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లోని ధాన్యాన్ని సేకరించి బియ్యాన్ని తీసుకునేందుకు ఎఫ్సీఐ ఖమ్మం జిల్లా కేంద్రంలో రెండు గోదాములను ఏర్పాటు చేసింది. సారథినగర్లో 75 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాము, ప్రకాశ్నగర్ లో 13 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదామును మాత్రమే ఎఫ్సీఐ నిర్మించింది. ఏటా నాలుగు జిల్లాల పరిధిలో దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్సీఐకి ఇస్తున్నది. నాలుగు జిల్లాల్లోకి బియ్యం మొత్తాన్ని ఈ రెండు గోదాముల్లో మాత్రమే నిల్వ చేయాలి. దాదాపు 2.12 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఏటా లారీల ద్వారా అన్లోడింగ్ పేరుతో రోడ్లపై నిల్వ ఉంచుతున్నది. దీంతో లారీ యాజమానులు, డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎఫ్సీఐలో బియ్యం ఎగుమతి, దిగుమతి చేసే హమాలీలు కూడా పనులు లేక రోజుల తరబడి వేచిఉండాల్సిన పరిస్థితి నెలకొన్నది.
వ్యాగన్ వస్తేనే లారీలు కదిలేది..
ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్డు వద్ద ఎఫ్సీఐ గోదాము వద్ద లారీలు రోడ్డుపై రోజుల తరబడి బారులు తీరి ఉంటున్నాయి. కేంద్ర ప్రభుత్వ లోపభూయిష్ట విధానాలతో వ్యాగన్లను సరైన సమయానికి పంపడం లేదు. అంతేకాకుండా, గోదాముల్లో బియ్యాన్ని నిల్వచేసే అవకాశం లేక రోజుల తరబడి బియ్యం తీసుకొచ్చిన లారీలు రోడ్లపైనే ఉండాల్సి వస్తున్నది. వర్షం వచ్చిన సందర్భాల్లో లారీ డ్రైవర్లు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. వ్యాగన్ ఒక్కసారి వస్తే గోదాము మొత్తం ఖాళీ అవుతుంది. తిరిగి వ్యాగన్ వచ్చే వరకు లారీలోని బియ్యాన్ని దిగుమతి చేయాల్సి రావడంతో కొద్ది సమయంలోనూ లక్షలాది బస్తాలు దిగుమతి చేయలేక హమాలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
బియ్యం దించాలంటే ఎంతో కష్టపడాలి..
ఎఫ్సీఐలో బియ్యం దిగుమతి చేయాలంటే చాలా కష్టం. సీరియల్ రావాలి, నంబర్లు తీసుకోవాలి. ఇంత చేశాక గేట్ దగ్గరకు వెళ్లగానే క్వాలిటీ అధికారి వచ్చి బియ్యం సరిగా లేవంటే తిరిగి మిల్లుకు తీసుకెళ్లాలి. క్వాలిటీ నచ్చితేనే బియ్యం దించుతారు.. ఒక్కోసారి వ్యాగన్లు రావడం ఆలస్యమైతే ఎన్ని రోజులైనా లారీని రోడ్డుపైనే ఉంచాలి. కిరాయిలు లేక ఇబ్బందులు పడాలి..