వన్యప్రాణుల కోసం అడవుల్లో విద్యుత్ తీగలు
కన్పించక తగిలి గాలిలో కలుస్తున్న నిండు ప్రాణాలు
భద్రాద్రి జిల్లాలో యథేచ్ఛగా కొనసాగుతున్న వేట
అడవి జంతువులే లక్ష్యంగా హెవీ కేవీ లైన్లకు లింకులు
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): ఎప్పుడూ నడిచే కాలిబాటేనని ఆదమరిచి రాత్రి పొలం వద్దకు వెళ్తే నిండు ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. అడవి దగ్గర్లో పచ్చని పొలాల్లో హాయిగా బతుకుతున్న కుటుంబాలు.. వేటగాళ్లు అమర్చిన ఉచ్చులకు విషాద జీవితాన్ని గడపాల్సి వస్తున్నది. చేనుకు వెళ్లిన రైతులు, కూలీలు, జంతువుల వేటకు వెళ్లిన వేటగాళ్లు అడవుల్లో విద్యుదాఘాతాలకు గురై మృత్యువాత పడుతుండడంతో వారి కుటుంబాలు విషాదాన్ని అనుభవిస్తున్నాయి.
మచ్చుకు కొన్ని సంఘటనలు..
4 అడవి పందుల బెడద నుంచి పొలాన్ని కాపాడుకునేందుకు రైతు భూక్యా భద్ర (45) పెద్దలైన్కు విద్యుత్ తీగలను అమర్చాడు. తరువాత తోటి రైతులతో కలిసి పొలానికి వెళ్లాడు. ఈ క్రమంలో విద్యుత్ తీగలు తగిలి మృతిచెందాడు. తాను అమర్చిన విద్యుత్ తీగలే తన ప్రాణాలు బలితీసుకుంటాయని ఊహించలేదు ఆ రైతు. దీంతో భార్య, పిల్లలు ఇంటి పెద్దదిక్కును కోల్పోయారు.
4 జిల్లాకు చెందిన పాయం జాన్బాబు (23), కూరం దుర్గారావు (40) అడవికి వెళ్లారు. వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి ప్రాణాలు కోల్పోయారు.
ఇలాంటి సంఘటనలు ఒకటీ రెండూ కాదు.. వందల సంఖ్యలో జరిగాయి. అటవీ ప్రాంతాల్లో ఎంతోమంది వేటగాళ్లు, రైతులు ఉచ్చులకు, విద్యుత్ తీగలకు తగిలి మృత్యువాత పడ్డారు.
ఆదమరిస్తే నిండు ప్రాణాలు హరీ..
భద్రాద్రి జిల్లాలో అటవీ విస్తీర్ణం అధికంగా ఉండడంతో వన్యప్రాణులు అధికంగా ఉంటున్నాయి. దీంతో వేటగాళ్లు ఈ ప్రాంతంపై దృష్టిపెట్టారు. రాత్రివేళలో అధిక వోల్టేజీ లైన్లకు విద్యుత్ తీగలను అమర్చి జంతువులను వేటాడుతున్నారు. వీరి స్వార్థంతో ఇటు అమాయక రైతులు, కూలీలు, అటు వేటగాళ్లు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక మూగజీవాలది మూగరోదనే. వందల కొద్దీ వన్యప్రాణులు ప్రాణాలు కోల్పోతున్నాయి. మేత కోసం అడవికి వెళ్లిన సాదు జంతువులూ బలవుతున్నాయి. రూ.లక్షల విలువగల పశుసంపద వేటగాళ్ల ఉచ్చుకు బలవుతోంది.