పినపాక, డిసెంబర్ 7: యాసంగిలో వరికి బదులుగా రైతులు ఇతర పంటలు వేసుకోవాలని భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ సూచించారు. మండలంలోని పోట్లపల్లి గ్రామంలో మంగళవారం నిర్వహించిన రైతు అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. యాసంగి ధాన్యాన్ని భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) కొనుగోలు చేయడం లేదు కాబట్టి రైతులు ఇబ్బంది పడకుండా ఇతర పంటలు సాగు చేసి ఆర్థికాభివృద్ధి సాధించాలని సూచించారు. కూరగాయలు, అపరాల సాగు ఎంతో లాభదాయకంగా ఉంటుందన్నారు. మండలంలోని భూములు ఆయిల్పామ్ సాగుకు అనుకూలంగా ఉన్నాయని, రైతులు ఆ దిశగా ఆలోచించాలని సూచించారు. అనంతరం ఆయన ఈ-బయ్యారం గ్రామంలో కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ను పరిశీలించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో సీసీ కెమెరాలను ప్రారంభించారు. వివిధ పనుల పురోగతిని పరిశీలించారు. డీఏవో అభిమన్యుడు, ఏడీఏ తాతారావు, పోట్లపల్లి సర్పంచ్లు కల్యాణి, కోరం రజిని, తహసీల్దార్ విక్రమ్కుమార్, ఎంపీడీవో శ్రీనివాసులు, ఏవో వెంకటేశ్వర్లు, ఏఈవో రమేశ్ తదితరులు పాల్గొన్నారు.