మామిళ్లగూడెం, డిసెంబర్ 7: 72వ సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని ఖమ్మం నగరంలోని ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ఎన్సీసీ క్యాడెట్లు, మాజీ సైనికులు, మాజీ సైనిక కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి కొండపల్లి శ్రీరామ్ త్రివిధ దళాల పతాకాన్ని ఎగుర వేసి అందరికీ స్టికర్లను అంటించి విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైనిక, నావిక, వైమానిక దళాల్లో చేరి దేశ రక్షణ కోసం అసువులు బాసిన సమరయోధుల త్యాగనిరతికి, దైర్య సాహసాలకు, దేశభక్తికి జోహార్లు అర్పించి వారి సేవలను గుర్తు చేసుకోవడమే ఈ పతాక దినోత్సవమని అన్నారు. దేశ రక్షణకు నిరంతరం సేవ చేస్తున్న త్రివిధ దళాలను ఉత్తేజ పరచడం కూడా ఇందులో భాగమేనన్నారు. ప్రతి ఒకరూ ఈ పవిత్ర కార్యాక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. దేశ రక్షణే ధ్యేయముగా విధి నిర్వహణలో అసువులు బాసిన, వికలాంగులైన యోధుల కుటుంబాలకు, మాజీ సైనికులకు దేశ ప్రజలందరూ ఎంతో రుణపడి ఉన్నారన్నారు. వారికి చేయూతనిచ్చి, వారి సంక్షేమం, పునరావాసం కోసం పాటుపడడం అందరి కర్తవ్యమన్నారు. ప్రభుత్వ కృషితోపాటు ప్రజల సహాయ సహకారాలూ ఎంతో అవసరమాన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సేకరించిన విరాళాలను పతాక దినోత్సవ నిధికి జమ చేస్తామన్నారు. వీటిని దేశ రక్షణ కోసం మరణించిన, వికలాంగులైన యోధులు, మాజీ సైనికులు, కుటుంబ సభ్యుల పునరావాసం కోసం వినియోగించనున్నట్లు చెప్పారు. ఈ విరాళాలకు ఆదయపు పన్ను మినహాయింపు కూడా ఉంటుందన్నారు. స్వచ్ఛంద విరాళాలను.. ‘సంచాలకులు, సైనిక సంక్షేమ శాఖ, హైదరాబాద్’ పేరిట డీడీ తీసి ఖమ్మంలోని ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి కార్యాలయంలో అందించవచ్చునన్నారు. అనంతరం కార్యాలయ సిబ్బంది, మాజీ సైనికులతో కలిసి కలెక్టర్ వీపీ గౌతమ్, అదనపు కలెక్టర్ మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, సీపీ విష్ణు ఎస్ వారియర్లను కలిసి విరాళాలను సేకరించినారు. మాజీ సైనిక సంక్షేమ సంఘ అధ్యక్షుడు ఫాన్సిస్, మాజీ సైనికులు పాల్గొన్నారు.