సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ
ఇప్పటికే సబ్కమిటీ ఏర్పాటు
దసరా తర్వాత ఎమ్మెల్యేల ద్వారా దరఖాస్తుల స్వీకరణ
పోడు రైతుల్లో చిగురిస్తున్న ఆశలు
ఖమ్మం, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పోడు భూముల సమస్యకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఏయే మండలాల్లో ఎంత భూమి ఉంది? ఎంత మంది పోడు సాగు చేస్తున్నారు.? అసలు పోడుభూమి ఎవరి చేతిలో ఉంది.? వాళ్లను అడ్డుపెట్టుకొని ఎవరైనా ఆక్రమించారా.? అనే అంశాలపై లెక్క తేల్చనున్నది. అద్దెకరం.. ఎకరం సాగు చేసుకునేవారికి న్యాయం చేయడంతోపాటు అర్హులైన గిరిజనులకు పట్టాలు అందజేయనున్నది. దసరా తర్వాత ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ఎమ్మెల్యేల ద్వారా దరఖాస్తులు తీసుకొని పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు కసరత్తు చేస్తున్నది. ఈ మేరకు పోడు సమస్యల పరిష్కారంలో అనుసరించాల్సిన విధానాలు, సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఒక సబ్ కమిటీని నియమించారు. ఈ కమిటీలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సభ్యుడిగా ఉన్నారు.
దశాబ్దాల తరబడి పోడు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్న పోడు రైతుల సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పోడు సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని రైతులు ఆశిస్తున్నారు. సమస్యల పరిష్కారంలో అనుసరించాల్సిన విధానాలు, సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఒక సబ్ కమిటీని నియమించారు. ఈ కమిటీలో జిల్లా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సభ్యుడిగా ఉన్నారు. ఆదివాసీలు, గిరిజనులకు భూములపై హక్కులు లేకపోవడం, కొన్ని ప్రాంతాల్లో పోడు భూములపై అటవీశాఖ అభ్యంతరం చెప్పడంతో దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం చూపేలా ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
వివరాల సేకరణకు చర్యలు..
దసరా తర్వాత ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల పరిధిలో శాసనసభ్యుల ద్వారా దరఖాస్తులు తీసుకొని పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా కసరత్తు మొదలు పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఏయే మండలాల్లో ఎంత భూమి ఉంది? ఎంతమంది పోడు సాగు చేస్తున్నారు.? అనే అంశాలపై పూర్తి వివరాలు సేకరించునున్నది. ఈ మేరకు శాసనసభలో పోడు సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తావనకు తీసుకొచ్చిన సంగతి విదితమే. గిరిజనులకు న్యాయం చేస్తామని, వారి హక్కులను కాపాడి తీరుతామని సభ సాక్షిగా ప్రకటించారు. పోడు రైతులకు ఇబ్బంది కలగకుండా చూస్తామని తేల్చి చెప్పడంతో ఉమ్మడి జిల్లాకు చెందిన పోడు రైతుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
80 వేల మంది పోడు రైతులు..
ఉమ్మడి జిల్లాలో 80 వేల మంది 4 లక్షల ఎకరాల పోడు భూములు సాగు చేస్తున్నారు. ఈ భూముల్లో 1.78 లక్షల ఎకరాలకు 2006లో అప్పటి ప్రభుత్వం అటవీ హక్కుల పత్రాలు ఇచ్చింది. మిగిలిన 2.20 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు మంజూరు చేయాలని రైతులు ఇప్పటికే దరఖాస్తులు అందించారు. భద్రాద్రి జిల్లాలో చర్ల, దుమ్ముగూడెం, పినపాక, కరకగూడెం, ఆళ్లపల్లి, గుండాల, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్, ములకలపల్లి, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, అశ్వారావుపేట మండలాల్లో పోడు భూముల సమస్య తీవ్రంగా ఉన్నది. అత్యధికంగా ఆళ్లపల్లి మండలంలో 7 వేల ఎకరాల్లో పోడు వ్యవసాయం కొనసాగుతున్నది.
సమస్యలు తీవ్రత ఉన్న గ్రామాలివీ..
ఆళ్లపల్లి మండలంలోని ఆళ్లపల్లి, మర్కోడు, జిన్నెలగూడెం, అనంతోగు, తిర్లాపురం గ్రామాల్లో పోడు భూముల సమస్య ప్రధానంగా ఉంది. కరకగూడెం మండలంలో 2 వేల ఎకరాల్లో గిరిజన రైతులు పోడు వ్యవసాయం చేస్తున్నారు. ఇందులో 500 మందికి ప్రభుత్వం అటవీహక్కుల పత్రాలు మంజూరు చేసింది. మిగిలిన వారికి అటవీ హక్కుల పత్రాలు రావాల్సి ఉన్నది. సమద్మోతే, తుమ్మలగూడెం, కొత్తగూడెం, రఘునందపాలెం పంచాయతీల పరిధిలో పోడు భూముల సమస్య ప్రధానంగా ఉన్నది. మణుగూరు మండలంలో రాయిగూడెం, పగిడేరు, రేగులగండి గ్రామాల్లో దాదాపు 500 ఎకరాల్లో పోడు వ్యవసాయం కొనసాగుతున్నది. అశ్వారావుపేట నియోజకవర్గంలోని దమ్మపేట, అశ్వారావుపేట, ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ మండలాల్లో దాదాపు 17 వేల ఎకరాల్లో గిరిజనులు పోడు వ్యవసాయం చేస్తున్నారు. వీరిలో దమ్మపేట ఫారెస్ట్ రేంజీ పరిధిలో 7,800 ఎకరాలకు గాను 3,500 మంది గిరిజన రైతులు అటవీ హక్కుల పత్రాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఫారెస్ట్ డివిజన్లో 1,350 ఎకరాలకు గాను 500 మంది గిరిజన రైతులకు అటవీహక్కు పత్రాలు ఉన్నాయి.
ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో 410 ఎకరాల్లో పోడు వ్యవసాయం కొనసాగుతున్నది. మండలంలో 40 మంది గిరిజనులు 150 ఎకరాలు, 90 మంది గిరిజనేతరులు 260 ఎకరాల్లో పోడు సాగు చేస్తున్నారు. ఇదే మండలంలోని మద్దులపల్లి, ఉటుకూరులో పోడు భూముల సమస్య తీవ్రంగా ఉన్నది. వీరికి అటవీహక్కుల పత్రాలు లేవు. దీంతో వీరికి ప్రభుత్వ సాయమేమీ అందడం లేదు. బూర్గంపహాడ్ మండలంలో 3,500 ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు. వీటిలో 1,000 ఎకరాలకు రైతులకు ప్రభుత్వం అటవీహక్కుల పత్రాలను అందించింది. ఇల్లెందు మండలంలో 23 వేల ఎకరాలు, టేకులపల్లి మండలంలో 12 వేల ఎకరాలు సాగవుతున్నాయి. సత్తుపల్లి మండలంలో వందలాది ఎకరాల్లో పోడు సాగు జరుగుతున్నది.
న్యాయం చేయాలి
నేను 35 ఏళ్ల నుంచి పోడు సాగు చేసుకుంటున్నా. ప్రస్తుతం రెండెకరాల్లో సాగు చేస్తున్నా. మా వద్ద అన్ని అర్హత పత్రాలు ఉన్నా అటవీ శాఖ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మా కుటుంబానికి ఈ రెండెకరాల భూమే దిక్కు. ప్రభుత్వం భూములను సర్వే చేసి తగిన న్యాయం చేయాలి.