ఉమ్మడి జిల్లాలో పెరగనున్న మద్యం దుకాణాలు
ఖమ్మంలో 33.. భద్రాద్రి కొత్తగూడెంలో 12
వచ్చేనెల నుంచి నూతన ఆబ్కారీ విధానం
రంగం సిద్ధం చేసుకుంటున్న ఆశావహులు
ఖమ్మం, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మద్యం టెండర్లకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నది. నూతన ఆబ్కారీ విధానంలో భాగంగా ఈ నెల రెండో వారంలో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించి.. మూడో వారంలో ఈ ప్రక్రియను పూర్తి చేసేలా కసరత్తు ముమ్మరం చేసింది. పాత ఆబ్కారీ విధానం గత నెలతో ముగియగా.. లైసెన్స్దారులకు మరో నెల రోజులు గడువు పొడిగించింది. దీని ప్రకారం ఈ నెల 30తో లైసెన్సు గడువు ముగియనున్నది. అయితే, ఈ సారి ఉమ్మడి జిల్లాలో గతంలో కంటే దుకాణాల సంఖ్య పెరుగనున్నది. దీనికితోడు రిజర్వేషన్లు కల్పించడంతో భారీగా దరఖాస్తులు చేసేందుకు ఆశావహులు ఉత్సాహం చూపుతున్నారు. ప్రభుత్వం ఒక్కో దుకాణానికి దరఖాస్తు ఫీజును రూ.2 లక్షలు నిర్ణయించింది. ఒక్కో దుకాణానికి 10 నుంచి 20 దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్నది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 165 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతినెలా ప్రభుత్వానికి రూ.170 నుంచి రూ.180 కోట్ల ఆదాయం సమకూరుతున్నది. 2015లో కొత్తగా 30 మద్యం దుకాణాలు పెరిగాయి. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 12 దుకాణాలు, ఖమ్మంలో 33 కొత్త దుకాణాలు పెంచేలా చర్యలు తీసుకుంటున్నది.
నూతన ఆబ్కారీ విధానాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. 2019-21 వరకు అమలులో ఉన్న ఆబ్కారీ విధానం గత నెలతో ముగియగా లైసెన్స్ దారులకు మరో నెల గడువు పొడిగించింది. దీని ప్రకారం ఈ నెల 30తో లైసెన్సు గడువు ముగియనున్నది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 165 మద్యం దుకాణాలు ఉండగా ప్రతి నెలా ప్రభుత్వానికి రూ.170 కోట్ల నుంచి రూ.180 కోట్ల ఆదాయం సమకూరుతోంది. 2015లో కొత్తగా 30 మద్యం దుకాణాలు పెరగగా అప్పటి నుంచి తిరిగి పెరగలేదు. తాజాగా ప్రభుత్వం భద్రాద్రి జిల్లాలో 12 దుకాణాలు, ఖమ్మం 33 కొత్త దుకాణాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నది.
డిమాండ్కు అనుగుణంగా..
కొత్తగా ఏర్పాటు చేసే దుకాణాలను డిమాండ్ ఎక్కువ ఉన్న ప్రాంతాలను ఎంపిక చేయనున్నది. ప్రధానంగా మణుగూరు, కొత్తగూడెం, మధిర, సత్తుపల్లి, భద్రాచలం, అశ్వారావుపేట, వైరాలో కొత్త దుకాణాలు వచ్చే అవకాశం ఉన్నది. ఇవి ఏర్పాటైతే ఉమ్మడి జిల్లాలో దుకాణాల సంఖ్య 210కి చేరనున్నది. గతంలో ఎప్పుడూ మద్యం దుకాణాల కేటాయింపు రిజర్వేషన్ల ప్రకారం జరగలేదు. ప్రభుత్వం ఈసారి రిజర్వేషన్లు ప్రకటించి వాటి ప్రకారం దుకాణాలను కేటాయించనున్నది. ఎస్సీ, ఎస్టీలతో పాటు గీత వృత్తివారికి సర్కార్ రిజర్వేషన్లు కల్పించింది. దీనిలో పీసా చట్టం ప్రకారం ఇప్పటికే ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు రిజర్వ్ అయిన వాటితో పాటు ఇతర ప్రాంతాల్లో గిరిజనులకు మరో 5 శాతం, ఎస్సీలకు 10, గౌడలకు 15శాతం రిజర్వేషన్లు కేటాయించింది. వచ్చే నెల నుంచి నూతన ఆబ్కారీ విధానం అమలుకానున్నది.
సిద్ధమవుతున్న ఆశావహులు..
జిల్లాలో నూతన ఆబ్కారీ విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వ కసరత్తు చేస్తున్నది. దుకాణాలను దక్కించుకునేందుకు ఆశావాహులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో గతంలో కంటే దుకాణాల సంఖ్య పెరుగుతుండడం, రిజర్వేషన్ల వెసులుబాటు ఉండడంతో గతంలో కంటే ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నది. పోటీ కూడా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉండనున్నది. ఒక్కో దుకాణానికి దరఖాస్తు ఫీజును రూ.2 లక్షలు నిర్ణయించగా నలుగురైదుగురు ఆశావహులు కొంత కొంత మొత్తాన్ని సేకరిస్తున్నారు. ఒకరిపై దరఖాస్తులు సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. ఒక్కో దుకాణానికి 10 నుంచి 20 దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. పబ్లిక్ డిమాండ్ ఎక్కువగా ఉన్నచోట ఇంకా పోటీ ఎక్కువనే ఉండనున్నది. ఈ నెల రెండో వారంలో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమై మూడో వారంలో ప్రక్రియను పూర్తి చేసేందుకు ఎక్సైజ్శాఖ కసరత్తు చేస్తున్నది. ఈమేరకు శనివారం ఆశాఖ ఉన్నతాధికారులు జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సలహాలు, సూచనలిచ్చారు. ప్రభుత్వం టెండర్ల ప్రక్రియను ఎప్పుడు ప్రకటించినా వెంటనే అమలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. సమావేశంలో కొత్త దుకాణాలు మరిన్ని పెరిగే అవకాశం ఉందని, ట్యాక్సులు పెంచే అవకాశం లేదని సూత్ర ప్రాయంగా చెప్పినట్లు తెలుస్తున్నది.
నూతన ఎక్సైజ్ విధానం ఇలా..
2021-23 లీజు కాలానికి ప్రభుత్వం రిటైల్ మద్యం దుకాణాల ఎంపికను నిర్వహించనున్నది. ఈ ప్రక్రియలో నూతన విధానాన్ని అనుసరిస్తున్నది. దరఖాస్తులకు గతంలో లాగానే నాన్ రిఫండబుల్ ఫీజును రూ.2 లక్షలుగా నిర్ణయించింది. షాప్ ఎక్సైజ్ టాక్స్ స్లాబ్లో ఎలాంటి మార్పు లేదు. గతంలో సంవత్సరానికి 50 లక్షలు, రూ.55 లక్షల ఎక్సైజ్ టాక్సులు అలాగే ఉంటాయి. టాక్సులు గతంలో నాలుగు వాయిదాల్లో చెల్లించగా ఇప్పుడు ఆరు వాయిదాల్లో చెల్లించడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. లైసెన్స్ పొందడానికి ముందు సమర్పించాల్సిన బ్యాంకు గ్యారెంటీ గతంలో నాలుగు వాయిదాలు ఉండేవి. ఇప్పుడు కేవలం రెండు వాయిదాలకే పరిమితం చేసింది. రానున్న లీవ్ కాలానికి ప్రస్తుతం బ్యాంక్ గ్యారెంటీ వార్షిక ఎక్సైజ్ టాక్స్లో కేవలం 25 శాతానికి మాత్రమే 25 నెలల కాలపరిమితితో ఇవ్వాల్సి ఉంటుంది.