ఈ నెల 8న చెల్లించే అవకాశం
ట్రైనీ కార్మికులకు రూ.12,500 ఖరారు
పది వాయిదాల్లో రికవరీ
కొత్తగూడెం సింగరేణి, అక్టోబర్ 6 : సింగరేణి కార్మికులకు దసరా పండుగకు ముందుగా ఇచ్చే అడ్వాన్స్ను ఈ నెల 8న చెల్లించేందుకు యాజమాన్యం నిర్ణయించి సర్క్యూలర్ జారీ చేసింది. కార్మికులకు గతంలో మాదిరిగానే రూ.25వేల అడ్వాన్స్ చెల్లించాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. బదిలీ వర్కర్లు, టెంపరరీ ట్రైనీ కార్మికులకు మాత్రం అడ్వాన్స్గా రూ.12,500 చెల్లిస్తారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే సింగరేణి యాజమాన్యం కార్మికులకు చెల్లిస్తున్న రూ.25వేల అడ్వాన్స్ను 10 సమాన వాయిదాల్లో (నెలకు రూ.2500) చొప్పున కార్మికుల జీతాల నుంచి రికవరీ చేస్తారు. ట్రైనీ కార్మికులకు నెలకు రూ.1250గా రికవరీ చేస్తారు. డిసెంబర్ జీతం నుంచి 10 నెలల పాటు అడ్వాన్స్ను యాజమాన్యం రికవరీ చేసుకోనుంది. ఈ నెల 15వ తేదీన దసరా పండుగ ఉండడంతో వారం రోజుల ముందుగానే కార్మికుల బ్యాంకు ఖాతాల్లో అడ్వాన్స్ జమ చేయాలని నిర్ణయించారు. ఈసారి దసరా అడ్వాన్స్ను రూ.30వేలకు పెంచాలని గుర్తింపు కార్మిక సంఘమైన టీబీజీకేఎస్ డిమాండ్ చేసింది. కానీ సింగరేణి యాజమాన్యం మాత్రం గతంలో మాదిరిగానే రూ.25 వేల అడ్వాన్స్ చెల్లించేందుకే నిర్ణయించింది. ఈ నెలలోనే కార్మికులకు 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లాభాల వాటా చెల్లించాల్సి ఉండడం, దీపావళి పండుగకు ముందుగా పీఎల్ఆర్ బోనస్గా రూ.72,500 ఇవ్వాల్సి ఉండడంతో సంస్థపై తీవ్ర ఆర్థిక భారం పడుతున్నది. ఈ కారణంగానే దసరా అడ్వాన్స్ను రూ.25వేలకే పరిమితం చేసినట్లు తెలుస్తున్నది.
దసరాకు ముందే లాభాల వాటా..
సింగరేణి సంస్థ 2020-21 ఆర్థిక సంవత్సరంలో సాధించిన లాభాలను అధికారికంగా మంగళవారం ప్రకటించిన సింగరేణి యాజమాన్యం.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రూ.272.2 కోట్ల లాభాలపై 29 శాతం వాటాను దసరాకు ముందుగానే చెల్లించే అవకాశముంది. ఈ క్రమంలో సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ముఖ్య నాయకులు సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ను కలిసి లాభాల వాటా చెల్లించే తేదీని ప్రకటించనున్నారు. దసరా అడ్వాన్స్ను ఈ నెల 8వ తేదీనే కార్మికుల ఖాతాలో జమ చేస్త్తున్న క్రమంలో ఈ నెల 11వ తేదీన కార్మికులకు లాభాల వాటాను చెల్లించనున్నారు. అలాగే వచ్చే నెల 1వ తేదీన పీఎల్ఆర్ బోనస్ కార్మికులకు ఇవ్వనున్నారు.