ఊరూరా ఉట్టిపడుతున్న పచ్చదనం
ఖమ్మం జిల్లాలో హరితహారం విజయవంతం
రహదారుల పొడవునా నీడనిస్తున్న చెట్లు
మొక్కల పెంపకంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
సర్పంచ్, గ్రామ కార్యదర్శులకు బాధ్యతలు
589 నర్సరీల్లో ఏటా 90 లక్షల మొక్కలు
ఖమ్మం, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రతి పల్లె పచ్చదనంతో తొణికిసలాడాలని, ప్రతి పట్టణం హరితమయం కావాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన హరితహారం ఖమ్మం జిల్లాలో ఉద్యమ రూపం దాల్చింది. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం, అవి వృక్షాలుగా ఎదిగేందుకు తోడ్పాటు అందించడం సామాజిక బాధ్యతగా ప్రభుత్వం చేసిన ప్రచారం ఖమ్మం జిల్లా ప్రజల్లో అత్యంత వేగంగా ప్రభావం చూపింది. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే హరితహారం కార్యక్రమంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు 7 విడతలుగా జరిగిన హారితహరం కార్యక్రమం సత్ఫలితాలనిచ్చింది. ఏడేండ్ల క్రితం నాటిన మొక్కలు నేడు వృక్షాలుగా మారి ప్రజలకు ప్రధాన రహదారుల వెంట ఆహ్లాదాన్ని, ఆక్సీజన్ను ఇస్తున్నాయి. ఏటా క్రమం తప్పకుండా మొక్కలు నాటడం, వాటి సంరక్షణకు జాగ్రత్తలు తీసుకుంటుండడంతో అవన్నీ ఏపుగా పెరుగుతున్నాయి. జిల్లాలో 589 నర్సరీలను ఏర్పాటు చేసి వాటిల్లో ఏటా 90 లక్షలకు తగ్గకుండా మొక్కలు పెంచుతున్నారు.
ఖమ్మం రూరల్ మండలం దానవాయిగూడెంలో 5 ఎకరాల విస్తీర్ణంలో తాటి, ఈత వనాన్ని పెంచుతున్నారు. మరో రెండేళ్లలో అవి వినియోగంలోకి రానున్నాయి. తొలుత హరితహారాన్ని ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమంగా ప్రజలు పరిగణించినా.. రెండో విడత నుంచి ప్రజల భాగస్వామ్యం పెరుగుతూ వచ్చింది. హరితహారంలో కేవలం నీడనిచ్చే మొక్కలను కాకుండా పూలు, పండ్లు, ఆదాయం, ఆహ్లాదం వంటి వాటిని ఇచ్చే మొక్కలనూ పెంచడంతో ప్రజల భాగస్వామ్యం మరింత పెరిగింది. మొక్కల పెంపకం బాధ్యతను సర్పంచ్, కార్యదర్శులకు అప్పగించడంతో 7 విడతలుగా నాటిన మొక్కలు ఏపుగా ఎదుగుతున్నాయి. ఖమ్మం నుంచి నలు దిశాలా వెళ్లే అన్ని రహదారుల వెంటా పచ్చని మొక్కలు నీడనిస్తున్నాయి.